టీ20 ప్రపంచకప్ టోర్నీ కోసం భారత్ పక్కా ప్రణాళికతో సిద్ధమవుతున్నది. మరో ఎనిమిది నెలల్లో జరిగే మెగాటోర్నీ కోసం ఇప్పటి నుంచే సమాయత్తమవుతున్నది. ఓవైపు కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తూనే..అనుభవజ్ఞుల సేవలను సమయానుకూలంగా వాడుకుంటున్నది. చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్శర్మ వ్యూహ, ప్రతి వ్యూహాల్లో భాగంగా ఆటగాళ్ల ఎంపిక కొనసాగుతున్నది. బయోబబుల్ నుంచి సీనియర్ ప్లేయర్లకు విరామం కల్పిస్తూ కుర్రాళ్ల సత్తాను పరీక్షిస్తున్నది. వెస్టిండీస్ను వైట్వాష్ చేసి జోరుమీదున్న టీమ్ఇండియా.. శ్రీలంకతో టీ20 సిరీస్లో తలపడనుంది. సొంతగడ్డపై తమకు తిరుగులేదనే రీతిలో రోహిత్సేన కనిపిస్తుంటే…ఆసీస్ చేతిలో ఓటమితో ఒత్తిడిలో ఉన్న లంక కనీసం పోటీనివ్వాలని చూస్తున్నది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల మధ్య లక్నో వేదికగా నేడు తొలి టీ20 జరుగనుంది.
లక్నో: ఆస్ట్రేలియా వేదికగా జరిగే ప్రతిష్ఠాత్మక టీ20 ప్రపంచకప్ కోసం ప్రయోగాల పరంపర కొనసాగనుంది. మెగాటోర్నీ కోసం దాదాపు 35 మందితో ఒక కోర్ గ్రూపును ఎంపిక చేయాలన్న ఆలోచనతో ఉన్న టీమ్ఇండియా మేనేజ్మెంట్ అందుకు అనుగుణంగా ముందుకెళుతున్నది. వెస్టిండీస్తో టీ20 సిరీస్లో అవకాశాలను అందిపుచ్చుకుంటూ రాణించిన వెంకటేశ్ అయ్యర్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్ లాంటి యువ క్రికెటర్లకు మరిన్ని అవకాశాలు ఇవ్వనుంది. దీని ద్వారా టీ20 ప్రపంచకప్ నాటికి మరింత అనుభవం గడిస్తారని చీఫ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇప్పటికే స్పష్టం చేశాడు. ప్రపంచకప్ టోర్నీ కోసం ఎంపిక విషయంలో తనతో పాటు కెప్టెన్ రోహిత్శర్మ పూర్తి స్పష్టతో ఉన్నామని ద్రవిడ్ పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కుర్రాళ్లు సత్తాచాటేందుకు లంకతో మూడు మ్యాచ్ల పొట్టి సిరీస్ సరైన వేదిక కానుంది. ఇదిలా ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నిత్యం బయోబబుల్ వాతావరణంలో ఉంటున్న క్రికెటర్లకు విరామం కల్పిస్తున్నది. ఇందులో భాగంగా సీనియర్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, షమీకి విశ్రాంతినిచ్చింది. మరోవైపు కేఎల్ రాహుల్, దీపక్ చాహర్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్పటేల్ గాయాల పాలయ్యారు. అందుబాటులో ఉన్న వనరులను పూర్తిగా సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమైన మేనేజ్మెంట్ అందుకు అనుగుణంగా తుది జట్టును ఎంపిక చేయనుంది.
ప్రతిభ కల్గిన కుర్రాళ్లను పరీక్షించేందుకు ప్రయోగాలను కొనసాగించనున్నారు. విండీస్తో మూడో టీ20 పోరులో అంతగా ఆకట్టుకోలేకపోయిన రుతురాజ్ గైక్వాడ్, అవెశ్ఖాన్కు మళ్లీ అవకాశం ఇవ్వనున్నారు. కొన్ని మ్యాచ్లు, సిరీస్ల ద్వారా ప్లేయర్లపై ఒక అంచనాకు రాబోమని కోచ్ ద్రవిడ్ పేర్కొన్న నేపథ్యంలో తుది జట్టు కూర్పు ఆసక్తికరంగా ఉండనుంది. దీనికి తోడు ఓవైపు వైస్ కెప్టెన్ బుమ్రా తిరిగి తుది జట్టులోకి రావడం ఖరారు కాగా, గాయం నుంచి కోలుకున్న ఆల్రౌండర్ జడేజా..ప్రాక్టీస్లో హుషారుగా కనిపించాడు. మొత్తంగా ద్రవిడ్, రోహిత్ మార్క్ జట్టు ఎంపికలో స్పష్టంగా కనిపించనుంది. విండీస్తో సిరీస్లో ఆకట్టుకున్న యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్ను కొనసాగించే అవకాశముండగా, వికెట్కీపర్, బ్యాటర్ సంజూ శాంసన్ ఎంపికపై ఆసక్తి నెలకొన్నది. బుమ్రా, భువనేశ్వర్కు తోడు హర్షల్ పటేల్, శార్దూల్ ఠాకూర్ పేస్ బాధ్యతలు పంచుకోనుండగా, పూర్తి స్థాయి ఆల్రౌండర్గా వెంకటేశ్ అయ్యర్ ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం కనిపిస్తున్నది. విండీస్తో మూడు మ్యాచ్ల్లో బ్యాటింగ్లో అదరగొట్టిన వెంకటేశ్.. రెండు వికెట్లు తీసి తన పాత్రకు న్యాయం చేశాడు. సూర్యకుమార్ గైర్హాజరీలో మిడిలార్డర్లో వెంకటేశ్ మరింత కీలకం కానున్నాడు.
భారత్: రోహిత్(కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్, శ్రేయాస్, వెంకటేశ్, శాంసన్, జడేజా, చాహల్, హర్షల్ పటేల్, భువనేశ్వర్, బుమ్రా
శ్రీలంక: షనక(కెప్టెన్), నిస్సనకా, అసలంక, లియానగీ, చండిమల్, గుణతిలక, కరుణరత్నె, చమీర, వాండర్సే, ఫెర్నాండో, ప్రవీణ్.
ఆస్ట్రేలియా చేతిలో సిరీస్ ఓటమి ఎదుర్కొని ఒత్తిడిలో ఉన్న శ్రీలంక..భారత్కు పోటీనిచ్చేందుకు తహతహలాడుతున్నది. అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న లంకను కీలక సమయాల్లో ఆదుకునే వారు కనిపించడం లేదు. బ్యాటింగ్ పరంగా ఇంకా మెరుగుకావాల్సి ఉందని కెప్టెన్ దసున్ షనక పేర్కొన్నాడు. మరోవైపు స్టార్ స్పిన్నర్ వహిందు హసరంగ మరోమారు కరోనా బారిన పడటం ఆ జట్టు గెలుపు అవకాశాలపై ప్రభావం చూపించనుంది.