యాదాద్రి భువనగిరి : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు మధ్యాహ్నం పూర్ణాహుతి నిర్వహించారు. అనంతరం బాలాలయంలో స్వామివారి చక్రస్నాన ఘట్టం వైభవంగా జరిగింది. బాలాలయంలో స్వామిఅమ్మవార్ల చక్రస్నాన మహాఘట్టంను అర్చకులు కన్నులపండువగా నిర్వహించారు.
కొండపైన ఉన్న పుష్కరిణి నుంచి జలాన్ని తీసుకువచ్చి బాలాలయంలో వెండి గంగాళంలో పోసి స్వామి అమ్మవార్లను చక్రస్నానం చేయించారు చక్రస్నాన మహాఘట్టానికి భక్తులు భారీగా తరలివచ్చి తరించారు. వెండి గంగాళంలో పుష్కరిణి జలంతో లక్ష్మీసమేతుడైన యాదాద్రీశుడు స్నానమాచరిస్తున్న సమయంలో భక్తుల జయజయ హర్షధ్వానాల మధ్య బాలాలయం మార్మోగింది.
‘యాదాద్రివాసా, యాదగిరీశా, గోవిందా గోవిందా’ అంటూ భక్తుల యాదాద్రి కొండ పెక్కటిల్లింది. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పమేలా సత్పతి, ఈవో గీత, అనువంశిక ధర్మకర్త బి. నరసింహామూర్తి, ఆలయ ప్రధానార్చకులు నల్లన్ థిఘల్ లక్ష్మీ నరసింహచార్యులు తదితరులు పాల్గొన్నారు.