నిజామాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గడిచిన రెండు నెలలుగా తీవ్ర దుమారం రేపుతోన్న ఔట్ సోర్సింగ్ అక్రమ నియామకాల అంశానికి తెర పడింది. 113 మంది నియామకాన్ని రద్దు చేస్తున్నట్లుగా వైస్ ఛాన్స్లర్ రవీందర్ గుప్తా, ఉన్నత విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ సంయుక్తంగా ప్రకటించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ మెయిన్ క్యాంపస్లో శనివారం ఐదు గంటల పాటు సుదీర్ఘంగా పాలక మండలి సమావేశం జరిగింది. ఇందులో యూనివర్సిటీలో కొద్ది రోజులుగా వివాదం అవుతోన్న నియామకాల అంశంతో పాటుగా వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్ పనితీరుపై చర్చ జరిగింది. పాలక మండలి సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి వీసీ, ఇన్చార్జి రిజిస్ట్రార్ తీరుపై మండిపడ్డారు. అక్రమ నియామకాలపైనా నిలదీశారు.
యూనివర్సిటీలో అక్రమంగా నియామకమై రోజువారీగా విధులకు హాజరవుతున్న సిబ్బంది వివరాలను, వారి సంతకాలకు సంబంధించిన హాజరు పట్టికను ఈసీ మీటింగ్లో ప్రస్తావించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు జరిగిన మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకుని వీసీ రవీందర్ గుప్తాతో ప్రకటన చేయించారు. తదనంతరం ఇన్చార్జి రిజిస్ట్రార్గా పని చేయాల్సిన ప్రొఫెసర్ కనకయ్య తన అధికార పరిధిని దాటి వ్యవహరించడం, యూనివర్సిటీలో వివాదానికి ప్రధాన కారణం కావడంతో ఆయనను బాధ్యతల నుంచి తప్పించారు. నూతన రిజిస్ట్రార్గా కామర్స్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ యాదగిరిని నియమించారు.