హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): సింగరేణిని ప్రైవేటీకరించే హక్కు కేంద్ర ప్రభుత్వానికి లేదని ఇంధనశాఖ మంత్రి జగదీశ్రెడ్డి స్పష్టంచేశారు. సీఎం కేసీఆర్ కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు సింగరేణిని ఎవ్వరూ ప్రైవేటీకరించలేరని చెప్పారు. సింగరేణిని కాపాడుకొనేందుకు ఏ స్థాయి ఉద్యమానికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. శుక్రవారం అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ కంపెనీ అయిన సింగరేణిలో తెలంగాణకు 51 శాతం, కేంద్రానికి 49 శాతం కంటే తక్కువ, ఇతరులకు 0.4 శాతం వాటాలు ఉన్నాయని వివరించారు. ప్రత్యక్షంగా ప్రైవేటీకరించే అవకాశం లేకనే కేంద్రం ఆగిందని చెప్పారు. సింగరేణికి ఆనవాయితీగా, హక్కుగా ఉన్న నాలుగు బ్లాక్ల బహిరంగ వేలానికి కేంద్రం టెండర్లు పిలిచిందని చెప్పారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. సీఎం కేసీఆర్ ప్రధాని మోదీకి లేఖ రాశారని తెలిపారు. గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం అడిగిన కంపెనీకి బ్లాక్లను కేటాయించినట్టుగా, 118 బ్లాక్లను కోల్ ఇండియాకు కేటాయించిన విధంగానే సింగరేణికి కూడా గనులు కేటాయించాలని కేసీఆర్ కోరారని వివరించారు. జాతీయత పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తూ మొత్తం జాతినే ఖతం చేస్తున్నదని తూర్పారబట్టారు. ప్రైవేటీకరించిన సంస్థల్లో రిజర్వేషన్లు ఉండవని కేంద్ర మంత్రి పార్లమెంటులో చెప్పారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొందరు కాంట్రాక్టుల కోసం బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారని, వారి చిల్లరవేషాలు సాగవని హెచ్చరించారు. కాంట్రాక్టులే తప్ప వారికి ప్రజల బతుకులు అక్కరలేదని విమర్శించారు. సింగరేణి ఓటీ కాంట్రాక్ట్లను గతంలో మాదరిగా బెదిరించి, భయపెట్టి, దౌర్జన్యాలతో పొందడం సాధ్యంకాదని హెచ్చరించారు.
సింగరేణిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని, ప్రైవేటీకరిస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య పోరాటాలు చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చెప్పారు. సింగరేణితో పాటు హైదరాబాద్లో ఉన్న బీహెచ్ఈఎల్, బీడీఎల్ సంస్థలను కూడా ప్రైవేటీకరించే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సభలో ఏకగ్రీవంగా తీర్మానం చేద్దామని, ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని కోరారు. సింగరేణి పరిరక్షణకు బొగ్గు బాయిల నుంచి ఢిల్లీ దాకా పోరాటం చేస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. సింగరేణిని ప్రైవేటీకరిస్తే ఈ ప్రాంతంలో నిరుద్యోగం పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. బెల్లంపల్లి ఏరియాలో ఒక గనిని ప్రైవేట్కు ఇస్తే.. 80 శాతం ఉద్యోగాలు బీహారీలకు ఇచ్చారని వివరించారు.