దేశ ప్రజల ప్రాణాలకు జీవితకాలంలో, మరణానంతరమూ ధీమా కల్పిస్తున్న బీమా సంస్థకే ధీమా లేకుండా పోయింది! ఎల్ఐసీ ఐపీవోతో అంతొస్తది.. ఇంతొస్తదంటూ భారీ లెక్కలేసిన కేంద్రం.. తీరా అసలు సమయం వచ్చేసరికి అగ్వకే బేరానికి పెడుతున్నది! కంపెనీ మార్కెట్ విలువ 16 లక్షల కోట్లుగా లెక్కించినా.. చివరకు దాని మార్కెట్ విలువ 6 లక్షల కోట్లేనని కొత్త లెక్క చెప్పింది. తొలుత 5 శాతం వాటా విక్రయిస్తామని చెప్పి.. ఇప్పుడు దానిని కాస్తా 3.5 శాతానికి కుదించేసింది. ప్రభుత్వ చర్యపై ఆర్థిక నిపుణులు, రాజకీయ వర్గాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. ప్రభుత్వ చర్య వెనుక భారీ కుంభకోణం దాగి ఉన్నదేమోనన్న సందేహాలను వ్యక్తం చేస్తున్నాయి.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్ఐసీ)లో వాటా విక్రయానికి పలు వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నా, భారీగా విలువను రాబడతామంటూ ఘనంగా ప్రచారం చేసుకున్న కేంద్ర ప్రభుత్వం, చివరకు అగ్వకే అమ్మేస్తున్నది. రూ.16 లక్షల కోట్లకుపైగా విలువకు విక్రయిస్తామంటూ ఢంకా భజాయించి, ఇప్పుడు రూ.6 లక్షల కోట్ల విలువతోనే మార్కెట్లోకి వచ్చేస్తున్నది.
ఇలా పలు ఉదాహరణలతో వివరించిన విలువను ఉన్న పళంగా మూడో వంతుకు కుదించటం కచ్చితంగా కుంభకోణమేనని పలువురు విశ్లేషకులు విరుచుకుపడుతున్నారు. అతి తక్కువ ధరకు ఎల్ఐసీ షేర్లను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్న అంతర్జాతీయ స్పెక్యులేటర్లకు మోదీ ప్రభుత్వం తలొగ్గడం ప్రజా ప్రయోజనాల్ని విస్మరించడమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్ఐసీ మహా వృక్షంలా ఎదగడానికి కారణమైన కోట్లమంది పాలసీదారులను పక్కనపెట్టి, కొద్దిమంది విదేశీ స్పెక్యులేటర్ల లాభాలవైపే కేంద్రం మొగ్గు చూపిందంటే ఇది భారీ కుంభకోణం కాక, మరేమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆర్థిక నిపుణులతోపాటు రాజకీయ పార్టీల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ జారీ చేస్తున్న ఐపీవో వెనుక భారీ కుంభకోణం దాగి ఉన్నదని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆరోపించారు. ఈ ఐపీవోతో ఎల్ఐసీ నిజమైన యజమానులైన పాలసీదారులు దారుణంగా నష్టపోనున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. లాభాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే కేంద్రప్రభుత్వం ఎల్ఐసీని తెగనమ్మడం ప్రారంభించిందని వామపక్షాలు మండిపడ్డాయి.
కేరళ అసెంబ్లీ ఎల్ఐసీ ఐపీవోను వ్యతిరేకిస్తూ ఏకంగా తీర్మానాన్నే ఆమోదించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ సమయంలో వాయిదా వేసుకోవాల్సిన ఎల్ఐసీ ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ను.. ఇంతకంటే మంచి సమయం రాదేమోన్నంత హడావుడిగా అమ్మకానికి పెట్టేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఏప్రిల్ 23న ఎల్ఐసీ డైరెక్టర్ల బోర్డు సమావేశమైంది. ఇది నూరుశాతం ప్రభుత్వ సంస్థే అయినందున డైరెక్టర్లందరూ ప్రభుత్వ ప్రతినిధులే ఉంటారని లేదు.
కేంద్ర ఆర్థిక శాఖ హుకుం/ ఒత్తిడితో ఆఫర్ పరిమాణాన్ని తొలుత ప్రతిపాదించిన 5 శాతం నుంచి 3.5 శాతానికి తగ్గించాలని, సంస్థకు రూ.6 లక్షల కోట్ల విలువను ఆపాదిస్తూ ఇష్యూ జారీచేయాలని బోర్డు నిర్ణయించింది. ఒక్కో షేరును జారీచేసే ధరల శ్రేణిని, ఇష్యూ తేదీలను, పాలసీదార్లు, ఉద్యోగులు, రిటైల్ ఇన్వెస్టర్లకు ఇచ్చే డిస్కౌంట్లను నిర్ణయించడానికి సంస్థ బోర్డు మరో దఫా ఏప్రిల్ 26న లాంఛనంగా సమావేశమైంది.
వాస్తవానికి ఎల్ఐసీ ఆఫర్కు సెబీ ఈ ఫిబ్రవరిలో ఇచ్చిన అనుమతి ప్రకారం మే 12లోగా ఇష్యూ తేవాల్సి ఉన్నది. ఆ తేదీ దాటితే మళ్లీ తాజాగా ముసాయిదా డాక్యుమెంట్ను రెగ్యులేటర్కు సమర్పించి, అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. గడువు ముగిసిపోతుందన్న సాకు చూపించి, అనిశ్చితి మార్కెట్ పరిస్థితుల్లో ఐపీవోకు ప్రభుత్వం ఎందుకు పరుగులు తీయాల్సి వచ్చిందన్నది కీలక ప్రశ్న.
తొలుత 5 శాతం వాటాను రూ.75,000 కోట్ల విలువకు విక్రయిస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ఫీలర్లు వదిలింది. పదేపదే ఆ విషయం మీడియాలో ప్రచారమయ్యేలా చూసుకుంది. కానీ ఇప్పుడు ఆ పరిమాణాన్ని రూ.21,000 కోట్లకు తగ్గించి వేసింది. ఈ తగ్గింపు రెండు మార్గాల్లో జరిగింది. విక్రయించాల్సిన షేర్ల సంఖ్యను తగ్గించడం ఒకటైతే.. జారీ చేసే షేరు ధరను కుదించడం మరోటి. ఎల్ఐసీలో మొత్తం షేర్ల సంఖ్య 632.50 కోట్లు. అందులో 31.62 కోట్ల షేర్లను (5 శాతం) అమ్మనున్నట్టు సెబీకి సమర్పించిన ముసాయిదా పత్రాల్లో ప్రభుత్వం తెలిపింది. తాజాగా విక్రయానికి ప్రతిపాదించిన షేర్ల సంఖ్యను 22.13 కోట్లకు (3.5 శాతం) తగ్గించారు.
ఐపీవో నిధుల సమీకరణ లక్ష్యం నింగి నుంచి నేలకు దిగడానికి ఇది ఒక కారణమైతే, ముఖ్యమైన మతలబు ధరలో ఉన్నది. ముసాయిదా డాక్యుమెంట్లో వెల్లడించిన వివరాల ప్రకారం మిల్లిమాన్ అడ్వయిజర్స్ అనే ఒక అంతర్జాతీయ సంస్థను ఎల్ఐసీ విలువను లెక్కించడానికి ప్రభుత్వం నియమించుకున్నది. ఆ సంస్థ ఎల్ఐసీ ఎంబెడెడ్ విలువను రూ.5.40 లక్షల కోట్లుగా నిర్థారించింది. అంటే ఒక్కో ఎల్ఐసీ షేరు బేస్ విలువ రూ.853 అవుతుంది.
దీనికి 2.5-3 రెట్లు మార్కెట్ విలువతో ఎల్ఐసీ షేర్లను (షేరుకు రూ.2,133-2,559) జారీ చేయనున్నట్టు పుంఖానుపుంఖాలుగా ఫీలర్లను ప్రభుత్వం మార్కెట్లోకి వదిలింది. ఈ ధరతో 5 శాతం షేర్లను విక్రయించి ఉంటే రూ.67,500-80,900 కోట్ల మధ్య సమకూరేది. ‘ప్రతికూల మార్కెట్ పరిస్థితులు’ అనే కారణాన్ని సాకుగా చూపి అంతర్జాతీయ ఇన్వెస్టర్లు పెడుతున్న తీవ్ర ఒత్తిడికి ప్రభుత్వం లోనై ఈ విలువల్ని భారీగా తగ్గించిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా ఎల్ఐసీ ఎంబెడెడ్ విలువకు కేవలం 1.1 రెట్లకే ఆఫర్ను తెస్తున్నారు. దీంతో ఒక్కో షేరు విలువ రూ.938 అవుతుంది. బాగా చిన్న ప్రైవేటు జీవిత బీమా సంస్థలకు సైతం వాటి ఎంబెడెడ్ విలువకు 2.5-3 రెట్లు మార్కెట్ విలువను కడుతుండగా, జీవిత బీమా రంగంలో 70 శాతం వాటా, దీర్ఘకాలంగా ట్రాక్ రికార్డ్ కలిగిన ఎల్ఐసీ విలువను తగ్గించాల్సిన అవసరం ఏమిటన్నదే ప్రశ్న.
ఎల్ఐసీ ఐపీవో వివరాలను వెల్లడించడానికి ముంబైలో జరిగిన సమావేశంలో మీడియా ప్రశ్నలకు సరైన వివరణ ఇవ్వకుండానే అర్ధాంతరంగా ముగించారు. విలువ తగ్గిస్తూ పబ్లిక్ ఆఫర్ జారీ చేయడంపైనే మీడియా చాలా వరకూ ప్రశ్నల్ని సంధించింది. వేదికపై ఆసీనులైన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లెవరూ నోరెత్తకపోవడం గమనార్హం. డిజిన్వెస్ట్మెంట్ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత్ పాండే మాత్రం ఇష్యూ విలువపై చిన్న వివరణ ఇచ్చినప్పటికీ, అది సంతృప్తికరంగా లేదు. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లను పలకరిస్తే, కార్యదర్శిని అడగమంటూ తప్పించుకున్నారని సమావేశాన్ని రిపోర్ట్ చేసిన మీడియా వాపోయింది.
ప్రస్తుతం స్టాక్ మార్కెట్లో లిస్టయిన ఇతర జీవిత బీమా సంస్థలకంటే ఎల్ఐసీ విలువను చాలా తక్కువగా నిర్ణయించారు. ఎస్బీఐ లైఫ్ మార్కెట్ విలువ ఏప్రిల్ 28న రూ.1.10 లక్షల కోట్ల మేర ఉన్నది. దీని ప్రకారం ఎస్బీఐ లైఫ్ ఎంబెడెడ్ విలువకు మార్కెట్ విలువ 3.30 రెట్లు ఉన్నట్టు లెక్క. హెచ్డీఎఫ్సీ లైఫ్ కూడా దాని ఎంబెడెడ్ విలువతో పోలిస్తే మార్కెట్ విలువ 3.30 రెట్లు ఉన్నది. చాలావరకూ ప్రైవేట్ జీవిత బీమా కంపెనీలు వాటి ఎంబెడెడ్ విలువకు 2.5-5 రెట్లు అధికంగా మార్కెట్లో ట్రేడవుతున్నాయి.
అలాంటప్పుడు అతి పెద్ద జీవిత బీమా సంస్థ అయిన ఎల్ఐసీని ఇంత చౌకగా విక్రయించడంలో మతలబు ఏమిటని విశ్లేషకులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఫిబ్రవరిలో ప్రభుత్వం ప్రతిపాదించిన విలువకు ఇప్పుడు ఐపీవో వచ్చి ఉంటే మార్కెట్ విలువలో అగ్రస్థానంలో ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ను తలదన్నేది. కానీ తగ్గించిన విలువతో ఆఫర్ జారీచేయడంవల్ల పెద్ద కంపెనీల్లో ఐదో స్థానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 28: ఎల్ఐసీని ఐపీవోకి తీసుకురావడంపై వామపక్షాలు మండిపడ్డాయి. లాభాల్లో ఉన్న సంస్థను ప్రైవేటీకరణ చేయడంలో భాగంగానే కేంద్రం ఎల్ఐసీని తెగనమ్మడం ప్రారంభించిందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ఆరోపించారు. దీన్నో కుంభకోణంగా అభివర్ణించారు. ఈ ఐపీవో దేశ సార్వభౌమత్వానికి, ఆర్థిక స్వాతంత్య్రానికి దెబ్బేనన్నారు. ఈ నిర్ణయం దేశీ, విదేశీ కార్పొరేట్లకు లాభం చేకూర్చేలా ఉన్నదన్నారు. ఎల్ఐసీ ఐపీవో ద్వారా కేంద్రం ప్రజా వనరుల దోపిడీకి తెరతీసిందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ధ్వజమెత్తారు. దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఎల్ఐసీ కీలక భూమిక పోషిస్తున్న సంస్థ ఐపీవో ప్రక్రియను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు.
తిరువనంతపురం: ఎల్ఐసీ ఐపీవోను వ్యతిరేకిస్తూ కేరళ అసెంబ్లీ ఇటీవలే ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎల్ఐసీలో వాటాలను అమ్మాలని కేంద్రం నిర్ణయించడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన సంస్థను అమ్మడం తగదని అభిప్రాయపడింది. ప్రైవేటు సంస్థ ధనదాహానికి అడ్డుకట్ట వేసి పేదలకు జీవిత బీమా సౌకర్యం కల్పించాలన్న లక్ష్యంతోనే ఎల్ఐసీని జాతీయీకరణ చేశారని గుర్తు చేసింది.
ఎల్ఐసీలో పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఫిబ్రవరిలో ఈ మెగా ఐపీవో ప్రాస్పెక్టస్ను దాఖలు చేస్తూ ఎంబెడెడ్ వాల్యూకు 2.5 రెట్లు ఎక్కువగా సంస్థ మార్కెట్ విలువను గుణిస్తామని ప్రకటించారు. కానీ, ఇప్పుడు ఐపీవో విలువను 1.1 రెట్లకు పరిమితం చేశారు. మోదీ సర్కారు ఎందుకింత చౌకగా ఎల్ఐసీ షేర్లను అమ్ముతున్నదో? ఆ రహస్యం ఏమిటో?.
-జైరాం రమేశ్, కాంగ్రెస్ సీనియర్ నేత
జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ)లో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ జారీ చేస్తున్న ఐపీవో వెనుక భారీ కుంభకోణం దాగి ఉన్నదని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ ఆరోపించారు. ఈ ఐపీవోతో ఎల్ఐసీ నిజమైన యజమానులైన పాలసీదారులు దారుణంగా నష్టపోనున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ అంశంపై కేంద్ర ఆర్థికశాఖకు ఇప్పటికే మూడు లేఖలు రాసినా కనీసం స్పందించలేదని మండిపడ్డారు. ఎల్ఐసీ ఐపీవోపై కేంద్రాన్ని ప్రశ్నిస్తూ ఆయన గురువారం మరో లేఖ రాశారు. ఐపీవో ద్వారా పాలసీదారులు ఐదు రకాలుగా నష్టపోనున్నారని తెలిపారు. 1. స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులకు మంచి రిటర్నులు (లాభాలు) తెచ్చేందుకు కోట్లమంది పాలసీదారుల సొమ్మును ధారపోసే ప్రమాదం ఉన్నది.
2. సంస్థ నిజమైన యజమానులైన పాలసీదారులకు ఐపీవోలో కేవలం 10 శాతం విండో కేటాయించటమంటే వారికి తీవ్ర అన్యాయం చేయటమే. 3. ఎల్ఐసీలో అత్యధికమంది పాలసీదారులు ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలే. వారిలో దాదాపు ఎవరికీ డీమ్యాట్ ఖాతా అంటే తెలియదు. అందునా వారు డీమ్యాట్కు పాన్, ఆధార్ కార్డులను లింక్ చేయటం అసాధ్యం కూడా. అలాంటప్పుడు వారు పెట్టుబడి ఎలా పెట్టగలరు? 4. విదేశీ పెట్టుబడిదారులకు 20 శాతం విండో కేటాయించటం సంస్థ పాలసీదారులను అవమానించటమే. కేంద్రప్రభుత్వ విధానం విదేశీ పెట్టుబడిదారులను చిప్ప పట్టుకొని అడుక్కుతిన్నట్టుగా ఉన్నది. 5. పాలసీదారుల వ్యక్తిగత వివరాలను సేకరించి వారి పేరుపై బినామీలు పెట్టుబడులు పెట్టే ప్రమాదం ఉన్నది. 2021 రెండో అర్థభాగం నుంచీ ఇది కొనసాగుతున్నది. దీనిపై కేంద్రం ఇంకా కండ్లు తెరువలేదు అని మండిపడ్డారు. అత్యుత్తమంగా నడుస్తున్న ఎల్ఐసీని ధ్వంసం చేయటానికి కంద్రప్రభుత్వం కంకణం కట్టుకొన్నదని ధ్వజమెత్తారు.
ఎల్ఐసీ ఐపీవో ద్వారా సమీకరించాలనుకున్న నిధుల పరిమాణాన్ని రూ. 65,000 కోట్ల నుంచి రూ.21,000 కోట్లకు ఎందుకు తగ్గించారు? ప్రభుత్వం చెప్తున్న కారణాలు సబబుగా లేవు. ఎల్ఐసీ షేరు విలువను బాగా తగ్గించి చూపించారు. సంస్థ విలువను సరిగ్గా నిర్ణయించలేదు. ఎల్ఐసీకి దేశంలో వందలకొద్దీ భవనాలు ఉన్నాయి. వాటి విలువ లక్షల కోట్లలో ఉంటుంది. విలువ లెక్కింపులో అపారమైన రియల్ ఎస్టేట్ ఆస్తుల్ని పరిగణనలోకి తీసుకోలేదు. కంపెనీ ఎంబెడెడ్ విలువ లెక్కింపే లోపభూయిష్టంగా ఉన్నది. కృత్రిమంగా షేరు విలువను తగ్గించి, అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు అమ్మేస్తున్నారు. ఇలా తక్కువకు విక్రయించడంతో కేంద్ర ప్రభుత్వానికి, ప్రజలకు చెందాల్సిన ఆదాయం కొద్దిమంది ఇన్వెస్టర్ల చేతుల్లోకి పోతున్నది.
– ప్రొఫెసర్ నాగేశ్వర్, రాజకీయ విశ్లేషకుడు
దేశంలో జీవిత బీమాను ప్రాచుర్యం చేసి, రెండొంతుల మార్కెట్ వాటాతో ఆధిపత్యం చెలాయిస్తున్న ఎల్ఐసీ పెట్టుబడులు.. మొత్తం మ్యూచువల్ ఫండ్ పరిశ్రమ పెట్టుబడులకు సమానం. ఆరు దశాబ్దాల ఎల్ఐసీ ట్రాక్ రికార్డ్ మచ్చలేనిది. కోట్ల మంది పాలసీ హోల్డర్ల ప్రయోజనాలను పణంగా పెట్టి అలాంటి సంస్థను విలువకట్టేందుకు.. వేగంగా సొమ్ము చేసుకోవాలనుకుంటున్న కొద్దిమంది అంతర్జాతీయ ఇన్వెస్టర్లను అనుమతించడం కుంభకోణంకాక మరేమిటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.