వీరబాదుడుకు కేరాఫ్ అడ్రస్ అయిన జోస్ బట్లర్ శతకంతో చెలరేగడంతో ముంబై ఇండియన్స్పై రాజస్థాన్ రాయల్స్ పైచేయి సాధించింది. బుమ్రా, మిల్స్ను కాచుకుంటూ.. మిగిలిన బౌలర్లతో చెడుగుడాడుకున్న బట్లర్ సీజన్లో తొలి సెంచరీ నమోదు చేయగా.. తెలంగాణ కుర్రాడు ఠాకూర్ తిలక్ వర్మ ఆకాశమే హద్దుగా చెలరేగినా ముంబైని
ముంబై: ఓపెనర్ జోస్ బట్లర్ (68 బంతుల్లో 100; 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీతో కదంతొక్కడంతో రాజస్థాన్ రాయల్స్ వరుసగా రెండో విజయం సొంతం చేసుకుంది. ఐపీఎల్ 15వ సీజన్లో భాగంగా శనివారం జరిగిన పోరులో రాజస్థాన్ 23 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ను చిత్తు చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసింది. బట్లర్ ఇన్నింగ్స్కు యాంకర్ రోల్ పోషించగా.. కెప్టెన్ సంజూ శాంసన్ (21 బంతుల్లో 30; ఒక ఫోర్, 3 సిక్సర్లు), హెట్మైర్ (14 బంతుల్లో 35; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టారు. ఈ ముగ్గురు మినహా తక్కినవాళ్లు విఫలమయ్యారు. ముంబై బౌలర్లలో బుమ్రా, మిల్స్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ముంబై 20 ఓవర్లలో 8 వికెట్లకు 170 రన్స్ చేసింది. తెలంగాణ ఆల్రౌండర్ ఠాకూర్ తిలక్ వర్మ (33 బంతుల్లో 61; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), ఇషాన్ కిషన్ (43 బంతుల్లో 54; 5 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకాలతో పోరాడినా జట్టును గెలిపించలేకపోయారు. అయితే క్రీజులో ఉన్నంతసేపు తిలక్ రాజస్థాన్ బౌలర్లను భయపెట్టాడు. ఎడాపెడా భారీ షాట్లు బాదుతూ లక్ష్యాన్ని కరిగించాడు. రాయల్స్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్, నవ్దీప్ సైనీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. తాజా సీజన్లో తొలి సెంచరీ నమోదు చేసిన జోస్ బట్లర్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
అత్యున్నత స్థాయిలో అడుతున్నది రెండో మ్యాచే అయినా.. ఎదుర్కొంటున్నది ప్రపంచ స్థాయి బౌలర్లను అని తెలిసినా.. తిలక్ వర్మ ఏమాత్రం అదరలేదు, బెదరలేదు! బంతి తన పరిధిలో ఉంటే చాలు దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడ్డ ఈ తెలంగాణ కుర్రాడు.. ఐపీఎల్లో తొలి అర్ధశతకం నమోదు చేసుకున్నాడు. భారీ లక్ష్యఛేదనలో 40 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన దశలో క్రీజులో అడుగుపెట్టిన తిలక్.. సీనియర్ ఆఫ్స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలింగ్లో సిక్సర్తో బ్యాట్కు పనిచెప్పాడు. కాసేపటికి నవ్దీప్ సైనీ ఓవర్లో 4,6 అరుసుకున్న తిలక్.. చాహల్కు అదే శిక్ష వేశాడు. పరాగ్ బౌలింగ్లో తిలక్ కొట్టిన భారీ సిక్సర్ నేరుగా కెమెరామెన్ తలపై పడటం గమనార్హం. ఈ క్రమంలో అర్ధశతకం పూర్తి చేసుకున్న తిలక్.. అశ్విన్ బౌలింగ్లో రివర్స్ స్వీప్ ద్వారా భారీ సిక్సర్ రాబట్టాడు. ఫుల్ జోష్లో ఉన్న తిలక్ను అశ్విన్ ఓ తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. అంతకుముందు మైదానంలో పాదరసంలా కదిలిన తిలక్ రెండు క్యాచ్లు పట్టడంతో పాటు ఓ రనౌట్లో భాగస్వామి అయ్యాడు.
రాజస్థాన్: బట్లర్ (బి) బుమ్రా 100, జైస్వాల్ (సి) డావిడ్ (బి) బుమ్రా 1, పడిక్కల్ (సి) రోహిత్ (బి) మిల్స్ 7, శాంసన్ (సి) తిలక్ వర్మ (బి) పొలార్డ్ 30, హెట్మైర్ (సి) తిలక్ వర్మ (బి) బుమ్రా 35, పరాగ్ (సి) డావిడ్ (బి) మిల్స్ 5, అశ్విన్ (రనౌట్) 1, సైనీ (సి) ఇషాన్ (బి) మిల్స్ 2, బౌల్ట్ (నాటౌట్) 1, ఎక్స్ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 193/8. వికెట్ల పతనం: 1-13, 2-48, 3-130, 4-183, 5-184, 6-185, 7-188, 8-193, బౌలింగ్: బుమ్రా 4-0-17-3, సమ్స్ 4-0-32-0, థంపీ 1-0-26-0, మురుగన్ 3-0-32-0, మిల్స్ 4-0-35-3, పొలార్డ్ 4-0-46-1.
ముంబై: ఇషాన్ (సి) సైనీ (బి) బౌల్ట్ 54, రోహిత్ (సి) పరాగ్ (బి) ప్రసిద్ధ్ 10, అన్మోల్ప్రీత్ (సి) ప్రసిద్ధ్ (బి) సైనీ 5, తిలక్ వర్మ (బి) అశ్విన్ 61, పొలార్డ్ (సి) బట్లర్ (బి) సైనీ 22, డావిడ్ (ఎల్బీ) చాహల్ 1, సమ్స్ (సి) బట్లర్ (బి) చాహల్ 0, మురుగన్ (రనౌట్/శాంసన్) 6, బుమ్రా (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 11, మొత్తం: 20 ఓవర్లలో 170/8. వికెట్ల పతనం: 1-15, 2-40, 3-121, 4-135, 5-136, 6-136, 7-165, 8-170, బౌలింగ్: బౌల్ట్ 4-0-29-1, ప్రసిద్ధ్ 4-0-37-1, సైనీ 3-0-36-2, అశ్విన్ 4-0-30-1 చాహల్ 4-0-26-2, పరాగ్ 1-0-11-0.