అమరావతి : ప్రభుత్వ భూమిని కబ్జాచేసిన టీడీపీ నాయకుడు అయ్యన్నపాత్రుడు వ్యవహారంలో చట్టం తనపని తాను చేసుకుంటుందని ఏపీ మంత్రులు కారుమూరి నాగేశ్వర్ రావు, తానేటి వనిత పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా నర్సిపట్నంలో అయ్యన్న ఇంటి ప్రహరీ కూల్చివేతపై స్పందించారు. పంట కాలువకు చెందిన రెండున్నర సెంట్ల భూమిలో అయ్యన్నపాత్రుడు ప్రహరీని అక్రమంగా నిర్మించారని ఆరోపించారు. ఈ విషయంలో మున్సిపల్ అధికారులు అయ్యన్నపాత్రుడు కుటుంబానికి నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతోనే అధికారులు కూల్చివేతకు పూనుకున్నారని వారు తెలిపారు.
ఇది కక్షపూరిత చర్యలు కావని స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వం ఎవరి మీద కూడా కక్షపూరితంగా వ్యవహరించడం లేదని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు తప్పుటు చేస్తూ బీసీలపై రుద్దటం అవమానకరమని ఆరోపించారు. చంద్రబాబు బీసీలకు ఎలాంటి న్యాయం చేయరని కారుమూరి విమర్శించారు. తప్పులు చేస్తే ఎంతటి వారినైనా చట్టం శిక్షిస్తుందని అన్నారు.
చంద్రబాబు జిల్లాల పర్యటనలో వైసీపీ పాలనపై నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు. టీడీపీ పాలనలో విజయవాడ నగరంలో ఎన్నో గుడులను కూల్చివేయించారని ఆరోపించారు.