ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తున్నది.. ఉద్యోగులను రోడ్డున పడేస్తున్నది.. నిరుద్యోగాన్ని పెంచేస్తున్నది.. మొత్తంగా దేశాన్నే భ్రష్టు పట్టిస్తున్నది కేంద్రంలోని బీజేపీ సర్కారు. ఇప్పుడు విద్యార్థుల జీవితాలతోనూ ఆడుకొంటున్నది. నూతన పరిశోధనలను, సృజనాత్మకతను ఖూనీ చేసేలా ఫెలోషిప్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నది. ఓ వైపు తెలంగాణ ప్రభుత్వం గురుకులాలు, ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ అందిస్తూ విద్యార్థుల భవిష్యత్తును బంగారుమయం చేస్తుంటే, కేంద్ర సర్కారు మాత్రం పీహెచ్డీ విద్యార్థుల ఫెలోషిప్కు కోతలు పెడుతూ, ని‘బంధనాలు’ విధిస్తూ ఉన్నత విద్యను నిర్లక్ష్యం చేస్తున్నది.
హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): మేధో వలసలను అరికడతామని, శాస్త్ర సాంకేతిక రంగాల్లో పరిశోధనలను ప్రోత్సహిస్తామని గొప్పలు చెప్పుకొంటున్న మోదీ సర్కారు ఫెలోషిప్స్కు భారీ కోతపెడుతున్నది. మేకిన్ ఇండియా, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్, స్టార్టప్ ఇండియా అంటూ ఊదరగొడుతున్న కేంద్రం యూనివర్సిటీ విద్యను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నది. పరిశోధనకు కీలకమైన ఫెలోషిప్స్ను కోతలు, నిబంధనల పేరుతో తగ్గిస్తున్నది. గత ఐదేండ్లలో 50 శాతం ఫెలోషిప్లకు కోత విధించింది. ఫలితంగా యూనివర్సిటీల్లో రిసెర్చ్ అటకెక్కింది. పీహెచ్డీల్లో చేరినవారంతా మధ్యలోనే నిష్క్రమిస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం దేశవ్యాప్తంగా 25-30 శాతం మాత్రమే పీహెచ్డీలను పూర్తి చేస్తున్నారు. మిగతావారంతా ఉత్త చేతులతోనే వెనుదిరుగుతున్నారు. దీనికంతటికీ కారణం.. ఫెలోషిప్స్ అందకపోవటమే.
2 లక్షల్లో 10 వేలలోపే..
దేశవ్యాప్తంగా ఉన్నత విద్యలో నమోదు క్రమంగా పెరుగుతున్నది. డిగ్రీ నుంచి పీజీ కోర్సుల్లో, పీజీ నుంచి పీహెచ్డీ కోర్సుల్లో చేరేవారి సంఖ్య అధికమవుతున్నది. ఏటా 3.45 కోట్ల మంది విద్యార్థులు ఉన్నత విద్యలో నమోదవుతుంటే వారిలో 2 లక్షల మంది మాత్రమే పీహెచ్డీ వరకు వెళ్తున్నారు. 2015లో పీహెచ్డీలో చేరినవారు లక్షకు పైగా ఉంటే 2020లో 2 లక్షలకు చేరింది. వీరిలో 10 వేలలోపు విద్యార్థులకు మాత్రమే ఫెలోషిప్స్ అందుతున్నాయి. క్యాటగిరీ -1 అడ్మిషన్స్లో భాగంగా నెట్, జేఆర్ఎఫ్ వారికి, క్యాటగిరీ-2 అడ్మిషన్స్లో భాగంగా ముందు అడ్మిషన్స్ జారీచేసి, తర్వాత ఫెలోషిప్ పొందిన వారికి అడ్మిషన్లు జారీ చేస్తున్నారు. కేంద్రం వైఖరితో ఫెలోషిప్స్ అందక పీహెచ్డీ విద్యార్థులంతా తూతూమంత్రంగా పరిశోధనను ముగించేస్తున్నారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో బోధించేందుకు ఈ నిబంధన అమలు చేస్తున్నారు. కాని పీహెచ్డీ పూర్తిచేసేందుకు కావాల్సిన ఫెలోషిప్స్, ఆర్థిక సహాయాన్ని మాత్రం కేంద్రం ఇవ్వటం లేదు.
యూజీసీ అందజేసే ఫెలోషిప్స్లో మార్పులిలా..
నోటిఫికేషన్లు ఇవ్వరు
పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్స్కు గత కొంతకాలంగా నోటిఫికేషన్లు ఇవ్వటం లేదు. దీంతో సంబంధిత ఫెలోషిప్స్ అమలవుతున్నాయో, లేదో తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయి. 2017 తర్వాత ఏ ఒక్క నోటిఫికేషన్ కూడా రాలేదు.
అన్ని క్యాటగిరీల్లో ఫెలోషిప్ల సంఖ్య పెంచాలి
విద్యార్థులతో పాటు, ఆచార్యులకు ఇస్తున్న ఫెలోషిప్స్లో కోత విధిస్తున్నారు. ఫలితంగా యూనివర్సిటీల్లో పరిశోధనలు కుంటుపడుతున్నాయి. పీహెచ్డీ చేస్తున్న సైన్స్ విద్యార్థులు కెమికల్స్ కొనాలి, పుస్తకాలు, ల్యాప్ట్యాప్లు సమకూర్చుకోవాలి. క్షేత్రస్థాయి అధ్యయనాలు, రవాణాచార్జీల కోసం ఆయా ఫెలోషిప్లు ఉపయోగపడతాయి. 56 శాతం ఉన్న బీసీలకు 300 ఫెలోషిప్లు ఇవ్వడం దారుణం. కనీసం ఏటా బీసీలకు 5 వేల ఫెలోషిప్లు ఇవ్వాలి. అన్ని క్యాటగిరీల్లో ఫెలోషిప్ల సంఖ్య పెంచాలి.
-డాక్టర్ సీహెచ్ పరంధాములు, సోషియాలజిస్ట్
వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్ర
ప్రపంచ దేశాలన్నీ పరిశోధనల ద్వారానే అభివృద్ధి చెందుతున్నాయి. పలు అధ్యయనాలు ఇదే విషయాన్ని వెల్లడిస్తున్నాయి. పేదరికం పోవాలన్నా, సమస్యలు పరిష్కారం కావాలన్నా నాణ్యమైన పరిశోధనతోనే సాధ్యం. అనేక మంది పేద విద్యార్థులు సమాజానికి ఉపయోగపడే కొత్త ఆవిష్కరణలు చేస్తున్నారు. వీరికి ఫెలోషిప్స్ అందజేస్తే మరింత ప్రోత్సాహం అందేది. కాని ఫెలోషిప్స్ను తగ్గించేందుకు, నిబంధనల పేరుతో కోత విధించేందుకు యూజీసీ ప్రయత్నిస్తున్నది. ఇదంతా వెనుకబడిన వర్గాలకు ఉన్నత విద్యను దూరం చేసే కుట్రలో భాగమే. ఇప్పటి వరకు చాలా ఫెలోషిప్స్కు నోటిఫికేషన్ ఇవ్వలేదు. యూజీసీ, కేంద్రం ఈ వైఖరిని విడిచి ఫెలోషిప్లను గణనీయంగా పెంచాలి. పరిశోధనలను ప్రోత్సహించాలి.
– డాక్టర్ పాలమాకుల కొమురయ్య, కాకతీయ విశ్వవిద్యాలయం