అగ్ర హీరో రామ్చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రూపొందిన ‘పెద్ది’ సినిమా ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించి, ఈ ఏడాది సౌతిండియా నంబర్వన్ గ్రాసర్గా నిలిచిందని చిత్ర నిర్మాత వెంకటసతీశ్ కిలారు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్లో సక్సెస్ ప్రెస్మీట్ని నిర్వహించారు. దర్శకుడు బుచ్చిబాబు సానా, నిర్మాత వెంకటసతీశ్ కిలారు, గేయరచయిత అనంతశ్రీరామ్, మైత్రీ శశి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘నటుడిగా రామ్చరణ్ని ఉన్నత స్థానంలో నిలబెట్టిన సినిమా ‘పెద్ది’. చిరంజీవిగారు సినిమా చూసి మెచ్చుకున్నారు.
కొత్తగా ఓ నాలుగు సన్నివేశాలను జోడిస్తున్నాం. వాటిలో హీరోయిన్ జాన్వీకి చెందిన సీన్స్ మూడైతే, జగపతిబాబుకు చెందిన సన్నివేశం ఒకటి. బుధవారం నుంచి అవి యాడ్ అవుతాయి’ అని దర్శకుడు బుచ్చిబాబు తెలిపారు. ఆదివారం నుంచి టికెట్ రేట్లు కూడా తగ్గిస్తున్నట్టు, అన్ని ఏరియాల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అయినట్టు నిర్మాత సతీశ్ కిలారు తెలిపారు. మంచి మోటివేషన్తో తీసిన ఇలాంటి సినిమా ఇంత కమర్షియల్గా రావడం చరిత్రలో లేదని, నేటి తరానికి సందేశంతోపాటు వినోదాన్ని కూడా పంచిన సినిమా ‘పెద్ది’ అని, రోజురోజుకీ ఆదరణ పెరుగుతున్నదని’ పంపిణీదారుడు మైత్రీ శశి అన్నారు. ఇంకా అనంతశ్రీరామ్ కూడా మాట్లాడారు.