హైదరాబాద్: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో వాహనాల జప్తుపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. మద్యం తాగి నడిపిన వారి వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని స్పష్టంచేసింది. ఈ మేరకు మద్యం తాగిన వ్యక్తిని వాహనం నడిపేందుకు అనుమతించవద్దని సూచించింది. మద్యం తాగని వ్యక్తి వెంట ఉంటే వాహనం అతడికి అప్పగించాలని ఆదేశించింది. ఎవరూ లేకపోతే సన్నిహితులను పిలిచి వాహనం ఇవ్వాలని తెలిపింది. ఎవరూ రాకపోతే వాహనాన్ని పీఎస్కు తరలించి, తర్వాత ఇవ్వాలని ఆదేశించింది. ప్రాసిక్యూషన్ అవసరమైన కేసుల్లో 3 రోజుల్లో చార్జిషీట్ వేయాలని సూచించింది. ప్రాసిక్యూషన్ పూర్తయ్యాక వాహనం అప్పగించాలని ఆదేశించింది. వాహనం కోసం ఎవరూ రాకపోతే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఈ ఆదేశాలు అమలుచేయని పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలుంటాయని హెచ్చరించింది.