హైదరాబాద్, జూలై 11(నమస్తే తెలంగాణ): ‘దేశ వ్యవసాయ వృద్ధిలో 6.9శాతంతో తెలంగాణ రాష్ట్రం ఫస్ట్ప్లేస్లో నిలిచింది.. ఆర్బీఐ విడుదల చేసిన హ్యాండ్బుక్లోని లెక్కలే ఇందుకు నిదర్శనం’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశారు. కేసీఆర్ ఏం చేసిన్రు? అని నిత్యం విమర్శించే వాళ్లకు ఆర్బీఐ లెక్కలు చెంపపెట్టు అని అభివర్ణించారు.
భారతదేశంలో వ్యవసాయరంగ అభివృద్ధిపై ఆర్బీఐ హ్యాండ్ బుక్పేరిట విడుదల చేసిన నివేదికపై శనివారం ఆయన ‘ఎక్స్’ వేదికగా స్పందించారు. తమిళనాడు, అస్సాం లాంటి రాష్ర్టాలను వెనక్కినెట్టి తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, 24గంటల ఫ్రీ కరెంట్, పక్కా ప్రణాళికతోనే కేసీఆర్ వ్యవసాయంలో విప్లవం సృష్టించారని చెప్పారు.
కానీ కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత సాగురంగం కుప్పకూలిందని విమర్శించారు. కరెంట్ కోతలు, నీళ్ల కష్టాలు, వడ్లు కొనే దిక్కులేక మళ్లీ రైతాంగం ఆగమయ్యే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పదేండ్లు కష్టపడి నిర్మించిన సాగు వ్యవస్థను కాంగ్రెస్ సర్కార్ నిర్వీర్యం చేస్తున్నదని మండిపడ్డారు.