హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మతపరమైన ఉద్యోగ నియామకాల ప్రక్రియ ఆసాంతం లోపభూయిష్టంగా కొనసాగుతున్నది. అర్చక, పరిచారక, వేదపారాయణదారు, చండీపారాయణదార్ల నియామకాల్లో అవకతవకలు జరుగుతున్నట్టు విమర్శలున్నాయి. ఈ పరీక్షల నిర్వహణకుఓ ప్రైవేట్ వేదపాఠశాల నిర్వాహకుడిని నియమించడంపై తెలంగాణ వేదపండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఆదివారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం రెండు తెలుగు రాష్ర్టాలతోపాటు తమిళనాడు వేదపండితుల్లో చర్చకు తెరలేపింది.
ఈ నేపథ్యంలో పలువురు అభ్యర్థులు ఫోన్ల ద్వారా తమ ఆవేదనను చెప్పుకొన్నట్టు తెలిసింది. వారి కథనం ప్రకారం.. హైదరాబాద్లోని ఓ ఆంజనేయస్వామి దేవాలయంలో పోస్టు కోసం పరీక్ష నిర్వహించేందుకు వచ్చిన ఐదుగురిలో ఒక్కరికీ సంబంధిత సబ్జెక్టుతో సంబంధం లేదు. దీంతో వారిలో ఓ అధికారి చెప్పిన వారికే మార్కులు వేసినట్టు తెలుస్తున్నది.
అలాగే రాష్ట్రంలోని ప్రముఖ రామాలయం, శివాలయంతోపాటు మరో ఆలయంలోని పోస్టులు తాము చెప్పినవారికే దక్కేలా మార్కులు వేయాలని ఎగ్జామినర్లకు ముఖ్య అధికారులు హుకుం జారీచేసినట్టు తెలిసింది. దీనిపై తెలంగాణ వేదపండితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అన్ని అర్హతలున్న ఇక్కడి వారికి కాకుండా ఇతర ప్రాంతానికి చెందిన వారికి పరీక్షల నిర్వహణ బాధ్యతలు కట్టబెట్టడం వల్లనే ఈ అవకతవకలు జరిగాయని, దీంతో స్థానిక పండితులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడుతున్నారు.