వికారాబాద్ జిల్లా ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి గురువారం జిల్లాలో అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ సైతం చేపట్టారు. బుల్లెట్ రైల్వే లైన్ను మహారాష్ట్రలోని థానే నుంచి తెలంగాణలోని సంగారెడ్డి వరకు నిర్మించనున్నారు. దీని పొడవు మొత్తం 649.76 కిలోమీటర్లు కాగా, మన రాష్ట్రంలో మూడు జిల్లాల నుంచి వెళ్లనున్నది. ఇందులో వికారాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 68.5 కిలోమీటర్లు ఉండనుండగా.. ఆలంపల్లిలో రైల్వే స్టేషన్ నిర్మించనున్నారు. జిల్లా పరిధిలో రైల్వే ట్రాక్ కోసం 124.43 హెక్టార్ల భూమి అవసరమని గుర్తించారు. పలుచోట్ల సొరంగం, వంతెనల గుండా రైల్వే లైన్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి భూముల స్వభావంపై సర్వే కొనసాగుతున్నది. ఈ హై స్పీడ్ రైలు గంటకు 300 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనుండగా కేవలం 3 గంటల్లోనే హైదరాబాద్ నుంచి ముంబయికి చేరుకోనుంది. ఈ ట్రైన్కు 10 బోగీలు ఉంటాయి. ఒక్కో బోగిలో 75 మంది చొప్పున ఒకేసారి 750 మంది ప్రయాణించవచ్చు.
పరిగి, నవంబర్ 25 : తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించేందుకు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న బుల్లెట్ ట్రైన్ (హై స్పీడ్ రైల్) కారిడార్ సాకారం కాబోతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ బుల్లెట్ ట్రైన్ కారిడార్ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం వికారాబాద్లో ప్రజాభిప్రాయ సేకరణ సైతం చేపట్టారు. బుల్లెట్ రైలు మహారాష్ట్రలోని థానే నుంచి ప్రారంభమై తెలంగాణ రాష్ట్రంలోని సంగారెడ్డి వరకు నిర్మాణం చేపడుతారు. ఈ మార్గం మొత్తం 649.76 కిలోమీటర్లు ఉండగా, తెలంగాణలోని మూడు జిల్లాల్లో బుల్లెట్ ట్రైన్ మార్గం ఉంటుంది. ఇందులో వికారాబాద్ జిల్లాలోనే అత్యధికంగా 68.5 కిలోమీటర్ల నిడివి ఈ రైలు మార్గం ఉండడం గమనార్హం. ఈ రైలు మార్గం ద్వారా జిల్లా పరిధిలో 39 ప్రభావిత గ్రామాలుండగా.. 124.43 హెక్టార్ల భూమి అవసరమని గుర్తించారు. ఇందులో ప్రైవేట్ భూమి 112.93 హెక్టార్లు, ప్రభుత్వ భూమి 11.5 హెక్టార్లు అవసరమవుతుంది. బుల్లెట్ ట్రైన్ మార్గం పలుచోట్ల సొరంగం గుండా, మిగతా ప్రాంతాల్లో వంతెనపై ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి డీపీఆర్ను సిద్ధం చేస్తున్నారు. హై స్పీడ్ రైల్వే లైన్ను 17.5 మీటర్ల వెడల్పులో 10 నుంచి 15 మీటర్ల ఎత్తులో నిర్మాణం చేపడుతారు. ఈ మార్గానికి సంబంధించి లిడార్ సర్వేను పూర్తి చేశారు. కొండల ప్రాంతాలు, మెత్తటి నేలలు గల ప్రాంతాల్లో సొరంగం ద్వారా ఈ రైలు మార్గం నిర్మాణం జరుగుతుంది. మిగతా ప్రాంతాల్లో వంతెనపై రైలుమార్గం ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి ఈ మార్గంలోని భూముల స్వభావంపై సర్వే కొనసాగుతున్నది.
వికారాబాద్ జిల్లా పరిధిలో హై స్పీడ్ రైల్వే లైన్ నిర్మాణానికి 124.43 హెక్టార్ల భూమి అవసరమవ్వగా ఇందులో తాండూరు మండలంలో 29.5 హెక్టార్లు, అందులో ప్రైవేట్ భూమి 27.28 హెక్టార్లు, ప్రభుత్వ భూమి 2.22 హెక్టార్లు, పెద్దేముల్లో 20.94 హెక్టార్ల భూమి, అందులో 19.64 హెక్టార్ల ప్రైవేట్ భూమి, 1.30 హెక్టార్ల ప్రభుత్వ భూమి, ధారూరులో 21.63 హెక్టార్లు, అందులో 19.36 హెక్టార్ల ప్రైవేట్ భూమి, 2.28 హెక్టార్ల ప్రభుత్వ భూమి, వికారాబాద్లో 27.51 హెక్టార్లు, అందులో 23.17 హెక్టార్ల ప్రైవేట్ భూమి, 4.34 హెక్టార్ల ప్రభుత్వ భూమి, నవాబుపేట మండలంలో 24.85 హెక్టార్లు, అందులో 23.49 హెక్టార్ల ప్రైవేట్ భూమి, 1.37 హెక్టార్ల ప్రభుత్వ భూమి అవసరమవుతుందని గుర్తించారు. డీపీఆర్ పూర్తయిన తర్వాత ఏ సర్వే నంబర్లలోని భూముల గుండా ఈ రైల్వే మార్గం నిర్మాణం జరుగుతుందో, సంబంధిత రైతులకు నోటీసులు జారీ చేసి పరిహారం అందజేసి భూ సేకరణ చేపడుతారు.
ప్రయాణ సమయం తగ్గింపు
బుల్లెట్ రైలు నిర్మాణం చేపట్టి హై స్పీడ్ రైలులో ప్రయాణాల ద్వారా ముంబయి నుంచి హైదరాబాద్ వరకు పుణె, షోలాపూర్, గుల్బర్గా, వికారాబాద్ మధ్య ప్రయాణ సమయం తగ్గిపోతుంది. ఇప్పటికే ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్ధికి ఊతం ఇవ్వడం జరుగుతుంది. ముంబయి, హైదరాబాద్ మధ్య ఉన్న రైలు, రోడ్డు, విమాన ట్రాఫిక్ల రద్దీని సైతం తగ్గించడానికి బుల్లెట్ రైలు దోహదపడుతుంది. ఈ కారిడార్లో పారిశ్రామిక కార్యకలాపాలు ప్రోత్సహించడం వల్ల ఉపాధి అవకాశాలు సైతం పెరుగుతాయి.
3 గంటల్లో ముంబయికి..
హై స్పీడ్ రైలులో ప్రయాణిస్తే హైదరాబాద్ నుంచి ముంబయికి 3 గంటల్లో చేరుకోవచ్చు. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ముంబయికి గల 710 కిలోమీటర్ల రోడ్డు మార్గాన ప్రయాణానికి 13.15 గంటల సమయం పడుతున్నది. విమానం ద్వారా ఆకాశమార్గంలో 617 కిలోమీటర్ల దూరం ప్రయాణానికి ఒక గంట 30 నిమిషాల సమయం, రైలు ద్వారా 773 కిలోమీటర్ల ప్రయాణానికి 14.20 గంటల సమయం పడుతుంది. హై స్పీడ్ రైలు ద్వారా ముంబయి-హైదరాబాద్ మధ్య దూరం 649.76 కిలోమీటర్లను కేవలం 3 గంటల్లో చేరుకోవచ్చు. గంటకు 330 కిలోమీటర్ల వేగంతో రైలు ప్రయాణించేలా ఈ మార్గం నిర్మాణం చేపడుతారు. ఈ హై స్పీడ్ రైలులో పది బోగీలు ఉంటాయి. ఒక్కో బోగిలో 75 మంది చొప్పున 750 మంది ప్రయాణించవచ్చు.
ఆలంపల్లిలో రైల్వే స్టేషన్
వికారాబాద్ జిల్లా పరిధిలోని ఆలంపల్లిలో హై స్పీడ్ రైల్వే స్టేషన్ నిర్మాణం చేపడుతారు. ముంబయి నుంచి హైదరాబాద్ వరకు 8 జిల్లాల పరిధిలో బుల్లెట్ రైలు మార్గముంటుంది. ఈ మార్గంలో మొత్తం 10 స్టేషన్లు ఏర్పాటు చేస్తారు. థానే, నవీ ముంబయి, లోనావాల, పుణె, బారామతి, పంధర్పూర్, షోలాపూర్, గుల్బర్గా, వికారాబాద్, హైదరాబాద్. వికారాబాద్కు సంబంధించి ఆలంపల్లిలో ఏర్పాటు చేసేలా డిజైన్ రూపొందించారు. థానే నుంచి 606.35 కి.మీ వద్ద ఆలంపల్లి రైల్వేస్టేషన్ ఉంటుంది.
జిల్లాలో ప్రభావిత గ్రామాలు
హై స్పీడ్ రైలు మార్గం నిర్మాణం ద్వారా వికారాబాద్ జిల్లా పరిధిలో 39 ప్రభావిత గ్రామాలుగా గుర్తించారు. వికారాబాద్ జిల్లా పరిధిలోకి తాండూరు మండలంలోని కరన్కోట్లో ఈ మార్గం ప్రారంభమై నవాబుపేట మండలం ముబారక్పూర్తో ముగుస్తుంది. జిల్లావ్యాప్తంగా తాండూరు మండలంలోని కరన్కోట్, చంద్రవంచ, చిట్టిఘనాపూర్, బెల్కటూరు, రాంపూర్, గోపనపల్లె, అల్లాపూర్, చెంగోలు, అంతారంతండా, పెద్దేముల్ మండలంలోని గాజీపూర్, కందనెల్లి, గొట్లపల్లె, ఖానాపూర్, మంబాపూర్, జనగాం, దుగ్గాపూర్, మార్పల్లె, మాన్సంపల్లె, ధారూరు మండలంలోని నాగసముందర్, గట్టెపల్లి, రుద్రారం, ధారూరు, ఊసపల్లి, అల్లీపూర్, కాచారం, సోమారం, వికారాబాద్ మండలంలోని అనంతగిరిపల్లి, గిర్గెట్పల్లి, ఆలంపల్లి, కొత్తగడి, కామారెడ్డిగూడ, పాతూర్, నవాబుపేట మండలంలోని చించల్పేట, అత్తాపూర్, అక్నాపూర్, పూలపల్లె, గాంగ్యేడ, ఎల్లకొండ, ముబారక్పూర్ల మీదుగా హై స్పీడ్ రైలు మార్గం ఉంటుంది.