న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వం చేపడుతున్న అడ్డగోలు ఆర్థిక విధానాల వల్ల తమ పదవులను వీడి వెళ్తున్న ఆర్థిక వేత్తల జాబితాలో మరో పేరు చేరింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. కారణం ఏంటన్నది వెల్లడించలేదు. కేంద్ర ప్రభుత్వం కూడా రాజీవ్ రాజీనామాపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఆయన స్థానంలో సుమన్ కే బెరిని ఉపాధ్యక్షుడిగా నియమించింది. పదవీకాలం ఇంకా ఉన్నప్పటికీ రాజీవ్ కుమార్ రాజీనామా చేయడం బీజేపీ ఆర్థిక విధానాలపై మరోసారి చర్చను లేవనెత్తుతున్నది.
బీజేపీ అధికారంలోకి వచ్చిన రెండేండ్ల తర్వాత అప్పటి ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్తో ప్రారంభమైన ఆర్థిక వేత్తల రాజీనామాల పర్వం ఎనిమిదేండ్లు గడిచినా ఇంకా కొనసాగుతూనే ఉన్నది. రాజీనామాలు చేసిన ఆర్థిక వేత్తల్లో చాలా మంది పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించాలని భావించినప్పటికీ వాళ్లు అందుకు ఇష్టపడలేదు. పదవులకు రాజీనామా చేసి వెళ్తున్నవారిలో కేంద్రం ఏరి కోరి తెచ్చుకొన్న అరవింద్ పనగరియా, ఉర్జిత్ పటేల్ లాంటి వాళ్లు కూడా ఉన్నారు. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్బీఐ గవర్నర్గా ఉన్న రాజన్ నుంచి ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ వరకు ముగ్గురు గవర్నర్లు మోదీ సర్కారు విధానాలపై అసంతృప్తిగా ఉండటం గమనార్హం.
రఘురామ్ రాజన్ 2013లో ఆర్బీఐ గవర్నర్గా నియమితులయ్యారు. ఆర్థిక పరంగా ఎన్నోకఠిన నిర్ణయాలు తీసుకొన్నారు. వడ్డీ రేట్లను తగ్గించడానికి ఒప్పుకోలేదు. మోదీ సర్కారు ఆయనపై కోపం పెంచుకొన్నది. రాజన్పై తీవ్ర ఆరోపణలు చేసింది. విదేశాలకు ఆర్థిక సమాచారాన్ని చేరవేస్తున్నారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ఆరోపించారు. దీంతో రాజన్ తన పదవీకాలాన్ని పొడిగించవద్దని కేంద్రాన్ని ముందే కోరారు. రాజీనామా చేశారు.
రాజన్ స్థానంలో మోదీ సర్కారు ఏరికోరి ఉర్జిత్ పటేల్ను ఆర్బీఐ గవర్నర్గా నియమించింది. ఉర్జిత్ మొదట్లో కేంద్ర విధానాలపై సైలెంట్గా ఉన్నారు. అయితే, ఆర్బీఐ మిగులు నిధులను తమ అవసరాలకు ఇవ్వాలని కేంద్రం ఒత్తిడి తీసుకురావడం, ఆరెస్సెస్ వ్యక్తి గురుమూర్తిని ఆర్బీఐ బోర్డులో కూర్చొబెట్టడాన్ని ఉర్జిత్ తీవ్రంగా వ్యతిరేకించారు. ఆర్బీఐ స్వతంత్రత దెబ్బతింటున్నదని బహిరంగంగానే ప్రకటించారు. తన పదవికి రాజీనామా చేశారు.
ప్రణాళిక సంఘం స్థానంలో మోదీ ప్రభుత్వం 2015లో నీతి ఆయోగ్ను తీసుకువచ్చింది. ఉపాధ్యక్షుడిగా అరవింద్ పనగరియాను నియమించింది. మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు చేపట్టిన కార్యక్రమాలను పనగరియా గతంలో మెచ్చుకోవడమే ఇందుకు కారణమని అప్పట్లో వార్తలొచ్చాయి. అయితే, కేంద్రం విధానాలతో పనగరియా విసిగిపోయారు. నీతి ఆయోగ్కు అధికారాల్లేవని విమర్శించారు. పదవీకాలం ముగియకముందే 2017లోనే రాజీనామా చేసి వెళ్లిపోయారు.
అరవింద్ సుబ్రమణియన్ 2016లో భారత ప్రధాన ఆర్థిక సలహాదారుగా నియమితులయ్యారు. మరో ఏడాది సర్వీసు ఉండగానే 2018లో పదవికి రాజీనామా చేశారు. డీమానిటైజేషన్ను దారుణమైన, క్రూరమైన చర్యగా అభివర్ణించారు. తర్వాత వచ్చిన కేవీ సుబ్రమణియన్ కూడా తన పదవీ కాలం ముగియకముందే రాజీనామా చేసి వెళ్లిపోయారు. బీజేపీ ప్రభుత్వం 2018లో జీడీపీ లెక్కింపు విధానంలో మార్పులు చేయడంతో సీపీ మోహనన్, జేవీ మీనాక్షి రాజీనామా చేశారు.