గాలిలో తేమ తగ్గి వీస్తున్న వడగాలులు
కామారెడ్డి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కురిసిన వాన
హైదరాబాద్, ఏప్రిల్ 5 (నమస్తే తెలంగాణ): గాలిలో తేమశాతం తగ్గిపోవడంతో రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. మధ్యా హ్నం సమయంలో బయట కాలుపెడితే సుర్రుమంటున్నది. గాలిలో తేమ 33 నుంచి 81 శాతం మధ్య నమోదవుతున్నది. సోమవారం తేమ అతి తక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో 12 శాతం, వికారాబాద్లో 13, నారాయణపేటలో 15, సంగారెడ్డిలో 18, కామారెడ్డిలో 19, మహబూబ్నగర్లో 20, మెదక్లో 21, హైదరాబాద్లో 22 శాతం రికార్డయ్యింది. ఇలా గాలిలో తేమ శాతం పడిపోవడంతో వడగాలులు వీస్తున్నాయి.
పగటి ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలపైన నమోదు అవుతున్నాయి. సోమవారం అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 42 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డయ్యింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, లింగంపేట మండలాల్లో వ ర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అక్కడక్కడ చెదురుమదురుగా వర్షం కురిసిం ది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన చిరుజల్లులు పడ్డాయి. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం చెరుకుపల్లిలో చెట్టు కూలి ఒకరు మృతి చెందారు.
మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొట్టగా ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. మబ్బులు కమ్మేసి చిరు జల్లులతో ప్రారంభమైన వర్షం ఒక్కసారిగా పెరిగిపోయింది. ఈ వర్షంతో వరిపంటకు నష్టవాటిల్లే ప్రమాదం ఉన్నదని వ్యవసాయాధికారులు తెలిపారు. గ్రామాల్లో వరి కోతలు ప్రారంభమయ్యాయ ని, వర్షంతో వడ్లు మొలకెత్తే అవకాశం ఉన్నదని జాగ్రత్తలు పాటించాలని సూచించారు.
నేడు పలు జిల్లాలకు వర్షసూచన
దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తువరకు విస్తరించిన ఉపరితల ఆవర్తనం బలహీన పడింది. 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం తెలంగాణ నుంచి ఉత్తర తమిళనాడు వరకు విస్తరించింది. దీని ప్రభావంతో కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్కర్నూల్ జిల్లా ల్లో మంగళవారం అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో తేలికపాటి వర్షాలు కురవచ్చని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.