చిక్కడపల్లి, నవంబర్ 25: సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారం ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలంగాణ కండక్టర్ ఐక్య వేదిక నాయకులు గురువారం టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను కలిసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా వేదిక అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాంకుమార్, శ్రీనివాసులు మాట్లాడుతూ.. ప్రయాణికులు చేసే కొన్ని తప్పిదాల వల్ల కండక్టర్లు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. టిక్కెట్ బాధ్యత పూర్తిగా ప్రయాణికులపైనే ఉండాలని కోరారు. టికెట్ లేకుండా ప్రయాణిస్తున్నవారిపై జరిమానా విధించాలని అన్నారు. ఆర్టీసీ కార్మికులకు సీఎం కేసీఆర్ హామీ ఇచ్చిన ఉద్యోగ భద్రతను కల్పించి, తమ జీవితాల్లో వెలుగులు నింపాలని కోరారు. ఐక్యవేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు తమటం విజయ్ కృష్ణ, చైర్మన్ తేజవతి, నాయకులు జీవన్ సాయి, లీల, సమత తదితరులు పాల్గొన్నారు.