కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల సౌలభ్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలనలో సంస్కరణలు తీసుకువచ్చారని, ప్రభుత్వ పథకాల అమలులో గ్రామ కార్యదర్శుల పాత్ర కీలకం శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. శనివారం బాన్సువాడ నియోజకవర్గంలోని జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్- IV పంచాయతీ కార్యదర్శులుగా నియామక ఉత్తర్వులను బాన్సువాడలోని సభాపతి నివాసంలో అందజేశారు.
ఈ సందర్భంగా స్పీకర్ పోచారం మాట్లాడుతూ..గతంలో 10 జిల్లాలు ఉంటే 33 జిల్లాలుగా ఏర్పాటు చేసుకున్నాం. రెవెన్యూ డివిజన్లు 48 అయితే 72 కు పెంచుకున్నాం. మండలాలు 460 ఉంటే నూతనంగా ఏర్పాటు అయిన వాటితో కలిపి 610 అయ్యాయని పేర్కొన్నారు. అదేవిధంగా గతంలో గ్రామ పంచాయతీలు 8,670 ఉండగా కొత్తగా ఏర్పాటు చేసిన పంచాయతీలు కలిపి 12751 ఉన్నాయి. గతంలో ఒక సెక్రటరీకి అనేక గ్రామాలు ఉండేవి.
సమర్ధవంతంగా పనిచేయలేని పరిస్థితి ఉండేదని, దానికి బీఆర్ఎస్ ప్రభుత్వం చెక్ పెట్టిందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న నిధులను సక్రమంగా ఖర్చు చేయడంలో, గ్రామ అవసరాలను తీర్చడంలో పంచాయతీ సెక్రటరీలు సమర్ధవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు సమిష్టిగా పనిచేస్తే మంచి ఫలితాలు ఉంటాయని పేర్కొన్నారు.