గోవాలో సెలవులను ఉల్లాసంగా గడిపిన వారు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ ప్రైవేటు బస్సునిండా రెండు కుటుంబాల వారే. అంతా బంధువులే. మరికొద్ది గంటల్లో హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా.. మార్గమధ్యంలోనే మృత్యువు కబళించింది. కర్ణాటక లోని కలబురగి సమీపంలో తెల్లవారుజామున బస్సు ప్రమాదానికి గురైంది. క్షణాల్లో అగ్నికీలలు అందరినీ చుట్టుముట్టాయి. బస్సు మంటల్లో ఆహుతి కాగా, మూడేండ్ల బాలుడు సహా ఏడుగురు
హైదరాబాద్ సిటీబ్యూరో/ జహీరాబాద్, జూన్ 3 (నమస్తే తెలంగాణ): గోవాలో సెలవులను ఉల్లాసంగా గడిపిన వారు ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. ఆ ప్రైవేటు బస్సునిండా రెండు కుటుంబాల వారే. అందరూ బంధువులే. మరికొద్ది గంటల్లో హైదరాబాద్ చేరుకోవాల్సి ఉండగా.. మార్గమధ్యంలోనే మృత్యువు కబళించింది. కర్ణాటక లోని కలబురగి సమీపంలో తెల్లవారుజామున బస్సు ప్రమాదానికి గురైంది. క్షణాల్లో అగ్నికీలలు అందరినీ చుట్టుముట్టాయి. బస్సు మంటల్లో ఆహుతి కాగా, మూడేండ్ల బాలుడు సహా నిద్రిస్తున్న ఏడుగురు సజీవదహనం అయ్యారు.
మిగిలిన 28మంది గాయాలతో బయటపడ్డారు. మృతులను హైదరాబాద్ వాసులుగా గుర్తించారు. బొల్లారానికి చెందిన అర్జున్కుమార్ (37), ఆయన భార్య సరళాదేవి (32), కొడుకు విహాన్ (3)తోపాటు వారి బంధువు అనిత (58), కామాటిపురలో నివాసముండే శివకుమార్ (35), ఆయన భార్య రవళి (30), కుమారుడు దీక్షిత్ (9) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బస్సు కల్వర్టును బలంగా ఢీకొన్నదని, డీజిల్ ట్యాంకర్ పేలడంతో మంటలు వ్యాపించాయని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. స్థానికులు, మృతుల బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. బొల్లారం రిసాల బజార్కు చెందిన అర్జున్ ఓ ప్రైవేటు కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నారు.
మే 27న కూతురు పుట్టినరోజు వేడుకలను ఆయన ఘనంగా నిర్వహించారు. మరుసటిరోజు బంధుమిత్రులతో కలిసి విహారయాత్రకు గోవా బయల్దేరారు. ఇందుకోసం ఆరెంజ్ ట్రావెల్స్ స్లీపర్ కోచ్లో టిక్కెట్లను బుక్ చేశారు. ఒక కుటుంబానికి చెందిన 21మంది, మరో కుటుంబానికి చెందిన 11మంది, ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ కలిసి మొత్తం 35మంది బస్సులో బయల్దేరి వెళ్లారు. అర్జున్ తల్లి ఒక్కరే యాత్రకు రాకుండా ఇంటివద్ద ఉన్నారు.
అరేబియా సముద్ర తీరాన బంధుమిత్రులతో ఉల్లాసంగా గడిపిన వారంతా ఈ నెల 2న హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. గురువారం రాత్రి గోవానుంచి బయల్దేరిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున 5.30 గంటల ప్రాంతంలో కర్ణాటక లోని కలబురగి జిల్లా కమలాపురం వద్దకు చేరుకున్నది. బీదర్-శ్రీరంగపట్నం జాతీయ రహదారిపై ఎదురుగా వచ్చిన మినీ డీసీఎం వ్యానును తప్పించబోయి బస్సు కల్వర్టును వేగంగా ఢీకొట్టింది. దీంతో ముందు చక్రాలు ఊడిపోయి పక్కనున్న 20 అడుగుల లోతైన గుంతలో బస్సు పడిపోయింది. కల్వర్టును ఢీకొన్న క్రమంలో డీజిల్ ట్యాంకు పగిలిపోగా.. ఆ వెంటనే మంటలు చెలరేగాయి.
ప్రమాద సమయంలో అందరూ నిద్రలో ఉన్నారు. నిమిషాల వ్యవధిలోనే అగ్ని కీలలు బస్సును చుట్టుముట్టాయి. పొగ, మంటలు వ్యాపించడంతో బస్సులోని వారు ఉక్కిరిబిక్కిరయ్యారు. వెనుక వైపు అద్దాలను పగులగొట్టుకొని కొందరు బయటకు దూకారు. ఆర్తనాదాలను విని పరిగెత్తుకొచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
బస్సులో ముందు వరుసల్లో నిద్రిస్తున్న అర్జున్ కుమార్, ఆయన భార్య సరళాదేవి, కొడుకు విహాన్, అనిత, శివకుమార్, ఆయన భార్య రవళి, కుమారుడు దీక్షిత్తోపాటు వారి బంధువు అనిత సజీవదహనమయ్యారు. మంటలకు వారి శరీరాలు కాలిపోయి మాంసం ముద్దలుగా మారాయి. అర్జున్ కూతురు ప్రణీత(6) మృత్యుంజయురాలిగా నిలిచారు. ఆ చిన్నారితోపాటు అర్జున్ తండ్రి ముకుందరావు ప్రమాదం నుంచి బయటపడ్డాడు. గాయపడిన వారందరినీ చికిత్స నిమిత్తం కలబురగి దవాఖానకు తరలించారు. ప్రమాద ఘటనకు సంబంధించి భిన్న కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని కలబురిగి జిల్లా ఎస్పీ ఇషాపంత్ తెలిపారు. ఘటనాస్థలాన్ని పరిశీలించిన ఆయన యాక్సిడెంటులో మినీ వ్యాన్ డ్రైవర్, క్లీనర్ కూడా గాయపడ్డారని చెప్పారు.
కర్ణాటకలోని కలబురగిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైద్రాబాద్ వాసులు మరణించడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతిని, విచారాన్ని వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు.
కర్ణాటక అధికారులతో సమన్వయం చేసుకొని తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు. గాయపడినవారికి రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందజేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ఆదేశించారు.
మృతదేహాలను స్వస్థలానికి తరలించి, క్షతగాత్రులకు వైద్య సాయం అందేలా చర్యలు చేపట్టాలని మంత్రులు తన్నీరు హరీశ్రావు, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను, క్షతగాత్రులను తరలించేందుకు చర్యలు చేపట్టాలని సీఎస్ సోమేశ్ కుమార్ సంగారెడ్డి జిల్లా కలెక్టర్కు తెలిపారు.