‘కొద్దిరోజుల క్రితం పెద్దమ్మ గుడిలో కుంకుమార్చన కోసం వెళ్లాం. అక్కడకు వచ్చిన వారు తమ కుటుంబ సభ్యుల పేర్లు చెబుతుంటే అందులో మా సినిమాలోని మహిళల పేర్లు ఎక్కువగా వినిపించాయి. అప్పుడే ఈ చిత్రం ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుందనిపించింది’ అని అన్నారు కిషోర్ తిరుమల. ఆయన దర్శకత్వంలో శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. సుధాకర్ చెరుకూరి నిర్మాత. గురువారం ప్రీరిలీజ్ వేడుకను నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ ‘మానవ సంబంధాల పట్ల నాకు మమకారం ఎక్కువ. నిజ జీవితంలో జరిగే సంఘటనలు నన్ను బాగా కదిలిస్తాయి. వాటి స్ఫూర్తిగానే ఈ కథ రాసుకున్నా. ఇందులో తల్లీకూతురు సెంటిమెంట్ హృదయాల్ని కదిలిస్తుంది. కుటుంబ నేపథ్యంలో చక్కటి ప్రేమకథ ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వెల్ సన్నివేశానికి మహిళలు లేచి చప్పట్లు కొడతారు’ అని చెప్పారు. ‘సినిమాలోని పాత్రలన్నీ మన కుటుంబాల్లోని అమ్మ, చెల్లి, అక్కలను గుర్తుకుతెస్తాయి. వారిలాగానే సహజంగా మాట్లాడతాయి. మొత్తంగా ఈ సినిమా మన ఇంటిలో జరుగుతున్న కథలా అనిపిస్తుంది. మీ కుటుంబ సభ్యులతో కలిసి సినిమాను ఆస్వాదించండి’ అని కథానాయిక రష్మిక మందన్న చెప్పింది. నిర్మాత మాట్లాడుతూ ‘ఫ్యామిలీ ఆడియెన్స్తో పాటు యువతరం మెచ్చే అన్ని అంశాలుంటాయి. థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు అందరు సంతోషంగా ఫీలవుతారు’ అన్నారు. ఈ సమావేశంలో పాత్రికేయులు అడిగిన ఓ ప్రశ్నకు రష్మిక మందన్న తనదైన శైలిలో సమాధానమిచ్చి నవ్వుల్ని పూయించింది. ఇలాంటి కుటుంబ కథా చిత్రంలో నటిస్తున్నప్పుడు వస్త్రధారణ చాలా కష్టంగా అనిపిస్తుందని…షాట్కు రెడీ కావడానికే చాలా సమయం పట్టేదని చెప్పింది. ఈ కష్టాలు తప్పించుకోవాలంటే వచ్చే జన్మలో అబ్బాయిలా పుట్టాలనుందని ఛలోక్తి విసిరింది. ఈ కార్యక్రమంలో యాంకర్, సినీ నటి ఝాన్సీ, చిత్ర కెమెరామెన్ సుజిత్సారంగ్ పాల్గొన్నారు.