తాండూరు రూరల్ : అనారోగ్యం బారీన పడిన కూతురును కాపాడుకునేందుకు భుజాలపై మోసుకొచ్చిన తల్లిదండ్రుల తాపత్రయం ఫలించలేదు. గ్రామ శివారులో ప్రవహిస్తున్న వాగుకు వంతెన లేని కారణంగా చిన్నారికి సకాలంలో వైద్యం అందక ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాదకర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం బిజ్వార్ అనుబంధ గ్రామమైన బొంకూరు గ్రామంలో జరిగింది. గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం.. బొంకూరు గ్రామానికి చెందిన బాలప్ప, అమృతమ్మల కూతురు హరిక(11) నాలుగు రోజుల క్రితం అనారోగ్యానికి గురైంది.
బిజ్వార్ – బొంకూరు గ్రామాల మధ్య కాగ్నానది భారీ వర్షాల కారణంగా ఉధృతంగా ప్రవహించడంతో దవాఖానకు తీసుకెళ్లలేకపోయారు. బాలిక ఆరోగ్యం క్షీణించడంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు గ్రామానికి చెందిన మరో వైపు పెద్దేముల్ మండలం రుక్మాపూర్ మీదుగా ట్రాక్టర్పై తరలించేందుకు ఏర్పాటు చేసుకున్నారు. కానీ మార్గ మధ్యలో భారీ వర్షాలకు బురదమయంగా మారింది. శుక్రవారం బాలికను ట్రాక్టర్లో తరలిస్తుండగా బురదలో కూరుకుపోయింది. భుజాలపై మోసుకొచ్చినా దిక్కుతోచని స్థితిలో కుటుంబీకులు బాలికను రైలు పట్టాల గుండా తాండూరు దవాఖానకు తరలించారు. శనివారం ఉదయం చికిత్స పొందుతూ బాలిక మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వాగుపై వంతన లేకపోవడం వల్లనే బాలిక చనిపోయిందని, సకాలంలో వైద్యం అందిస్తే బతికేదని బాధితులు తెలిపారు.