జనగామ : ఈ నెల 11న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్న జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన ఏర్పాట్లు ఘనంగా ఉండాలని మంత్రులు ఎర్రబెల్లి దయాకరరావు, సత్యవతి రాథోడ్ జిల్లా అధికారులను ఆదేశించారు.
సోమవారం జనగామ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రులు కలెక్టర్ శివలింగయ్య, జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు.
ప్రారంభోత్సవానికి సిద్ధమైన సమావేశ మందిరం, అధికారుల కార్యాలయాలు, పూజగది, భోజనాల ఏర్పాట్లు చేసే గదులను, స్థలాలను, మీటింగ్ హాల్లో జిల్లా వైభవాన్ని తలపింప జేసే ఫొటోలు, ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల ఫొటోలను మంత్రులు పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కలెక్టర్ కార్యాలయంను అద్దంలా ఉంచాలని, పచ్చదనం ఉట్టిపడేలా పూలమొక్కలు ఏర్పాటు చేయించాలన్నారు.
కార్యాలయ గోడలు, అద్దాలు, గ్రౌండ్ ఫ్లోరింగ్ లను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుతూ ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంచాలన్నారు.అతిథులకు భోజన, వసతి సదుపాయాలు ప్రణాళికాబద్ధంగా చేపట్టాలన్నారు.
ముఖ్యమంత్రి రాక సందర్భంగా అధికారులు తయారు చేయిస్తున్న వంటకాలను, ఏర్పాట్లను మంత్రులు అడిగి తెలుసుకున్నారు. అధికారులకు వంటకాలపై సలహాలు, సూచనలు ఇచ్చారు.
మంత్రుల వెంట అదనపు కలెక్టర్లు అబ్దుల్ హమీద్, భాస్కర్, జడ్పీ సీఈవో విజయలక్ష్మి, డి.ఆర్.డి.ఏ.పీడీ రాంరెడ్డి, సి.పి.ఓ.ఇస్మాయిల్, జనగామ, స్టేషన్ ఘన్పూర్ ఆర్డీవోలు మధు మోహన్, కృష్ణవేణి, జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి, విద్యాధికారి రాము, డి.సి.హెచ్.ఎస్. సుగుణాకర్ రాజు, పశుసంవర్ధక అధికారి నర్సయ్య, బిసి కార్పొరేషన్ ఈ.డి. రవీందర్, పౌరసరఫరాల అధికారి రోజా రాణి, జనగాం తాసిల్దార్ రవీందర్, స్థానిక 3వ వార్డు కౌన్సిలర్ పగిడిపాటి సుధ, తదితరులు ఉన్నారు.