గుప్పెడు మందితో కదిలి, కోట్లాది మందిని కదిలించిన చరిత్ర దండి యాత్రది. సత్యమే మా ఆయుధమంటూ సాగిన సత్యాగ్రహ యాత్ర, శాసనోల్లంఘనమై స్వతంత్ర భారతానికి బాటలేసింది. ఉప్పు రాజేసిన రాజకీయం దావానలమై దేశమంతా అంటుకుంది. నియంతృత్వ చట్టాలను ధిక్కరించిన ఆ ప్రజా పోరాటమే భారత స్వాతంత్య్ర సాధనకు తొలి స్ఫూర్తి.
‘మేము జీవన్మరణ పోరాటానికి సిద్ధమవుతున్నాం. పవిత్ర యుద్ధంలోకి దిగతున్నాం. మరణాన్ని ఆలింగనం చేసుకుని మమ్మల్ని నైవేద్యంగా సమర్పించుకుంటాం’ అంటూ సబర్మతి ఆశ్రమం నుంచి మహాత్మా గాంధీ ముందడుగు వేశారు. బాపూజీని అనుసరిస్తూ కదిలిన 79 మంది సత్యాగ్రహులతో 1930 మార్చి 12న దండి యాత్రకు దండు కదిలింది.
నవ్వుకున్నారిలా..
దండియాత్ర ప్రపంచాన్ని మార్చిన యాత్రలలో ఒకటిగా చరితార్థమవుతుందని ఎవరూ ఊహించలేదు. ఒక్క గాంధీజీ తప్ప! శాసనోల్లంఘనకు ఉప్పుని ఎంచుకోవడం కాంగ్రెస్ నేతలకు రుచించలేదు. ఈ నిర్ణయం ఎంత హేళనకు గురైందంటే?.. ‘దండి యాత్ర గురించి విని నవ్వాపుకోవడం కష్టం. ఆలోచనాపరులైన భారతీయులందరి మానసిక స్థితి ఇదేనని అనుకుంటున్నాం’ అంటూ స్టేట్స్ మన్ పత్రిక విమర్శించింది. ఇక వైస్రాయ్ ఈ యాత్ర ఎంత తేలిగ్గా తీసుకున్నాడో! ‘ఆ దండి యాత్ర నా నిద్రనేమీ చెడగొట్టలేదు’ అంటూ లండన్కు ఉత్తరం రాశాడు.
ఉప్పు చేసే మేలు!
ఎవరేమి అనుకున్నా గాంధీ లక్ష్యం మారలేదు. ‘గాలి, నీరు తర్వాత ఉప్పే జీవితానికి అత్యవసర’మని గాంధీ అన్నాడు. పేద భారతీయులకు భారమైనది ఉప్పు పన్నే అన్నాడు. అర్థం కాని నినాదాలతో హక్కుల కోసం ఉద్యమం చేసేకంటే ప్రజలకు నేరుగా ఉపయోగపడే ఉప్పు పన్ను రద్దు కోరడం వల్ల వారిలో ప్రతిస్పందన వస్తుందని భావించాడు. 1882 నాటి ఉప్పు చట్టాన్ని ఉల్లంఘిస్తూ శాసనోల్లంఘన ఉద్యమాన్ని నిర్వహించాలన్నది గాంధీ ప్రణాళిక.
నదిలా సాగిన యాత్ర
ప్రవాహ మార్గంలో అక్కడక్కడా వాగులు, సెలయేళ్లను తనలో కలుపుకుంటూ నదీ ప్రవాహం ముందుకు సాగినట్టే దండియాత్ర పల్లె, పట్టణ ప్రజలను కలుపుకుంటూపోయింది. తెల్లని వస్త్రాలు ధరించిన సత్యాగ్రహుల యాత్ర నదీ
ప్రవాహంలా ఉందట!
గ్రామగ్రామాన ఆగుతూ, స్థానికులతో మాట్లాడుతూ గాంధీ సేన కదంతొక్కుతోంది. 24 రోజుల్లో 4 జిల్లాల్లోని 48 గ్రామాల మీదుగా ఉత్సాహంగా యాత్ర సాగుతోంది. దారిలో మొదటి గ్రామమైన అస్లాలీ చేరుకున్నప్పుడు 4 వేల మంది, సూరత్లో 30 వేల మంది, దండిలో 50 వేల మంది ప్రజలు ఎదురొచ్చి.. మేళ తాళాలతో గాంధీ, సరోజనీ నాయుడుకి ఆహ్వానం పలికారు. ఈ సత్యాగ్రహ మార్గంలో ప్రతి రోజూ సాయంత్రం ఒక ఊరిలో ఆగిపోయేవాళ్లు. తమ బాధలు, కన్నీళ్ల గురించి గాంధీ చెబుతుంటే ప్రజలు చలించిపోయేవారు. సత్యాగ్రహులందరికీ తిండి పెట్టి, నీళ్లు తాపి వీడ్కోలు పలికేవారు.
వెల్లువైన ప్రవాహం
గాంధీ ప్రసంగాలకు ప్రభావితులై సత్యాగ్రహ ఉద్యమానికి మద్దతు పలుకుతూ గ్రామాధికారులు బ్రిటిష్ పాలనకు సహకరించబోమని రాజీనామాలు చేశారు. విరాళాలు వసూలు చేసి, సత్యాగ్రహులకు అందజేశారు. తామూ సత్యాగ్రహోద్యమంలో పాల్గొంటామని పేర్లు నమోదు చేసుకున్నారు. ఇలా దండి యాత్ర అంతకు ముందెన్నడూ లేని పోరాటాలకు భిన్నంగా 385 కిలోమీటర్లు విజయవంతంగా సాగిపోయింది.
పునాదులు పెకిలించిన వేళ
దండి యాత్రకు ఎక్కడా ప్రభుత్వం ఆటంకం కలిగించలేదు. ‘ఇది బ్రిటిష్ పాలకులలో వచ్చిన నిజమైన హృదయ పరివర్తన. వారి విధానాల్లో కూడా మార్పు వస్తే ఎంత బాగుండున’ని గాంధీ ఆశపడ్డాడు. ఏప్రిల్ 6న ఉదయం 6:30 గంటలకు గాంధీ బురద ఉప్పుని పిడికిట్లోకి తీసుకుని ఉప్పు చట్టాలను ఉల్లంఘించారు. ‘దీనితో నేను బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులను కదిలిస్తున్నాను’ అని ప్రకటించాడు. ఆ బురద ఉప్పుని సముద్రపు నీటిలో ఉడకబెట్టి ఉప్పు తయారు చేశాడు. ‘ఎక్కడ ఉప్పుని ఉడకబెట్టే వీలుంటే అక్కడ ఉప్పుని తయారు చేయండ’ని వేలాదిమంది అనుచరులను ప్రేరేపించాడు. లక్షలాది మంది ఉప్పు తయారు చేయడం, అమ్మడం, కొనడంతో శాసనోల్లంఘన ఉద్యమం దేశవ్యాప్తంగా విజయ వంతమైంది. చివరగా, దండి వద్ద 24వ రోజు ఈ యాత్ర ముగిసింది.
సత్యాగ్రహానిదే అంతిమ విజయం
‘బలవంతుడితో చేసే ఈ హక్కుల పోరాటంలో నాకు ప్రపంచ మద్దతు కావాలి’ అని ఉప్పు సత్యాగ్రహం ముగిస్తూ గాంధీ ప్రకటించాడు. దండి యాత్రలో దారిపొడవునా సహనమే ప్రదర్శించిన బ్రిటిష్ ప్రభుత్వం ఉప్పు చట్టాన్ని ధిక్కరించగానే సహనం కోల్పోయింది. మే 4వ తేదీ రాత్రి గాంధీని అరెస్ట్ చేశారు. గాంధీ జైలు నుంచి విడుదలయ్యాక రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో వైస్రాయ్ లార్డ్ ఇర్విన్తో చర్చలు ఫలప్రదం అయ్యాయి. ఉప్పు సత్యాగ్రహం ముగిసింది.