పదునైన బౌలింగ్కు.. బాధ్యతాయుత బ్యాటింగ్ తోడవడంతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-15వ సీజన్లో పదో విజయం నమోదు చేసుకుంది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకున్న హార్దిక్ పాండ్యా సేన.. చెన్నైపై సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. మొదటబౌలింగ్లో మహమ్మద్ షమీ, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ విజృంభించడంతో ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైన ధోనీ గ్యాంగ్.. ఆ తర్వాత వృద్ధిమాన్ సాహా క్లాసిక్ ఇన్నింగ్స్తో ప్రత్యర్థికి కనీస పోటీనివ్వకుండానే పరాజయం పాలైంది!
ముంబై: ఐపీఎల్-15వ సీజన్లో కొత్తగా అడుగుపెట్టిన గుజరాత్ టైటాన్స్ అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్నది. తాజా సీజన్లో మొదటి ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకున్న గుజరాత్.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలువడం ఖాయమైంది. ఆదివారం జరిగిన తొలి పోరులో టైటాన్స్ 7 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్పై విజయం సాధించింది. ఇప్పటికే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న డిఫెండింగ్ చాంపియన్ చెన్నై.. ప్రతిఘటించకుండానే పరాజయం వైపు నిలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది. యువ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (49 బంతుల్లో 53; 4 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో రాణించగా.. నారాయణ్ జగదీశన్ (33 బంతుల్లో 39 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఫర్వాలేదనిపించాడు. అయితే వీరిద్దరూ పరుగులు రాబట్టినా.. అందుకు ఎక్కువ బంతులు తీసుకోవడం జట్టు స్కోరుపై ప్రభావం చూపింది.
కాన్వే (5), దూబే (0), ధోనీ (7) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో మహమ్మద్ షమీ 4 ఓవర్లలో 19 పరుగులే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన టైటాన్స్.. 19.1 ఓవర్లలో 3 వికెట్లకు 137 పరుగులు చేసింది. సీనియర్ ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (57 బంతుల్లో 67 నాటౌట్; 8 ఫోర్లు, ఒక సిక్సర్) చివరి వరకు క్రీజులో నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. చెన్నై బౌలర్లలో పతిరణ 2 వికెట్లు పడగొట్టాడు. సాహాకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. లీగ్లో భాగంగా సోమవారం పంజాబ్తో ఢిల్లీ తలపడనుంది.
చెన్నై: 20 ఓవర్లలో 133/5 (గైక్వాడ్ 53, జగదీశన్ 39 నాటౌట్; షమీ 2/19),
గుజరాత్: 19.1 ఓవర్లలో 137/3 (సాహా 67 నాటౌట్; పతిరణ 2/24).