హైదరాబాద్, జూలై 9 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాలు గురువారం దేశమంతటా విస్తరించినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాస్తవంగా ప్రతి ఏటా జూలై 8 నాటికి దేశమంతటా రుతుపవనాలు విస్తరించాల్సి ఉండగా, ఒక రోజు ఆలస్యంగా విస్తరించాయని అధికారులు తెలిపారు. నైరుతి రుతుపవనాలు గత నెల 8న రాష్ట్రంలో ప్రవేశించినప్పటికీ ఇప్పటి వరకు పెద్ద వర్షం కురువలేదు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోని 19 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
వాతావరణ శాఖ గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 265 మండలాల్లో లోటు, 46 మండలాల్లో తీవ్ర లోటు వర్షపాతం నమోదైంది. దీంతో సాగు పనులు మొదలు పెట్టిన రైతులు వానల కోసం ఎదురుచూస్తున్నారు. జూలైలో కూడా సాధారణం కంటే తక్కువ వర్షాలే కురిసే అవకాశం ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు శుక్రవారం నుంచి జూలై 15 వరకు రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశమున్నది. ముఖ్యంగా జూలై 12 నుంచి 15 మధ్య తూర్పు తెలంగాణలో 37 నుంచి 40 డిగ్రీల వరకు, హైదరాబాద్లో 35 నుంచి 37 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశాలున్నాయి.