వేములవాడ, జూన్ 14 : ప్రభుత్వ విప్ ఆదిశ్రీనివాస్ అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చారని, అందులో ఏ ఒక్కటైనా నెరవేర్చారా..? అని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు ప్రశ్నించారు. ఒకో పథకాన్ని పకకు నెట్టుతూ అబద్ధాలతో కాలం వెల్లదీస్తున్నారని ధ్వజమెత్తారు. అభివృద్ధిపై నియోజకవర్గ ప్రజలను మసిపూసి మారేడుకాయ చేస్తున్నారని, కనీసం ఆయన స్వగ్రామం రుద్రంగిలోనే 30 పడకల దవాఖాన నిర్మాణ పనులు ఇంకా పూర్తి చేయలేకపోయారని, రెండు నెలల నుంచి మొత్తానికే ఆగిపోయాయని విమర్శించారు.
వేములవాడ పట్టణంలోని తన నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చల్మెడ మాట్లాడారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో శనివారం వేములవాడలో నిర్వహించిన కార్యకర్తల సమ్మేళనం విజయవంతమైందని హర్షం వ్యక్తం చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకుల్లో ఆందోళన మొదలైందన్నారు. అభివృద్ధిపై జీవన్రెడ్డి వాస్తవాలు మాట్లాడితే ఆది శ్రీనివాస్ జీర్ణించుకోలేకపోయాడని, గంటల వ్యవధిలో ప్రెస్మీట్ పెట్టడమే అందుకు నిదర్శనమన్నారు. అసలు ప్రాజెక్టులపై ఆయనక అవగాహన ఉన్నదా..? అని ఎద్దేవా చేశారు. 30 నెలల్లో ఏ ఒక పని కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవని విమర్శించారు. వేములవాడ నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని ఊకదంపుడు మాటలు మాట్లాడడమే తప్ప చేసిందేమీ లేదన్నారు.
యాదాద్రి తరహాలో వేములవాడ రాజన్న ఆలయాన్ని నిర్మిస్తామని మాట్లాడుతున్న ఆది శ్రీనివాస్, ఒకసారి యాదాద్రి వెళ్లి చూసి వస్తే బాగుంటుందని హితవు పలికారు. ప్రస్తుతం రాజన్న సన్నిధిలో విస్తరణ పనులు వైభవాన్ని తగ్గించేలా నడుస్తున్నాయని విమర్శించారు. రాతి కట్టడాలతో కాకుండా సిమెంట్, కంకర, స్టీల్తో నిర్మాణాలు చేపట్టడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నదని చెప్పారు. బద్దిపోచమ్మ ఆలయ విస్తరణకు స్థలం సేకరించి నిధులు మంజూరు చేసినా పనులు మాత్రం నత్తనడక సాగుతున్నాయని విమర్శించారు.
గత ప్రభుత్వంలో ప్రారంభమై నడిచిన పనులనే 30 నెలలుగా కొనసాగిస్తూ అభివృద్ధి చేస్తున్నామంటున్నారని ఎద్దేవా చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం ఇంకా కొనుగోలు కేంద్రాల్లోనే ఉన్నదని, ఆయన స్వగ్రామంలో ఇప్పటికీ కొనుగోళ్ల కోసం చూస్తున్నారని వాపోయారు. 114 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేసి ఎప్పటిలోగా లబ్ధిదారులకు ఇస్తారో తెలుపాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారులకు కూడా స్థలాలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిన ఘనత మీది కాదా..? అని ప్రశ్నించారు. కంటెంట్ లేకుండా మేధావిలా మాట్లాడుతున్నానని కవర్ చేస్తున్న ఆయన, మంత్రి పదవి కోసమే ఆరాటం అన్నట్టుగా ఉందని విమర్శించారు.
ఆయనకు మంత్రి పదవి వస్తే ఈ ప్రాంత అభివృద్ధి కోసం స్వాగతిస్తామని, కానీ, ఆ పదవి కోసమే ప్రజలను మోసం చేసేలా మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ సమావేశంలో నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రామతీర్థపు రాజు, మాజీ కౌన్సిలర్ నిమ్మశెట్టి విజయ్, కందుల క్రాంతి కుమార్, వెంగళ శ్రీకాంత్ గౌడ్, కొండ కనుకయ్య, నీలం శేఖర్, అంజద్ పాషా, మంత సందీప్, సుంకపాక రాజు, వెంకట్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి, రాంబాబు, పెద్ది రాజు, పోతు అనిల్ కుమార్, సంజీవ్, హనుమంతు, ప్రేమ్ చారి, అసద్, లింగం రాకేశ్, హరీశ్, గోపి, సంతోష్, రావికంటి సాయి, సింగం ప్రసాద్, జీవన్ గౌడ్, నవీన్, శివరెడ్డి తదితరులు ఉన్నారు.