ఇల్లందకుంట : గడచిన ఏడేండ్లలో అన్ని ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకున్న బిజేపి పార్టీకి తెలిసింది ఒక్కటే, తాము అధికారంలో లేని రాష్ట్రాలను అస్థిరపరచడం తప్ప అభివృద్ధి పట్టదని తెలంగాణ వికాస సమితి ముఖ్య సలహాదారులు ప్రొఫెసర్ పాపిరెడ్డి అన్నారు.
ఆదివారం హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో ఇల్లంతకుంటలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ అధికారంలేని చోట అస్థిరపరుచాలె. అక్కడి ప్రభుత్వాలను కూలదోయాలె. అధికారంలోకి రావాలె. ఇదే విధానాన్ని కర్ణాటక, మధ్యప్రదేశ్, గోవా, మణిపూర్లలో చేసిందన్నారు. మహారాష్ట్రలోనూ అక్కడి సంకీర్ణ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నించింది.
ఇలాంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని అనడం హాస్యాస్పదంగా ఉంది. ఏడేండ్లుగా ప్రశాంతంగా ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని వ్యతిరేకించిన, తెలంగాణ అస్తిత్వాన్ని, ఇక్కడి వైవిధ్య జీవన విధానాన్ని వ్యతిరేకిస్తున్న ఆ పార్టీలో చేరిన కొంతమంది ప్రజలకు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు. తమ స్వార్థ రాజకీయాలకు తెలంగాణను బలిపెట్టాలనుకుంటున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తమకు అవకాశం ఇస్తే ఏం చేస్తామో చెప్పుకుంటారు. కానీ ఆ పార్టీ మాత్రం చరిత్రను వక్రీకరిస్తూ , అసత్యాలను ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలని కోరుకుంటున్నది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరిగిన ఎన్నికల సమయంలో ఆ పార్టీ, ఆ పార్టీ నేతలు ఎన్నికలకు ముందు చేసే చర్యలు ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా ఉంటాయి.
వ్యక్తులు ముఖ్యం కాదు. వ్యవస్థ ముఖ్యం. ఎన్నికల్లో ఎవరి పక్షాన నిలువాలన్నది ప్రజలకు స్పష్టమైన అవగాహన ఉంటది. కానీ కొంతమంది తాత్కాలిక ప్రయోజనాల కోసం తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం చేసే కుట్రలను ప్రజలు గమనించాలి అని పాపిరెడ్డి పిలుపు నిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం కృష్ణా, గోదావరి నదీ జలాల్లో తెలంగాణ హక్కులను పరిరక్షణ చేయడం లేదు. మహారాష్ట్ర పక్కరాష్ట్రా ల తో ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తూ కాళేశ్వరం లాంటి భారీ ప్రాజెక్టు పూర్తి చేయగలిగింది. ఇప్పుడు కృష్ణా నదీ జలాల విషయం లో ఏపీ తో తలెత్తిన వివాదాల పరిష్కారం కోసం కేంద్రం సూచనల మేరకు తెలంగాణ సుప్రీంకోర్టు లో వేసిన పిటిషన్ కూడా వెనక్కి తీసుకున్నది. కానీ ఏడాది అయినా కేంద్రం ఈ సమస్యను పరిష్కరించలేదు.
ఇక్కడి బీజేపీ నేతలు రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో మాట్లాడరు. కానీ టీఆర్ఎస్ ను నిందిస్తారు. ఇక కాంగ్రెస్ 2004 నుంచి 2014 దాకా పదేండ్లు పాలించినా తెలంగాణ ప్రాజెక్టులను పూర్తుచేయలేదు. పట్టించుకోలేదు. చట్టంలోని హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని నిలదీయడం లేదు. తెలంగాణ లో ఏదో ఒక ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వాలని పార్ల మెంట్ లో ప్రశ్నించరు. ఇదీ ఈ రెండు జాతీయ పార్టీలు తెలంగాణ పట్ల వ్యవహారిస్తున్నతీరు అని ఆయన దుయ్యబట్టారు.
విద్వేషాలు, వైషమ్యాలు రెచ్చగొట్టడం ద్వారా ప్రజల సహన శక్తిని హరించాలని చూస్తున్నారు. సమాజాన్ని నిట్ట నిలువునా చీల్చి వేసి తమ అధికారమే లక్ష్యంగా సాగుతున్నారు. కానీ వారు అధికారంలోకి వస్తే తెలంగాణ సమాజం ఎదుర్కొనే కష్టనష్టాల గురించి ప్రజలంతా చైతన్యవంతంగా ఆలోచన చేయవలసిన అవసరం ఉందని ఆయన తెలిపారు.
తెలంగాణ వికాస సమితి ఆవిర్భావం నుండి చిన్న రాష్ట్రాలు, ప్రాంతీయ పార్టీలతోనే అభివృద్ది సాధ్యమనే సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం. ఆచార్య జయశంకర్ చెప్పినట్టు స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణ కు శ్రీరామ రక్ష అన్నది అక్షరాలా నిజం. వ్యక్తుల పరంగా కాకుండా తెలంగాణ ప్రజల భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని ప్రాంతీయ పార్టీలను సమర్థిస్తున్నాం. అని ఆయన స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు డా. జయంతి, బిక్షపతి నాయక్, నాయకులు సంపత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.