చండీగఢ్, ఏప్రిల్ 1: చండీగఢ్ పరిధిలోని ప్రభుత్వ ఉద్యోగులందరికీ కేంద్ర సర్వీసు రూల్సే వర్తిస్తాయని కేంద్ర హోంమంత్రి చేసిన ప్రకటన పంజాబ్లో రాజకీయంగా సంచలనం సృష్టించింది. కేంద్రంలోని బీజేపీ నియంతృత్వ పోకడలకు ఈ ప్రకటనే నిదర్శనమని ఆప్ సర్కారు ఆరోపించింది. ఈ అంశంపై పంజాబ్ అసెంబ్లీ శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైంది. చండీగఢ్కు కేంద్రపాలిత ప్రాంత హోదా తొలగించి పంజాబ్లో కలపాలని తీర్మానం చేసింది. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా చండీగఢ్ పరిపాలన వ్యవహారాల్లో కేంద్రం మార్పులు చేస్తున్నదని, అధికార యంత్రాంగం మధ్య సమతౌల్యాన్ని దెబ్బతీస్తున్నదని సీఎం భగవంత్ మాన్ విమర్శించారు. ఈ అంశంపై రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర హోంమంత్రిని కూడా కలుస్తానని పేర్కొన్నారు. చండీగఢ్ ప్రస్తుతం పంజాబ్, హర్యానాల ఉమ్మడి రాజధానిగా, కేంద్ర పాలిత ప్రాంతంగా ఉంది.