న్యూఢిల్లీ:ఇంతకుముందు నెట్వర్క్ విస్తరణకు చార్జీలు పెంచడం తప్పనిసరని దేశీయ టెలికం సంస్థలు వాదించేవి. పరిశ్రమ మనుగడ సాధించడానికి చార్జీల పెంపు అనివార్యం అని రేపోమాపో చార్జీలు పెంచుతామని ప్రకటనలు చేసేవి. కానీ ఇప్పుడు దేశీయ టెలికం సంస్థలు ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా మౌనం వహిస్తున్నాయి. తమ ప్రత్యర్థి సంస్థ.. 4జీ సంచలనం రిలయన్స్ జియో ఈ దిశగా చర్యలు తీసుకోకపోవడంతో, ఆ సంస్థలూ ఛార్జీలను పెంచే విషయమై ఎటువంటి దూకుడు ప్రదర్శించడం లేదు.
తాజాగా రిలయన్స్ జియో వ్యూహాత్మకంగా ముందడుగు వేసింది.నెలవారీగా కనెక్షన్లను పెంచుకోవడంలో ముందు ఉన్న ఎయిర్టెల్ను అడ్డుకోవడంతోపాటు వొడాఫోన్ ఐడియాకు ఉన్న 2జీ ఫీచర్ఫోన్ల వినియోగదారులను ఆకట్టుకునేలా రిలయ్స్ జియో భారీ ప్రణాళికే ప్రకటించింది. రూ.1999కే ఫోన్ కూడా ఇస్తూ, రెండేండ్లు అపరిమిత కాల్స్, డేటా ఆఫర్తో ఇప్పట్లో ఛార్జీల పెంపునకు సుముఖంగా లేమనే జియో పరోక్ష సంకేతాలిచ్చింది. ఇది ఖచ్చితంగా ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలకు ఇబ్బందికరమైనా ఇప్పటికైతే కస్టమర్లకు రిలీఫ్ లభిస్తున్నది.
2021లో జియో న్యూ ప్లాన్..
శంలో 30 కోట్ల మంది 2జీ ఫోన్ యూజర్లను 4జీకి మార్చడమే లక్ష్యంగా ఇటీవల ‘కొత్త జియోఫోన్ 2021’ అంటూ రిలయన్స్ జియో న్యూ ప్లాన్ విడుదలచేసింది. కొత్త జియోఫోన్లను కేవలం రూ.1999 ఇవ్వడంతోపాటు రెండేండ్లు అపరిమిత కాల్స్, నెలకు అధికవేగం 2జీబీ డేటా, అటుపై పరిమిత వేగంతో అపరిమిత డేటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుత జియోఫోన్ వినియోగదారులు రూ.749తో ఏడాదిపాటు అపరిమిత కాల్స్, డేటా సదుపాయాలు పొందొచ్చు.
నెలకు రూ.22 నుంచి మరో 5 ప్రీపెయిడ్ పథకాలను కూడా జియోఫోన్ తన యూజర్ల కోసం తెచ్చింది. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా 2జీ యూజర్లు ఇప్పటికీ నెలకు అధికమొత్తాలు చెల్లిస్తున్నారని, వీరికి తక్కువ ఖర్చయ్యే పథకాలతో తమ నెట్వర్క్కు ఆకర్షించగలమని జియో భావిస్తున్నది. కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న జియో ఖాతాదారుల అభివృద్ధి.. జియో ఫీచర్ ఫోన్తో మళ్లీ గాడిలో పడొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వొడాఫోన్పైనే ఎక్కువ ప్రభావం
రెండేండ్ల అపరిమిత కాల్స్, డేటాతో ఫీచర్ ఫోన్ మార్కెట్లోకి విడుదల చేస్తూ రిలయన్స్ జియో తీసుకున్న నిర్ణయం భారతీ ఎయిర్టెల్ కంటే వొడాఫోన్ ఐడియాపైనే ఎక్కువ ప్రభావం చూపనున్నది. కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సవరించిన స్థూల బకాయిలు చెల్లించేందుకు, తీవ్రమైన నిధుల కొరత ఎదుర్కొన్న వొడాఫోన్ ఐడియా దాదాపు మూసివేత దశకు వెళ్లింది. అయితే ఆ గండం నుంచి తప్పించుకున్న కంపెనీ.. ఇప్పుడు భారతీ ఎయిర్టెల్, రిలయన్స్ జియోలతో పోటీపడలేకపోతుంది.
భారీ రుణభారానికి తోడు నెట్వర్క్ పటిష్ఠతకు కూడా నిధులు కేటాయించలేని పరిస్థితి వొడాఫోన్ ఐడియాది. అందుకే ఇటీవలి స్పెక్ట్రమ్ వేలంలో కూడా నామమాత్రంగానే వొడాఫోన్ ఐడియా కొత్త స్పెక్ట్రమ్ కొనుగోలు చేయగలిగింది. కొన్ని నెలలుగా వొడాఫోన్ ఐడియా తన యూజర్లను గణనీయంగా కోల్పోతున్నది. తాజాగా రిలయన్స్ తెచ్చిన జియోఫోన్తో ఎక్కువ మంది 2జీ ఖాతాదారులు గల వొడాఫోన్ ఐడియా మరిన్ని సమస్యలు ఎదుర్కోనున్నది.
గతేడాది డిసెంబర్లో భారతీ ఎయిర్టెల్ 40 లక్షలకు పైగా కొత్త ఖాతాదారులను చేర్చుకుంటే, జియో మాత్రం 4,78,197 మంది యూజర్లను పెంచుకుంది. ఇదే టైంలో వొడాఫోన్ ఐడియా మాత్రం 56.9 లక్షల మంది సబ్స్క్రైబర్లను కోల్పోయింది. కనెక్షన్ల వృద్ధి పరంగా ఎయిర్టెల్ చేతిలో జియో వెనుకంజ వేయడం ఇది వరుసగా అయిదో నెల. ఇక డిసెంబర్లో ఎయిర్టెల్కు 97.1 శాతం, వొడాఫోన్ ఐడియాకు 90.26 శాతం, రిలయన్స్ జియోకు 80.23 శాతం క్రియాశీల యూజర్లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
ఎమర్జెన్సీలో క్రెడిట్ కార్డ్/ షార్ట్టర్మ్ లోన్.. ఏది బెటర్!