సిటీబ్యూరో, డిసెంబర్ 4(నమస్తే తెలంగాణ)/బంజారాహిల్స్: భవిష్యత్తు మొత్తం టెక్నాలజీదే అని ఛత్రపతి షాహూజీ మహరాజ్ యూనివర్సిటీ (కాన్పూర్) వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వినయ్ కుమార్ పాఠక్ అన్నారు. దూర విద్యా విధానాన్ని దేశానికి పరిచయం చేసిన ప్రొఫెసర్ జి.రామిరెడ్డి జయంతి సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ వర్సిటీలో నిర్వహించిన ‘ఆధునిక పరిజ్ఞానం-భవిష్యత్ తరాలు’ అనే అంశంపై ఆయన స్మారకోపన్యాసం చేశారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. విద్యార్థులకు బోధన సమయంలో సాంకేతికతను జోడించి పాఠ్యాంశంలో కీలక అంశాలను ప్రయోగాత్మకంగా చూపించడం ద్వారా సులువుగా అర్థమవుతుందన్నారు. బోధకులు కూడా ఇలాంటి అంశాలపైనా దృష్టి పెట్టాలన్నారు. వర్చువల్ రియాలిటీ అందుబాటులోకి రావడంతో సైన్స్ విభాగం విద్యార్థులకు పలు రకాల ప్రయోగాలతో ఆకట్టుకునే విధంగా బోధించే అవకాశం ఏర్పడిందన్నారు. కార్యక్రమంలో బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొ. కే.సీతారామారావు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత పేద విద్యార్థులను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో దూర విద్యా పితామహుడు ప్రొఫెసర్ జి.రామిరెడ్డి దూర దృష్టి అనుసరనీయమన్నారు. కార్యక్రమంలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఇ.సుధారాణి, ఇన్చార్జ్ రిజిస్ట్రార్ డాక్టర్ ఏవీఎన్ రెడ్డి, ఆ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, అధికారులు పాల్గొన్నారు.