హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్, బీజేపీలది పంచభూతాలను భోంచేసిన అవినీతి చరిత్ర అని పీయూసీ చైర్మన్ జీవన్రెడ్డి ఆరోపించారు. అవినీతికి కాంగ్రెస్ కిటికీలు తెరిస్తే, బీజేపీ దర్వాజాలు తెరిచిందని విమర్శించారు. గురువారం టీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాఫెల్, అదానీ బొగ్గు, గంగానది ప్రక్షాళన పేరుతో కుంభకోణాలకు పాల్పడిన చరిత్ర ఆ పార్టీలదేనని దెప్పిపొడిచారు. దేశానికి రెండు జాతీయ పార్టీలు శనిలా దాపురించాయని, మోదీ పాలన కన్నీళ్లే మిగిల్చిందని విమర్శించారు.
రాష్ట్రంలో పర్యటిస్తున్న నడ్డాకు నీతి, నిజాయితీ ఉంటే పాలమూరు పచ్చదనాన్ని చూడాలని సూచించారు. బిడ్డా.. నడ్డా ఇది తెలంగాణ గడ్డ..కేసీఆర్ అడ్డా అనే విషయం గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. రాష్ట్రంలో మోదీ బ్రేక్ డ్యాన్సులు వేసినా, బండి సంజయ్ మోకాళ్ల యాత్ర చేసినా 30 ఏండ్ల పాటు సీఎం కేసీఆరే పాలిస్తారని చెప్పారు. రాష్ర్టానికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి, ఎంపీలు అర్వింద్, బండి సంజయ్, రేవంత్రెడ్డి దుష్ట చతుష్టయమని వ్యాఖ్యానించారు. వీరితో రాష్ర్టానికి ఒరిగిందేమీ లేదని మండిపడ్డారు. రాహుల్గాంధీ దేశానికి ఐరన్లెగ్ అయితే తెలంగాణ ద్రోహి రేవంత్రెడ్డి రాష్ర్టానికి ఐరన్లెగ్ అని దెప్పిపొడిచారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలపై ఎంపీ అర్వింద్ నోరుపారేసుకుంటే తాము చూస్తూ ఊరుకోబోమని జీవన్రెడ్డి హెచ్చరించారు. ఇష్టమొచ్చినట్టు స్థాయిని మరిచి, హోదాను మరచి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే అర్వింద్ను టీఆర్ఎస్ సైన్యం ఉరికిచ్చి కొడుతుందని హెచ్చరించారు. అర్వింద్ అబద్ధాలు చెప్పటం మానుకోవాలని హెచ్చరించారు. అర్వింద్ ఇంట్లో మూడు పార్టీలున్నాయని ఎద్దేవా చేశారు. ఆయన తండ్రి కాంగ్రెస్లో ఉన్నప్పుడు అవినీతితో లక్షల కోట్లు సంపాదించినట్ట్టు ఆధారాలున్నాయని చెప్పారు. కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు.
రాజ్యాంగం గుర్తించిన 22 అధికారిక భాషల్లో ఒకటిగా ఉన్న ఉర్దూపై బీజేపీ వితండవాదం చేస్తున్నదని మండిపడ్డారు. ఉర్దూ భాషలో గతంలోనూ పోటీ పరీక్షలు నిర్వహించారని చెప్పారు. యూపీఎస్సీ సహా పలు కేంద్ర రిక్రూట్మెంట్ సంస్థలు ఉర్దూలో పరీక్షలు నిర్వహిస్తున్నాయని, బీజేపీ నేతలకు దమ్ముంటే ఉత్తరప్రదేశ్, బీజేపీ రాష్ర్టాల్లో ఉర్దూ భాషపై నిర్ణయం తీసుకోవాలని సవాల్ విసిరారు. వాస్తవాలను తెలుసుకోకుండా యువతను రెచ్చగొట్టడం మానుకోవాలని హితవు పలికారు.