హైదరాబాద్ : కృష్ణా జలాల్లో 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీపై రాజీ ప్రసక్తే లేదని నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్కుమార్ స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లో జలసౌధలో కృష్ణా నది యాజమాన్య బోర్డు సమావేశం చైర్మన్ ఎంపీ సింగ్ అధ్యతన ప్రారంభమైంది. సమావేశానికి తెలంగాణ, ఏపీ అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో తెలంగాణ నీటిపారుదల శాఖ వాదనలు వినిపించింది. గతంలో జరిగిన కృష్ణా జలాల పంపిణీ తాత్కాలికమేనని రాష్ట్ర నీటి పారుదలశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ రజత్కుమార్ పేర్కొన్నారు. ఏపీ, తెలంగాణ మధ్య 512:299 నిష్పత్తిలో నీటి పంపిణీ తాత్కాలికమేనన్నారు.
కేవలం 2015-16 ఏడాదికి వర్తించేలా మాత్రమే అంగీకారం కుదిరిందని స్పష్టం చేశారు. ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా ప్రాజెక్టులు పూర్తయ్యాయని, దీంతో నీటి వినియోగం పెరిగిందన్నారు. 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీని 2018 నుంచి కోరుతున్నామని తెలిపారు. ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు తాత్కాలికంగా నీటి పంపిణీ జరుగాలన్నారు. ఈ ఏడాది నుంచి 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీ జరుగాలని, 50:50 నిష్పత్తిలో నీటి పంపిణీపై రాజీపడేది లేదన్నారు. నీటి పంపిణీపై బోర్డు సత్వరమే నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఏపీ, తెలంగాణ మధ్య 70:30 నిష్పత్తిని అంగీకరించమని ఆయన తేల్చి చెప్పారు.