హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం న్యూఢిల్లీలో తొలిసారిగా అధికారికంగా నిర్వహించనుండటం, ఈ కార్యక్రమానికి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరు హాజరుకానుండటం సంతోషకరం.
అయితే రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను వెంటనే అమలు చేయాల్సిన బాధ్యత కూడా అమిత్ షా పై ఉందని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
బుధవారం మంత్రుల నివాసంలో రాష్ట్రంలోని వివిధ మార్కెట్ కమిటీల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు వినోద్ కుమార్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి ఎనిమిది సంవత్సరాలు గడుస్తున్నా ఆ చట్టంలోని అనేక అంశాలు ఇప్పటికీ ఆచరణకు నోచుకోలేదని వినోద్ కుమార్ అన్నారు. విభజన చట్టంలో పొందుపరిచిన హామీలను అమలు చేసే బాధ్యత కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా పై ఉందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని కాలేశ్వరం ప్రాజెక్టు గాని, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కానీ జాతీయ హోదా ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించకపోవడం బాధాకరమని వినోద్ కుమార్ పేర్కొన్నారు. బయ్యారం ఉక్కు తెలంగాణ ప్రజల హక్కు అని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీని వెంటనే ప్రకటించాలని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి కోరారు.
తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఒక నవోదయ పాఠశాలను ఇవ్వాలన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనలను వెంటనే అమలు చేయాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ఐటీ రంగంలో రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అభివృద్ధిని సాధిస్తోందని, తెలంగాణలో ఐటిఐఆర్ విషయంలో కేంద్రం పట్టించుకోవడంలేదని ఆయన అన్నారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్, మెగా పవర్ పార్క్, టెక్స్టైల్స్ క్లస్టర్ వంటి సంస్థల ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తోందని వినోద్ కుమార్ అన్నారు. కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీని ప్రారంభించాలని కొన్ని దశాబ్దాలుగా ఆందోళనలు కొనసాగుతున్నా వాటిని మోదీ ప్రభుత్వం పట్టించుకోక పట్టించుకోవడం లేదన్నారు.
నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ను మంజూరు చేయక పోవడం పట్ల ఆయన విచారం వ్యక్తం చేశారు. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ కేంద్రం హైదరాబాద్ కు మంజూరు కాగా దాన్ని కుట్రపూరితంగా కేంద్ర ప్రభుత్వం గుజరాత్ రాష్ట్రం జామ్ నగర్ కు తరలించిందని, ఇది తెలంగాణకు జరిగిన అన్యాయం అని ఆయన పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 150 మెడికల్ కాలేజీలను కేంద్ర ప్రభుత్వం తన నిధులతో ఏర్పాటు చేస్తోందని, తెలంగాణ రాష్ట్రానికి మాత్రం ఒక్క మెడికల్ కాలేజీని కూడా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేయకుండా వివక్షతను చూపుతోందని వినోద్ కుమార్ అన్నారు. హోం శాఖ మంత్రి అమిత్ షా విభజన చట్టంలోని హామీలను వెంటనే పరిష్కరించాలని వినోద్ కుమార్ కోరారు.