హైదరాబాద్, ఆటప్రతినిధి: వన్డే ప్రపంచకప్ ఆడేందుకు ఏడేండ్ల తర్వాత భారత్లో అడుగుపెట్టిన పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. హైదరాబాదీల ఆతిథ్యంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నది. ఇక్కడి వంటకాలతో పాటు వాతావరణాన్ని బాగా ఆస్వాదిస్తున్నట్లు పాకిస్థాన్ వైస్ కెప్టెన్ షాదాబ్ ఖాన్ వెల్లడించాడు. ఆదివారం ఉప్పల్ స్టేడియంలో నిర్వహించిన మీడియా సమావేశంలో షాదాబ్ మాట్లాడుతూ.. ‘ఇక్కడి వాతావరణం, పరిస్థితులు అచ్చం పాకిస్థాన్లో లాగే ఉన్నాయి.
ఉప్పల్లో న్యూజిలాండ్తో జరిగిన వార్మప్ మ్యాచ్ రావల్పిండిని తలపించింది. ఫ్లాట్ పిచ్, చిన్న బౌండ్రీలు ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యాయి. హైదరాబాదీల ఆతిథ్యం నచ్చింది. ఆహారం చాలా రుచికరంగా ఉంది. ఇక్కడే ఉంటే బరువు పెరగడం ఖాయం. టీమ్ఇండియాలో రోహిత్ శర్మ అంటే నాకు చాలా ఇష్టం. అతడు ఫామ్లో ఉంటే అడ్డుకోవడం కష్టం’ అని పేర్కొన్నాడు.