న్యూఢిల్లీ, ఏప్రిల్ 29: దేశీయ ఆటో రంగ దిగ్గజం టాటా మోటర్స్ ఓ సూపర్ ఎలక్ట్రిక్ కారును తీసుకురాబోతున్నది. శుక్రవారం ఈ సరికొత్త ఎస్యూవీ కాన్సెప్ట్ విద్యుత్తు ఆధారిత కారు మోడల్ను కంపెనీ ఆవిష్కరించింది. ‘అవిన్య’ పేరుతో మార్కెట్కు పరిచయం కానున్న ఈ ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ)లో.. ఒక్క చార్జింగ్పై ఏకంగా 500 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు.
అదికూడా అరగంటలోనే చార్జింగ్ పూర్తవుతుంది. తర్వాతి తరం ఈవీల మార్కెట్లో పెను సంచలనంగా కనిపిస్తున్న ఈ కారును 2025కల్లా అందుబాటులోకి తేవాలని టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (టీపీఈఎం) ప్రయత్నిస్తున్నది. కారు ధర, ఇందులోని సదుపాయాలు, సౌకర్యాల పూర్తి వివరాలు కూడా తర్వాతే తెలియనున్నాయి.
ఇక ఈ థర్డ్ జనరేషన్ ఆర్కిటెక్చర్ కార్లలో అల్ట్రా-ఫాస్ట్ చార్జింగ్ సామర్థ్యం కలిగిన బ్యాటరీలను వినియోగిస్తున్నామని ఈ సందర్భంగా సంస్థ తెలియజేసింది. లోపల ఎంతో విశాలంగా కనిపిస్తున్న ఈ కార్లలో సైడ్ సీటింగ్, వినూత్నరీతిలో డోర్లను ఏర్పాటు చేశారు. కాగా, దేశీయ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో ఇప్పటికే టిగోర్, నెక్సాన్ మోడళ్లతో దూసుకుపోతున్న టాటా మోటర్స్.. రాబోయే ఐదేండ్లలో ఈవీల వ్యాపారంపై రూ.15,000 కోట్ల పెట్టుబడులను పెట్టనున్నది.