యాదాద్రి భువనగిరి, మార్చి 19 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): చేనేత వస్త్ర పరిశ్రమకు పుట్టినిల్లు అయిన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లికి చెందిన చేనేత కళాకారుడు భోగ బాలయ్య మరోసారి అద్భుత ప్రతిభను చాటారు. 10 వేల రంగులతో 46X46 ఇంచుల సైజులో డబుల్ ఇక్కత్ హ్యాండ్లూమ్లో మధ్యలో భారతదేశ చిత్రపటాన్ని కూర్చి, అందులో రాట్నం వచ్చేటట్టు కండువాను నేసి అబ్బురపరిచారు. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా దేశభక్తిని చాటుకొనేందుకు తనకున్న చేనేత పరిజ్ఞానంతో ఈ కండువాను తయారు చేసినట్టు బాలయ్య తెలిపారు. పర్యావరణ హిత రంగులతో కళాత్మకంగా ఈ కండువాను తీర్చిదిద్దేందుకు ఏడాదిన్నర కాలం పట్టిందని చెప్పారు. నిలువు 100 పాయలు, పేక 100 చిటికీలతో భారతదేశ చిత్రపటం, రాట్నం పొందుపర్చి తయారుచేసిన ఇక్కత్ రుమాలు సైతం అబ్బురపరుస్తున్నది. ఇదే స్ఫూర్తితో 10 వేల రంగులతో చీరెను నేయబోతున్నట్టు బాలయ్య తెలిపారు. దేశ చిత్రపటంతో నేసిన కండువాను త్వరలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆవిష్కరించనున్నట్టు చెప్పారు.