పటాన్చెరు టౌన్, మే 16 : రాష్ట్ర కార్మిక శాఖ, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్, సంగారెడ్డి జిల్లాకు చెందిన రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా మధ్య అంతర్గతంగా ఆధిపత్య పోరు కొనసాగుతున్నది. ఏప్రిల్ 12న పటాన్చెరులో జరిగిన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమానికి మంత్రులు వివేక్, దామోదర్ రాజనర్సింహా ఇద్దరు హాజరుకావాల్సి ఉండగా, మధ్యాహ్నం సమయంలో దామోదర రాజనర్సింహా ఒక్కరే వచ్చి మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్, డైరెక్టర్లతో హడావిడిగా ప్రమాణ స్వీకారం చేయించిన మంత్రి, ఒక్కరే మాట్లాడి వెళ్లిపోయారు.
ఆ ఆర్వాత నిమిషాల వ్యవధిలో మంత్రి వివేక్ ప్రమాణ స్వీకారోత్సవానికి వచ్చారు. కార్యక్రమం ముగిసిందని భావించిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు.. మంత్రి వివేక్ రావడంతో మళ్లీ మొదటి నుంచి ప్రారంభించినట్లు అయ్యింది. ప్రమాణ స్వీకారోత్సవం అట్టహాసంగా జరుగుతుందని భావించిన కాంగ్రెస్ నాయకులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఇద్దరు మంత్రలు కలిసి పాల్గొనాల్సిన కార్యక్రమంలో ఒకరు వెళ్లిన తర్వాత మరొకరు రావడం ఏమిటని గుసగుసలాడారు. మంత్రు ల మధ్య ఆధిపత్య పోరు మొదలైనట్లు ఆరోజే అందరూ గుర్తించారు.
శనివారం పటాన్చెరు నియోజకవర్గంలోని భానూరు గ్రామంతో పాటు ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనలకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ పాల్గొంటున్నారని కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ఏర్పాట్లను పర్యవేక్షించారు. కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున్న ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంత్రం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహా కూడా కార్యక్రమంలో పాల్గొంటారని ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి అధికారులకు ఆదేశాలు వచ్చా యి. దీంతో మంత్రి వివేక్ ఒక్కరి ఫొటోతో సిద్ధ్దం చేసిన ఫ్లెక్సీని పక్కనపెట్టి దామోదర రాజనర్సింహా, వివేక్ ఫొటోలతో మున్సిపల్ అధికారులు మరో ఫ్లెక్సీని ప్రింట్ చేయించారు.
రాత్రంతా మున్సిపల్ అధికారులు, సిబ్బంది టెంట్ వేయించి స్టేజీలు సిద్ధం చేశా రు. శిలాఫలకాల చుట్టూ పూలతో ముస్తాబు చేయించారు. తీరా అన్ని ఏర్పాట్లు అయ్యాక శనివారం ఉదయం మంత్రుల కార్యక్రమం రద్దు అయ్యిందని, 19వ తేదీకి వాయిదా పడిందని మున్సిపల్ అధికారులు చెప్పారు. మంత్రుల మధ్య ఆధిపత్య పోరుతోనే కార్యక్రమం రద్దు అయ్యిందని ప్రజలు, అధికారులు, కాంగ్రెస్ కార్యకర్తలు గుసగుసలాడారు. ఇద్దరు మంత్రు ల ఆధిపత్య పోరులో కాంగ్రెస్ నాయకులు ఇబ్బందులు పడుతున్నారు. 19న జరిగే కార్యక్రమంలో మంత్రుల మధ్య ఆధిపత్య పోరు ముదిరి మాటల యుద్ధ్దం వరకు వెళ్లే అవకాశం లేకపోలేదని కొంత మంది అంటున్నారు.