హైదరాబాద్ : కొండా కోనల మధ్య ఎగిసిపడే నీటి పరవళ్లు.. మనసుకు హాయిగొలిపే సుందర దృశ్యం ఆవిష్కృతమైంది. ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు పొచ్చెర జలపాతం జలకళను సంతరించుకొని పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలానికి వెళ్లే మార్గంలో జాతీయ రహదారికి ఆరు కిలోమీటర్ల దూరంలో పొచ్చెర గ్రామ సమీపంలో సహజ సిద్ధంగా ఏర్పడిన జలపాతం పర్యాటకులకు ఆహ్వానం పలుకుతున్నది. బోథ్ మండలంలో ఉన్న జలపాతం హైదరాబాద్కు 256 కిలోమీటర్ల దూరంలో ఉంది.
ఇక్కడికి చేరుకునేందుకు రెండు మార్గాలున్నాయి. నిర్మల్ జిల్లా కేంద్రానికి 36 కిలోమీటర్ల దూరంలో ఉండగా.. ఆదిలాబాద్కు 55కిలోమీటర్ల దూరంలో ఉంది. అటవీ శాఖలోని సామాజిక వన విభాగం దీన్ని మరింత అందంగా తీర్చిదిద్దేందుకు జలపాతం వద్ద ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు వివిధ రకాలైన మొక్కలను పెంచుతోంది. ఇక్కడ వనదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. జలపాతం వద్దకు రోడ్డు వేయడంతో పాటు విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇక్కడ కొన్ని సినిమా షూటింగులు కూడా జరిగాయి.