హైదరాబాద్, నవంబర్ 11 (నమసే ్త తెలంగాణ): అధికారంలోకి వచ్చింది మొదలు.. తెలంగాణకు అన్యాయం చేయటమే పనిగా పెట్టుకున్న కేంద్రంలోని బీజేపీ సర్కారు, ఇదేమి అన్యాయమని గొంతెత్తితే ఎదురుదాడికి దిగుతున్నది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య నీటి వాటాలు తేల్చాలని ఏడేండ్లుగా నెత్తీ నోరూ కొట్టుకుని మొరపెట్టుకున్నా పట్టించుకోని కేంద్రప్రభుత్వం, ఇప్పుడు తెలంగాణ సర్కారు నిర్లక్ష్యం వల్లే ఆలస్యమైందని బుకాయిస్తున్నది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో నీటివాటాల విషయంలో కేంద్రంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సీఎం వ్యాఖ్యలపై కేంద్ర జల్శక్తిశాఖ మం త్రి గజేంద్రసింగ్ షెకావత్ ఢిల్లీలో గురువారం మీడియా సమావేశం ఏర్పాటుచేసి మాట్లాడారు. తమ నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకొనేందుకు విఫలయత్నం చేశారు.
షెకావత్ ఏం మాట్లాడారో, వాస్తవాలేమిటో చూద్దాం
షెకావత్: తెలంగాణ ప్రభుత్వం వల్లే నీటివాటా తేల్చే అంశం ఆలస్యమైంది.
వాస్తవం: అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956లోని సెక్షన్ 3 ప్రకారం ఏదైనా రాష్ట్రం ట్రిబ్యునల్ వేయాలని కోరితే ఏడాదిలోగా ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇది రాష్ర్టాలకు రాజ్యాంగం కల్పించిన హక్కు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకారం కృష్ణా, గోదావరి నదీ జలాల విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నెలలోపే కేంద్ర ప్రభుత్వానికి సీఎం విన్నవించారు. అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం ప్రకారం ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని, లేదంటే ప్రస్తుతమున్న ట్రిబ్యునల్కే ఆ అధికారాలు కట్టబెట్టాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తిపై ఏడాది పూర్తయినా కేంద్రం పట్టించుకోకపోవడంతో తెలంగాణ రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
షెకావత్: సుప్రీం కోర్టులో పిటిషన్ను ఉపసంహరించుకొంటామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఎనిమిది నెలలు ఆలస్యం చేశారు. అక్టోబర్ 6న పిటిషన్ డిస్మిస్ అయింది. ఇప్పటికీ నెలరోజులు మాత్రమే అవుతున్నది.
వాస్తవం: 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో సీఎం కేసీఆర్ ట్రిబ్యునల్ కోసం పట్టుబట్టడంతో ఎట్టకేలకు కేంద్రం ఒప్పుకొన్నది. అందులోనూ ఒక మెలిక పెట్టింది. సుప్రీంకోర్టులో ఉన్న పిటిషన్ను ఉపసంహరించుకొంటేనే ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తామని షరతు విధించింది. కొత్త ట్రిబ్యునల్ వేయాలా? ప్రస్తుతమున్న ట్రిబ్యునల్కే నీటి పంపిణీ అధికారం కల్పించాలా? అనే అంశం మాత్రమే న్యాయసలహా తీసుకోవాలని అపెక్స్ కౌన్సిల్లోనే నిర్ణయించారు.
కేంద్రం షరతు మేరకు రాష్ట్రప్రభుత్వం పిటిషన్ను ఉపసంహరించుకొనేందుకు సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయగా, దీనిపై ఏపీ అభ్యంతరాలను వ్యక్తంచేసింది. దీనితో విచారణ ఆలస్యమైంది. నిజానికి 2020 అక్టోబర్ 6న జరిగిన అపెక్స్ కౌన్సిల్ సమావేశాన్ని గజేంద్ర షెకావతే ఏర్పాటుచేశారు. ఆయన సమక్షంలోనే పిటిషన్ ఉపసంహరణకు ఒప్పందం జరిగింది.
మినిట్స్లోనూ ఈ విషయాన్ని పొందుపర్చారు. అయినా పిటిషన్ ఉపసంహరణను ఏపీ సవాలుచేసింది. ఏపీ అభ్యంతరం చెప్పకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రానిదే. అయినా నోరు మెదపలేదు. దీనికి తెలంగాణ ఎలా బాధ్యత వహిస్తుంది? కావాలనే ఏపీని.. కేంద్రం నియంత్రించలేదు.
షెకావత్: త్వరలోనే ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని పరిష్కరిస్తాం. రివర్ బోర్డుల గెజిట్ను కూడా అమలు చేస్తాం.
వాస్తవం: నిజానికి సుప్రీంకోర్టులోని పిటిషన్ను ఉపసంహరించుకోవాల్సిన అవసరమేదీ లేదని, కేంద్రం ట్రిబ్యునల్ను ఏర్పాటుచేసినా, రిఫర్ చేసినా ఆటోమెటిక్గా పిటిషన్ నిర్వీర్యమై పోయి ఉండేదని న్యాయకోవిదులు, సాగునీటి రంగనిపుణులు చెప్తున్నారు. కేంద్రం కావాలనే ట్రిబ్యునల్ ఏర్పాటు అంశాన్ని నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నది. అందుకు సుప్రీంలోని పిటిషన్ను సాకుగా చూపుతున్నది.