హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): ఉన్నతి పథకంలో ప్రతిభ కనబర్చిన 75 మంది యువతీ, యువకులను కేంద్ర ప్రభుత్వం ఈ నెల 24న ఢిల్లీలో సన్మానించనున్నది. వీరిలో తెలంగాణకు చెందిన 8 మంది ఉన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా ఒక్కో పేద కుటుంబానికి సంవత్సరంలో గరిష్ఠంగా 100 రోజుల పనిదినాలను కల్పిస్తున్న ప్రభుత్వం.. ఆయా కుటుంబాల్లోని యువతను ఆదుకొనేందుకు 2019 డిసెంబర్లో ఉన్నతి పథకాన్ని ప్రారంభించింది. 18 నుంచి 35 ఏండ్లలోపువారికి రెసిడెన్షియల్ విధానంలో శిక్షణ ఇప్పించి, ప్రైవేటు రంగంలో ఉపాధి కల్పిస్తున్నది. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, మహిళలకు ప్రాధాన్యమిస్తున్నది. వీరి శిక్షణకు అయ్యే ఖర్చును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తిలో భరిస్తున్నాయి. ఇలా ఇప్పటివరకు రాష్ట్రంలో 25 వేల మందికి ఉపాధి లభించింది.
మా అమ్మ, నాన్న కూలీలు. నేను గతంలో ఆటో నడిపేవాడిని. నాకు వరంగల్లో ట్రైనింగ్ ఇప్పించి, రిలయన్స్ ట్రెండ్స్లో ఉద్యోగం ఇప్పించారు. ప్రస్తుతం ఈ సంస్థలో టీమ్ లీడర్గా పనిచేస్తున్న నన్ను ఢిల్లీలో సన్మానించనున్నట్టు సమాచారమిచ్చారు. చాలా సంతోషంగా ఉన్నది. ఈ విషయాన్ని మొదట నా తల్లిదండ్రులకే చెప్పిన. – తోకల రాజశేఖర్, సోమన్పల్లి, మంచిర్యాల జిల్లా
మా అమ్మ, నాన్న కూలి పనులు చేస్తారు. మాకు సొంత భూమి లేదు. పీజీ పూర్తిచేసిన నాకు శిక్షణ ఇప్పించి, ఫర్నిచర్ వరల్డ్ డిజైన్లో ఉద్యోగం ఇప్పించారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఉద్యోగ నియామకాలు చేపడుతున్నందున వాటికీ సిద్ధమవుతా. ఢిల్లీలో నన్ను సన్మానిస్తారని తెలిసినంక చాలా సంతోషం అనిపించింది.
– కందిక నాగరాజు, పున్నేలు, హనుమకొండ జిల్లా