యావత్తు దేశం ఇవాళ ఆశ్చర్యపోతున్నది. ఎవరూ ఊహించలేదు..ఒక రాష్ట్రం ఏర్పడిన కేవలం ఏడేండ్లలో ఇతర రాష్ర్టాల కంటే ఎన్నెన్నో రెట్లు వృద్ధి పథంలో తెలంగాణ దూసుకుపోతుందని. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దూరదృష్టితో వేసిన ప్రణాళికలు, టీఆర్ఎస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలుచేసిన కార్యాచరణ ఫలితంగా దేశంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా కీర్తి గడించింది. భారత రిజర్వు బ్యాంకు తాజాగా విడుదల చేసిన గణాంకాలలో దాదాపు అన్ని రంగాల్లోనూ టాప్ జాబితాలో నిలిచింది. సామాజిక, వ్యవసాయ, ఉత్పాదక, బ్యాంకింగ్, నిర్మాణ, సేవారంగాల్లో కనీవినీ ఎరుగని రీతిలో దూసుకు పోతున్నది. రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయం చోదకశక్తిగా మారింది. ఏడేండ్లలో అత్యంత వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా తెలంగాణ అగ్రభాగాన నిలిచింది.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అంచనాలు ఉండాలె.. అవగాహన ఉండాలె. రాష్ట్రం ఏర్పడ్డ కొత్తలో ఆర్థికరంగ నిపుణులను, అధికారులను పిలిచి గత బడ్జెట్ పుస్తకాలను పరిశీలించి ఐదేండ్లలో ప్రభుత్వానికి పన్నులు, ఇతర మార్గాలద్వారా సమకూరే నిధి ఎంత? అని పరిశీలించినం. ‘వాట్ ఈజ్ గోయింగ్ టూ బీ ఎకనమిక్ డైనమిక్స్ ఆఫ్ ది స్టేట్ ఇన్ దిస్ వన్ టర్మ్, రెండో టర్మ్’కు ఎంత ఉంటది అని అంచనాలు వేసుకొన్నాం. అప్పుడు మేం వేసుకొన్న అంచనాలు కరెక్ట్టుగా ఉన్నయి. ఇంకా ఎక్కువగానే ఉన్నయి. అందుకే తెలంగాణ ధనిక రాష్ట్రమని నేను గర్వంగా చెప్తా. -ముఖ్యమంత్రి కేసీఆర్, మే, 10,2021
హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ప్రత్యేక రాష్ట్రంగా మారిన తర్వాత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పాలనలో తెలంగాణ అనూహ్య ప్రగతిని సాధించిందని మరోసారి వెల్లడైంది. ఆర్బీఐ తాజాగా విడుదల చేసిన ‘హ్యాండ్బుక్ ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆన్ ఇండియన్ స్టేట్స్-2021’లో ఈ విషయాన్ని స్పష్టం చేసింది. గత ఏడేండ్లలో తెలంగాణ అన్ని రంగాల్లో సాధించిన ప్రగతిని కండ్లకు కట్టింది. జీఎస్డీపీ, జీవీఎస్ఏ వంటి విభాగాల్లో 2013-14తో పోల్చితే గణనీయమైన అభివృద్ధి సాధించిందని అభివర్ణించింది. అభివృద్ధి ఏ ఒక్క రంగానికో పరిమితం కాలేదని, అన్ని రంగాల్లోనూ వృద్ధి నమోదైందని పేర్కొన్నది.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలపై సమానంగా దృష్టిపెట్టడం, విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్లనే సమ్మిళిత వృద్ధి సాధ్యమైందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. 2013-14తో పోల్చితే తెలంగాణ జీఎస్డీపీ ఏకంగా 117 శాతం పెరిగినట్టు ఆర్బీఐ నివేదిక స్పష్టంచేసింది. 2013-14లో తెలంగాణ జీఎస్డీపీ రూ.4.51 లక్షల కోట్లుగా ఉండగా.. 2020-21 నాటికి అది ఏకంగా రూ.9.80 లక్షల కోట్లకు పెరిగింది. అంటే రెట్టింపుకన్నా ఎక్కువని ఆర్బీఐ పేర్కొన్నది. మరోవైపు తలసరి ఆదాయం ఏకంగా 211 శాతం పెరిగినట్టు వెల్లడించింది. 2013-14లో తెలంగాణ ప్రాంత తలసరి ఆదాయం రూ.1,12,162గా నమోదు కాగా.. 2020-21 నాటికి రూ.2,37,632 కు పెరిగిందని తెలిపింది.
ఒక రాష్ట్రం సంపూర్ణంగా అభివృద్ధి చెందాలంటే కీలక రంగాలైన ప్రాథమిక, ద్వితీయ, సేవా రంగాల్లో ప్రగతి కనిపించాలి. గత ఏడేండ్లలో తెలంగాణలో ఇదే జరిగింది. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం వ్యవసాయ రంగం మొదలు విద్య, వైద్యం, పరిశ్రమలు, ఐటీ ఇలా అన్ని రంగాల్లోనూ కీలక సంస్కరణలు తీసుకొచ్చింది. ఫలితంగా ఆయా రంగాల స్థూల విలువ జోడింపు (జీఎస్వీఏ) పెరిగిందని ఆర్బీఐ నివేదిక పేర్కొన్నది. ముఖ్యంగా ఐటీ విభాగం ఉండే సేవారంగంలో 120 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు వెల్లడించింది. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగంలోనూ వందశాతం వృద్ధి నమోదైంది.
ఏడేండ్లలో పెట్టుబడి వ్యయం దాదాపు నాలుగు రెట్లు పెరిగినట్టు ఆర్బీఐ నివేదిక తెలిపింది. పెట్టుబడి వ్యయం 2014-15లో రూ.11,583 కోట్లు ఉండగా, 2020-21 నాటికి 44,145 కోట్లకు పెరిగిందని ఆర్బీఐ తెలిపింది. పెరుగుదల 381 శాతంగా పేర్కొన్నది.
రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో తీసుకొచ్చిన సంస్కరణల ఫలితంగా దవాఖానలు బాగుపడ్డాయి. ప్రజలకు మెరుగైన వైద్యం అందుతున్నది. మరోవైపు మాతాశిశు మరణాలు తగ్గాయని, సగటు జీవనకాలం పెరిగింది. ఇదే విషయాన్ని ఆర్బీఐ నివేదిక ధ్రువీకరించింది. శిశుమరణాలు 2014-15లో ప్రతి వెయ్యి మందిలో 35 నమోదుకాగా, 2018-19 నాటికి 27కు తగ్గినట్టు పేర్కొన్నది. జీవితకాలం 2014-15లో 68.6 సంవత్సరాలుగా నమోదుకాగా 2018-19 నాటికి 69.6 ఏండ్లకు పెరిగినట్టు నివేదిక వెల్లడించింది.
రాష్ట్రంలోని కమర్షియల్ బ్యాంకులు ఇచ్చిన వ్యక్తిగత రుణాల విలువ గత ఆరేండ్లలో దాదాపు మూడు రెట్లు పెరుగడం ఆసక్తికరం. 2015-16లో పర్సనల్లోన్ల విలువ రూ.68,700 కోట్లు ఉండగా 2020-21 నాటికి రూ.2,01,322 కోట్లకు పెరిగింది.
గ్రామీణ బ్యాంకుల్లో డిపాజిట్లు సైతం రెట్టింపు అయ్యాయి. 2015-16లో రూ.10,700 కోట్ల డిపాజిట్లు ఉండగా, 2020-21 నాటికి రూ.20,712 కోట్లకు పెరిగాయని నివేదిక వెల్లడించింది.
రాష్ట్రంలో సగానికిపైగా జనాభా ఆధారపడే వ్యవసాయ రంగాన్ని బాగుచేయడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఇందుకు బహుముఖ వ్యూహాన్ని అమలు చేసింది. ముందుగా మిషన్ కాకతీయతో చెరువులను అభివృద్ధి చేసింది. ఆ తర్వాత కాళేశ్వరం సహా అనేక ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఫలితంగా నడి ఎండల్లో సైతం చెరువులు మత్తళ్లు దుంకాయి. భూగర్భజలాలు సైతం భారీగా పెరిగాయి. రైతుకు భరోసా కల్పించేందుకు రైతుబంధు, రైతుబీమాను అమలు చేసింది. వీటితోపాటు 24 గంటల నాణ్యమైన కరంటు, మార్కెట్ యార్డులు, గోదాములు, రైతు వేదికలు, కల్లాల నిర్మాణం, రోడ్లు, రవాణా వ్యవస్థను ఆధునీకరించడం వంటి అనేక చర్యల ఫలితంగా రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది.
రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అతిపెద్ద సంస్కరణల్లో టీఎస్ ఐపాస్ ఒకటి. రాష్ట్రంలో తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ఓవైపు పరిశ్రమలకు రాయితీలు కల్పించడంతోపాటు మరోవైపు మౌలిక వసతులను అభివృద్ధి చేసింది. టీఎస్ఐపాస్ అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు 17,516 పరిశ్రమలు వచ్చాయి. ఇందులో 15,797 తయారీ రంగ పరిశ్రమలు కాగా 1719 సేవా రంగ పరిశ్రమలు ఉన్నాయి. వీటి ద్వారా రూ.2.21లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. వీటితో 16 లక్షల మందికిపైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పొందారు. ప్రభుత్వం ఆహారం, వైద్యం ఇలా.. ఒక్కో రంగానికి ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటుచేసి పెట్టుబడులను ఆహ్వానించడంతో అనేక రకాల ఉత్పత్తులకు తెలంగాణ కేంద్రంగా మారింది.
ఏడేండ్ల కాలంలో అమేజాన్, యాపిల్, మైక్రోసాప్ట్, గూగుల్, ఫేస్బుక్ వంటి అనేక దిగ్గజ సంస్థలు హైదరాబాద్కు విస్తరించాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో స్థానం పొందిన 20పైగా కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయి. 50 కంటే ఎక్కువ టాప్ మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో కార్యాలయాలు ప్రారంభించాయి. మొత్తంగా రాష్ట్రంలో 1500 ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చినవే. మరోవైపు బ్లాక్ చెయిన్, ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, డ్రోన్స్ అండ్ రోబోటిక్స్, క్లౌడ్, బిగ్ డేటా, స్పేస్ టెక్నాలజీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఫలితంగా సేవారంగంలో రెట్టింపు వృద్ధి నమోదైంది.
గడిచిన ఏడేండ్లలో రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో అనూహ్య ప్రగతి నమోదైంది. పెట్టుబడులు తరలివస్తుండటం, అంతర్జాతీయ ఐటీ కంపెనీలన్నీ తెలంగాణవైపు చూస్తుండటంతో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరిగింది. మరోవైపు వ్యవసాయం లాభసాటిగా మారడం, ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగుల వేతనాలు పెరుగడం, పట్టణీకరణ వేగంగా జరుగుతుండటంతో నిర్మాణ రంగంలో వృద్ధి నమోదైంది.
ఏడేండ్లలో 3.44 రెట్లు పెరిగినట్టు నివేదిక చెప్పింది.
కమర్షియల్ బ్యాంకులు ఇచ్చిన వ్యక్తిగత రుణాల విలువ గత ఆరేండ్లలో మూడు రెట్లు పెరగడం ఆసక్తికరం.
రైతుకు భరోసా కల్పించేందుకు రైతుబంధు, రైతుబీమా, రైతు వేదికలు, కల్లాల నిర్మాణాలతో రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది.
ప్రభుత్వం పలు రంగాలకు ప్రత్యేక క్లస్టర్లను ఏర్పాటు చేయడంతో అనేక రకాల ఉత్పత్తులకు తెలంగాణ కేంద్రంగా మారింది.
రాష్ట్రంలో 1500 ఐటీ కంపెనీలు ఉన్నాయి. ఇందులో చాలా వరకు తెలంగాణ ఏర్పాటు తర్వాత వచ్చినవే. ఫలితంగా సేవారంగంలో రెట్టింపు వృద్ధి నమోదైంది.
రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగంలో అనూహ్య ప్రగతి నమోదైంది. అంతర్జాతీయ ఐటీ కంపెనీలన్నీ తెలంగాణవైపు చూస్తుండటంతో ఆఫీస్ స్పేస్కు డిమాండ్ పెరిగింది.