న్యూఢిల్లీ, ఏప్రిల్ 20: ఆహార ద్రవ్యోల్బణం ముఖ్యంగా వంటనూనెల ప్రియం.. రెస్టారెంట్లలో ధరల మోత మోగిస్తున్నది. మెక్డొనాల్డ్స్, డొమినోస్, బార్లు, కేఫ్ల వంటి క్విక్-సర్వీస్ రెస్టారెంట్లు తమ ఆహార పదార్థాల రేట్లను 15 శాతం వరకు పెంచుతున్నాయి. గడిచిన మూడు నెలల్లో తయారీ ఖర్చులు 30 శాతం వరకు పెరిగాయని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
కాగా, ఒకేసారి లేదా రాత్రికిరాత్రి ద్రవ్యోల్బణానికి తగ్గట్టుగా మెనూ ధరల్ని పెంచబోమని, కొద్దికొద్దిగా పెంచుతామని బిర్యానీ బ్లూస్ వ్యవస్థాపకుడు రేమండ్ ఆండ్రూస్ తెలిపారు. వినియోగదారులపై భారం పడకుండా 4-5 శాతం చొప్పున పెంచుతామన్నారు. మూడేండ్ల తర్వాత ఇప్పుడే ధరల్ని పెంచుతున్నామని, అదికూడా కనీసంగా 5 శాతమేనని మెయిన్లాండ్ చైనా, ఆసియా కిచెన్, సిగ్రీ గ్లోబల్ గ్రిల్ వంటి స్పెషాల్టీ రెస్టారెంట్ల చైర్మన్ అంజన్ చటర్జీ అన్నారు. లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు రూ.120కి సమీపించగా, వంటనూనె ధర రూ.200 దాటిన విషయం తెలిసిందే. దీంతో అన్నింటి ధరలు పెరుగుతూపోతున్నాయి. రెస్టారెంట్లు, హోటళ్ల నిర్వహణ వ్యయం కూడా పెరిగిందని యాజమాన్యాలు చెప్తున్నాయి. కాగా, మార్చిలో రిటైల్ ద్రవ్యోల్బణం 17 నెలల గరిష్ఠాన్ని తాకుతూ 6.95 శాతంగా నమోదైన సంగతి విదితమే.