సిద్దిపేట, నవంబర్ 1: యాసంగిలో దొడ్డు వడ్లు కొనబోమని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునఃసమీక్షించుకోవాలని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు కోరారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ హయాంలో భారీగా పంటల సాగు పెరిగిందని, ఇలాంటి సమయంలో దొడ్డు వడ్లు కొనబోమని చెప్పడం తగదని అన్నారు. సోమవారం సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ కృషితో కాళేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల ఉచిత కరెంట్, సకాలంలో ఎరువులు, విత్తనాలు, రైతుబంధు సాయంతో రాష్ట్రంలో వరి సాగు, పంట దిగుబడి పెరిగిందని అన్నారు. ఒక్కో రాష్ట్రం ఒక్కో పంటకు అనుకూలంగా ఉంటుందని, తెలంగాణ వరి సాగుకు అనుకూలమని చెప్పారు. సాగునీటి సౌకర్యం మెరుగుపడటంతో రాష్ట్రంలో భారీగా వరి సాగవుతుందన్నారు. ఈ తరుణంలో యాసంగిలో బాయిల్డ్ రైస్ తీసుకోమని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసిందని స్పష్టంచేశారు. ఈ విషయంపై సీఎం కేసీఆర్ మూడుసార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీకి విన్నవించారని గుర్తుచేశారు. వానకాలంలో వడ్లను రారైస్గా మార్చవచ్చని, యాసంగిలో రారైస్ మార్చితే ఎక్కువగా నూకలు వచ్చి రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. ఇప్పటికైనా కేంద్రం, ఎఫ్సీఐ తమ నిర్ణయాన్ని మార్చుకోవాలని కోరారు. ఎంత పంట వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం కొనేందుకు సిద్ధ్దంగా ఉన్నదని పునరుద్ఘాటించారు.