ముంబై, ఫిబ్రవరి 25: భీకర నష్టాల నుంచి దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం కోలుకున్నాయి. ఉక్రెయిన్పై రష్యా దాడుల నేపథ్యంలో గురువారం ప్రపంచవ్యాప్తంగా సూచీలు పతనమైపోయిన విషయం తెలిసిందే. అయితే రష్యా తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అమెరికాసహా దాని మిత్ర దేశాలు, ఐరోపా అగ్రదేశాలు ఆర్థికపరమైన కఠిన ఆంక్షలు విధించడంతో మళ్లీ లాభాలబాట పట్టాయి. ఈ క్రమంలోనే బాంబే స్టాక్ ఎక్సేంజ్ ప్రధాన సూచీ సెన్సెక్స్ 1,328.61 పాయింట్లు లేదా 2.44 శాతం ఎగబాకి 55,858.52 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ సైతం 410.45 పాయింట్లు లేదా 2.53 శాతం ఎగిసి 16,658.40 వద్ద స్థిరపడింది. ఆసియా, ఐరోపాల్లోని ప్రధాన సూచీలు లాభాల్లో ముగియడం కలిసొచ్చింది. క్రితం రోజు సెన్సెక్స్ 2,702, నిఫ్టీ 815 పాయింట్లు క్షీణించిన సంగతి విదితమే. కాగా, ఈ వారం మొత్తంగా సెన్సెక్స్ 1,974 పాయింట్లు లేదా 3.41 శాతం, నిఫ్టీ 618 పాయింట్లు లేదా 3.57 శాతం దిగజారాయి.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఒక్కసారిగా తీవ్ర అమ్మకాల ఒత్తిడిలోకి జారుకున్న మదుపరులు.. తిరిగి కొనుగోళ్లకు మద్దతునిచ్చారు. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఐటీ రంగాల షేర్లు మదుపరులను ప్రధానంగా ఆకట్టుకున్నాయి. సెన్సెక్స్లో టాటా స్టీల్ షేర్ విలువ అత్యధికంగా 6.54 శాతం పెరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, ఎన్టీపీసీ, టెక్ మహీంద్రా, యాక్సిస్, కొటక్, టీసీఎస్, విప్రో షేర్లూ లాభపడ్డాయి. స్మాల్క్యాప్, మిడ్క్యాప్ సూచీలూ పుంజుకున్నాయి.
తీవ్ర నష్టాల నుంచి స్టాక్ మార్కెట్లు తేరుకోవడంతో మదుపరుల సంపద కూడా పెరిగింది. బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ శుక్రవారం రూ.7,72,873.6 కోట్లు పుంజుకుని రూ.2,49,97,053.39 కోట్లకు చేరుకున్నది. గురువారం ఒక్కరోజే రూ.13.44 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయినది తెలిసిందే. మొత్తం 19 రంగాల సూచీలు తిరిగి లాభాలబాట పట్టడం కలిసొచ్చింది.లాభాలకు కారణాలివే..