ఉమ్మడి రాష్ట్రంలో అడవులు నరికివేతకు గురయ్యాయి. పాలకుల నిర్లక్ష్యం, స్మగ్లర్ల ధనదాహానికి చిక్కగా ఉన్న అడవులు పలుచబడ్డాయి. ఫలితంగా ఆవాసాలు కరువై జంతువులు, పక్షులు మైదాన ప్రాంతాలకు వలసవెళ్లాయి. స్వరాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమం చేపట్టారు. దాదాపు ఏడేండ్లలో 15 కోట్లకుపైగా మొక్కలు నాటారు. వరుణుడు కరుణించడం, వర్షాలు సమృద్ధిగా కురియడంతో 35.66 శాతం అటవీ విస్తీర్ణం పెరిగింది. వలస వెళ్లిన పక్షులు, జంతువులు తిరుగు పయనం అయ్యాయి. ప్రస్తుతం అడవులు పూర్వవైభవం సంతరించు కోగా.. పక్షుల కిలకిలరావాలతో అడవి అలరారుతున్నది. నేడు అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
ఆదిలాబాద్, మార్చి 20(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 17.66 లక్షల ఎకరాల్లో అడవులు విస్తరించి ఉన్నాయి. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 6.04 లక్షలు, మంచిర్యాలలో 4.36 లక్షలు, ఆదిలాబాద్లో 4.26 లక్షలు, నిర్మల్లో 3 లక్షల ఎకరాల్లో అటవీ విస్తీర్ణం కలిగి ఉన్నది. గతంలో 33.23 ఉన్న అటవీ విస్తీర్ణం.. ప్రస్తుతం 35.66 శాతం విస్తరించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవులు జంతువులు, పక్షులకు ఆవాసంగా ఉండేవి. విలువైన వృక్షసంపదను స్మగ్లర్లు యథేచ్ఛగా నరికివేసి భారీగా సొమ్ము చేసుకున్నారు. మానవాళి మనుగడకు ప్రాణం పోసే అడవులు నరికివేతకు గురవుతున్నా.. ఉమ్మడి రాష్ట్రంలో పాలకులు పట్టించుకోలేదు. ఫలితంగా వన్యప్రాణులు, పక్షులకు ఆవాసం కరువై ఇతర ప్రాంతాలకు వలసవెళ్లాయి. వేటగాళ్లు జంతువులను వేటాడడంతో ప్రాణాలు వదిలాయి. అడవుల జిల్లాగా పేరుగాంచిన ఆదిలాబాద్లో అటవీ సంరక్షణ ప్రశ్నార్థకంగా మారింది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లాలో అడవుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు చేపట్టింది. హరితహారంలో భాగం గా అడవులను పునరుద్ధరించడానికి అటవీశాఖ అధికారులు పటిష్టమైన ప్రణాళికలు రూపొందించారు. ఈ ఏడెండ్లలో దాదాపు 15 కోట్లకుపైగా మొక్కలు నాటిం ది. మైదానాలుగా మారిన అటవీ ప్రాంతాల్లో బ్లాక్ ప్లాంటేషన్ చేపట్టి లక్షల సంఖ్యలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో భాగంగా క్షీణించిన అడవుల పునర్జీవం కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్, ఉట్నూర్, ఇచ్చోడ ఫారెస్ట్ డివిజన్లో వివిధ పనులు చేపట్టారు. గతంలో ఇచ్చోడ మండలంలోని ముల్తానీలతోపాటు స్మగ్లర్లు కలప స్మగ్లింగ్కు పాల్పడేవారు. అక్రమ కలప నివారణకు అటవీశాఖ, పోలీసు అధికారులు ఉక్కుపాదం మోపారు. టేకు, ఇతర కలపతో ఫర్నిచర్ తయారు చేస్తున్న వారిని గుర్తించి కౌన్సెలింగ్ నిర్వహించారు. అక్రమార్కులపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేశారు. అటవీ సంరక్షణలో భాగంగా వంట చెరుకు ఎవరూ తీసుకుపోకుండా చర్యలు తీసుకున్నారు. పశువులు, మనుషులు అడవుల్లోకి రాకుండా చుట్టూ కందకాలు తవ్వారు. అటవీ సరిహద్దుల్లో గచ్చికాయ చెట్లను పెంచుతున్నారు. అడవుల్లో నీటి నిల్వలను పెంచడానికి పర్క్యూలేషన్ ట్యాంకులు నిర్మించారు. అటవీ ప్రాంతాల్లో అగ్ని ప్రమాదాలు జరుగకుండా ఐదు ఫీట్లకు ఫైర్లైన్స్ ఏర్పాటు చేశారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా ఆదిలాబాద్ జిల్లా పుర్వవైభవాన్ని సంతరించుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో పలుచగా మారిన అడవుల్లో చెట్లు కనిపిస్తున్నాయి. శీతాకాలం, వానకాలంలో జాతీయ రహదారికి ఇరువైపులా చెట్లు ఏపుగా పెరగడంతో వాహనదారులను కనువిందు చేస్తున్నాయి. గతంలో వలనపోయిన పక్షులు, జంతువులు జిల్లా అడవులకు తిరిగివస్తున్నాయి. మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి పులులు కవ్వాల్కు వలస వస్తున్నాయి. పక్షులు కూడా అటవీ ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి.