హైదరాబాద్ : రాష్ట్రంలో రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. పలు ప్రాంతాల్లో రెండు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నైరుతి, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఒకటి, రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు చెప్పింది. ఉపరితల ఆవర్తనం దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల వద్ద ఏర్పడింది.
గాలి విచ్ఛిన్నతి తెలంగాణ రాష్ట్రంపై సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల వరకు ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు చెప్పారు. తెలంగాణపై 1500 మీటర్ల ఎత్తు వరకూ గాలుల విచ్ఛిన్నత ఏర్పడింది. మరోవైపు నైరుతి రుతు పవనాలు బలపడ్డాయని, రానున్న 24 గంటల్లో కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని చెప్పారు. నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయన్నారు. వీటి ప్రభావంతో గురు, శుక్రవారాల్లో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్నారు.
మరోవైపు గురువారం ఉపరితల ఆవర్తనం కారణంగా పలు జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లా కురవిలో ఏడు సెంటీమీటర్ల వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో మోస్తరు వాన కురిసింది. యాదాద్రి భువనగిరి, నల్గొండ, రాజన్న సిరిసిల్ల జిల్లా, మెదక్, వరంగల్ అర్బన్, రూరల్, ములుగు, ఖమ్మం, సూర్యాపేట, నాగర్ కర్నూల్తో పాటు పలు జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురిశాయి.