న్యూఢిల్లీ, మే 2: భారత్లో టెస్లా వాహనాలను తయారుచేస్తే ఆ సంస్థకూ లాభాలుంటాయని కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పారు. సోమవారం ఇక్కడ ‘రైజినా డైలాగ్’లో మాట్లాడుతూ దేశంలో పెట్రో ఆధారిత వాహనాల ధరల కంటే అన్ని విద్యుత్తు ఆధారిత వాహనాల (ఈవీ) ధరలు తక్కువగా ఉండే రోజులు ఎంతో దూరంలో లేవన్నారు. ఈ క్రమంలోనే ‘భారత్లో టెస్లా తమ వాహనాలను ఉత్పత్తిచేస్తే ఆ సంస్థకూ ప్రయోజనాలుంటాయి’ అని తెలిపారు.
భారత్లో ఈవీలను తయారుచేసేందుకు టెస్లా సిద్ధంగా ఉంటే సమస్య లేదని, కానీ చైనా నుంచి మాత్రం కార్లను దిగుమతి చేసుకుంటే ఒప్పుకోబోమని గత మంగళవారం ఇదే వేదికగా గడ్కరీ స్పష్టం చేసిన విషయం తెలిసిందే. భారత మార్కెట్ పెద్దదని, ఇక్కడ తయారుచేసి విదేశాలకూ ఎగుమతి చేసుకునే వీలుంటుందని టెస్లా సీఈవోను ఉద్దేశిస్తూ ఈ సందర్భంగా గడ్కరీ అన్నారు.
ఈ క్రమంలో మరోసారి టెస్లా అంశాన్ని మంత్రి ప్రస్తావనకు తెచ్చారు. దేశంలోని అధిక పన్నులపై టెస్లా విమర్శలు గుప్పించిన నేపథ్యంలో ముందు భారత్లో వాహనాలను తయారుచేయాలని, ఆ తర్వాత పన్ను రాయితీలను పరిశీలిస్తామని భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా గడ్కరీ గత ఏడాది టెస్లాకు చెప్పిన సంగతి విదితమే.