పెద్దపల్లి, ఫిబ్రవరి18 : జిల్లాలో ప్రణాళికాబద్ధంగా ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమాన్ని అమలు చేయాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లాలో మన ఊరు-మన బడి,మన బస్తీ కార్యక్రమం అమలుపై కలెక్టర్, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్ తో కలిసి జూమ్ యాప్ ద్వారా మంత్రి రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం కేసీఆర్ ఒక్కో రంగంలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు.
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు సీఎం కేసీఆర్ రూ.7600 కోట్లు మంజూరు చేసి మన ఊరు మన బడి కార్యక్రమం రూపొందించారని మంత్రి పేర్కొన్నారు మన ఊరు మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో 12 అంశాల్లో పనులు చేపడుతారి మంత్రి తెలిపారు.
ప్రహరీ గోడ, కిచెన్ షెడ్డు, డిజిటల్ విద్య, నీటి సదుపాయం తో టాయిలెట్స్, త్రాగునీటి సౌకర్యం, గ్రీన్ చాక్ బోర్డులు, ఫర్నిచర్, పాఠశాలకు పెయింట్ వేయడం, శిథిలావస్థలో ఉన్న గదులకు బదులుగా అదనపు గదుల నిర్మాణం, విద్యుదీకరణ, మరమ్మతులు, డైనింగ్ హాల్ ఏర్పాటు అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని సమిష్టిగా విజయవంతం చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.