ముంబై, జనవరి 10: స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాలతో కళకళలాడాయి. నూతన సంవత్సరంలో భారీగా లాభపడ్డ సూచీ అదే జోరును సోమవారం కూడా కొనసాగించింది. ఐటీ, ఆర్థిక రంగ షేర్ల నుంచి లభించిన మద్దతుతో సెన్సెక్స్ మళ్లీ 60 వేల మార్క్ను దాటగా, నిఫ్టీ సైతం 18 వేల మార్క్ను అధిగమించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికపు ఆర్థిక ఫలితాలు ఆశాజనకంగా ఉండనున్నట్లు వచ్చిన ముందస్తు అంచనాలు మార్కెట్లకు మరింత జోష్ పెంచింది. వరుసగా రెండో రోజు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ సోమవారం ఒక దశలో 60,427 పాయింట్ల గరిష్ఠ స్థాయిని తాకింది. చివరకు 650.98 పాయింట్ల(1.09 శాతం) లాభంతో 60,395.63 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 190.60 పాయింట్లు(1.07 శాతం) అందుకొని 18,003.30 వద్ద ముగిసింది.