లచ్చుమమ్మది కల్వకుర్తి నియోజకవర్గం తాండ్ర. పంచాయతీ కార్మికురాలు. నిరుపేద దళిత కుటుంబం. చదువుకోలేదు. నాన్న భాగవతుల పద్యాలు పాడేవాడు. అట్లా ఆమెకు అబ్బింది పాట. సెప్టెంబర్ 16న పాలమూరు ప్రాజెక్టు సభకు బస్సులో కొల్లాపూర్ పోతున్నది లచ్చుమమ్మ. తెలంగాణలో వచ్చిన మార్పును చూసి కేసీఆర్పై అప్పటికప్పుడు పాట కట్టి పాడటం మొదలుపెట్టింది. బస్సులో ఉన్నవాళ్లంతా దరువేస్తూ ఆమెకు వంత పాడుతున్నరు. బస్సుబస్సంతా దద్దరిల్లిపోతున్నది. పక్కనే కార్లో వెళ్తున్న ‘నమస్తే తెలంగాణ యూట్యూబ్ టీమ్’ సుంకరి ప్రవీణ్, నరేందర్కు ఈ దరువు వినిపించింది. వెంటనే బస్సాపి, లోపలికి వెళ్తే, అక్కడొక పరవశం. తన్మయ గానం. లయబద్ధమైన గీతం. నమస్తే టీమ్ వెంటనే వారందరినీ కిందికి దించి, ఆ పాటను రికార్డు చేసింది. అప్లోడ్ చేసిన గంటల్లోనే లక్షల వ్యూస్.
ఆ పాటే.. ‘రామకో రామక’ పాట! ఇవాళ చిన్నా పెద్దా అందరినీ శిగమూగిస్తున్న తెలంగాణ థీమ్ సాంగ్! లచ్చుమమ్మకు ఒక మార్పు కనిపించింది.
రమ్యకు ఇంకో మార్పు కనిపించింది. ఇవాళ పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకూ తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ మార్పు కనిపించింది. బతుకమ్మ ఆటకు బెదిరే దశ నుంచి విమానాల్లో బతుకమ్మను ఊరేగించే వరకు, తాగే నీళ్లు లేని దశ నుంచి ఇంటి ముందటి నల్లా వరకు, ఎండిన చెరువు నుంచి ఎండల్లోనూ నిండిన చెరువు వరకు, పారిపోయే వాగు నుంచి నీళ్లు నిండిన చెక్డ్యామ్ వరకు, మన యాసలో మాటకు సిగ్గుపడే స్థితి నుంచి సినిమా భాషగా మారిన చిత్రం వరకు, పడావు భూముల దశ నుంచి పంట భూముల వైభవం వరకు, అత్తాకోడళ్ల కొట్లాటల నుంచి సంక్షేమ సామరస్య కుటుంబం వరకు, వీపుకంటిన డొక్కల నుంచి వీధి బడుల్లోనూ సన్నన్నం వరకు, వలసపోయే బతుకుల నుంచి వలస జీవులకు ఆశ్రయం వరకు, రుధిర ధారల ఊరు హరితహారంగా మారడం వరకు, కర్ఫ్యూ కల్లోల భాగ్యనగరం అమెరికాను తలదన్నే సౌభాగ్యనగరిగా మారడం వరకు, బంజరు భూముల బాధల నుంచి బంగరు నేలల సింగారం వరకు, అరకొర వేతనాల నుంచి అత్యధిక జీతాల ఉద్యోగుల వరకు, హైదరాబాద్ కామన్జోన్ నుంచి 95 శాతం ఉద్యోగాలు మన పిల్లలకే దక్కేవరకు, వేదనావృత అవమానాల నుంచి వరిష్ట పురస్కారాల కీర్తి వరకు, 10 జిల్లాల నుంచి 33 జిల్లాల వరకు, 459 మండలాల నుంచి 612 మండలాల వరకు, భయం నుంచి భద్రమైన బతుకు వరకు! మార్పును చూసింది తెలంగాణ.
నిజమైన మార్పు. సహజమైన మార్పు. కండ్లముందు కనిపిస్తున్న మార్పు. మనం రోజూ అనుభవిస్తున్న మార్పు. మన బతుకులను మార్చిన మార్పు. మార్పు వచ్చింది తెలంగాణలో. తెలంగాణ వాళ్లకే కాదు. జీవిత పర్యంతం తెలంగాణను వ్యతిరేకించిన వారికి, కేసీఆర్ను శత్రువుగా పరిగణించిన వారికి సైతం ఈ ప్రాంతంలో ఒక మార్పు కనిపించింది. ఒక్క కాంగ్రెస్ వాళ్లకు తప్ప!
ఒక రాజకీయ పార్టీగా కాంగ్రెస్ మార్పు కోరుకుంటున్నది. అందుకు దాని కారణాలు దానికున్నాయి. అది పదేండ్ల నుంచి ప్రతిపక్షంలో ఉన్నది. అంతకుముందు అధికారంలో ఉన్నా, ఆంధ్రా నేతలకు తాన తందాన అన్న తెలంగాణ నాయకులకు దక్కింది తక్కువ. దీంతో ముఖ్య నేతలు ఆకలితో ఆవురావురంటున్నారు. నెలవారీ కప్పాలు అందక అధిష్ఠానం అలమటిస్తున్నది. పదవులు లేక చిన్న నేతలు పరేషాన్ అవుతున్నారు. ఒక పార్టీగా కాంగ్రెస్ మనుగడే ప్రశ్నార్థకమైంది. ఈసారి ఓడిపోతే ఇక రాజకీయపక్షంగా కొనసాగడమే కష్టమని అర్థమైంది. రాజస్థాన్ సొమ్ము పెట్టి కర్ణాటకలో గెలిచినట్టు, కర్ణాటక సొమ్ము పెట్టి తెలంగాణలో గెలిస్తే, తెలంగాణ సొమ్ము పెట్టి లోక్సభ ఎన్నికల్లో సీట్లు కొట్టవచ్చని, వీలైతే మోదీ ప్రభుత్వాన్ని మార్పు చేయవచ్చని కాంగ్రెస్ ఆశపడుతున్నది. మార్పుపై దాని ఆశ దానిది. అందువల్ల అది మార్పు కావాలి అని పాట కట్టుకుని పాడుకోవడంలో అర్థముంది. మరి పాడువడే మన బతుకు పరిస్థితి?!
వ్యవసాయానికి 24 గంటలున్న మన కరెంటును మూడు గంటలకు తగ్గించుకోవాలె. ఏమన్న కరెంటు మిగిలితే దాన్ని కోతలతో కష్టపడుతున్న కర్ణాటకకు ఉదారంగ ఇవ్వాలె.
ఇదొక మార్పు!
3 గంటల్లోనే పొలం పారించుకోవడానికి, ఉన్న మోటరును తెగనమ్ముకుని,50 వేలు పెట్టి కొత్త 10 హెచ్పీ మోటరు కొనుక్కొచ్చుకోవాలె.
ఇదొక మార్పు!
మూడు గంటల కరెంటు మురిపెంగా మధ్యరాత్రి వస్తే, కరెంటు షాక్లకు, పాము కాట్లకు మన బతుకును బలిగా పెట్టాలె.
ఇదొక మార్పు!
మన భూములు, మంది దున్నుకునేందుకు వీలుగా ధరణిని రద్దు చేసుకొని, ఇక మీ దయ మా ప్రాప్తమని దండం పెట్టాలె.
ఇదొక మార్పు!
రెవెన్యూ రికార్డుల్లో 56 కాలమ్స్ పెడితే వాటన్నింటినీ నింపిచ్చుకోవడానికి పని బంజేసి మరీ పట్వారీ, గిర్దావర్ చుట్టూ తిరగాలె.
ఇదొక మార్పు!
రాచకొండ రైతులు ఎకరాలకెకరాల విలువైన భూమిని సర్కారు వారికి (అంటే అందులోని ఇన్సైడ్ ట్రేడర్లకు) అప్పగించి, గజాల్లో వాటాలు తీసుకొని, ఫెయిలైన అమరావతి మాడల్లో వచ్చే బిచ్చం కోసం సచ్చిపోవాలె.
ఇదొక మార్పు!
హైదరాబాద్లో వీధి వ్యాపారులు ఎవరున్న చోట వారు కాకుండా, కిలోమీటర్ల కొద్దీ బండిని తీసుకుపోయి, తోసుకుపోయి సొరంగాల్లో వ్యాపారం చేసుకోవాలె.
ఇదొక మార్పు!
రైతుబంధు దుబారాను కాంగ్రెసోళ్లు ‘అరికడితే’ పెట్టుబడికి అప్పు కోసం మనం మళ్లీ షావుకారు ముందు చేతులు కట్టుకొని నిలబడాలె. అడ్డికి పావుసేరుకు వడ్లు కొల్వాలె.
ఇదొక మార్పు!
ఎరువుల కోసం దుకాణం ముందు చెప్పులు వరుసలో పెట్టి, కాలికి పొక్కులొచ్చేటట్టు గాలికి తిరగాలె.
ఇదొక మార్పు!
మహారాష్ర్టోడు గోదావరికి, కర్ణాటకోడు కృష్ణాకు కట్టలు కడితె, నీళ్ల కోసం ఢిల్లీకి మోకాళ్ల యాత్ర చేసి, పెద్దల కాళ్లు మొక్కాలె.
ఇదొక మార్పు!
కర్ణాటకోడు హైదరాబాద్ కంపెనీల్ని తరలించుకపోతా అంటే తలవంచుకొని సమ్మతించాలె.
ఇదొక మార్పు!
వారి వారి ఆంధ్రా ఫ్రెండ్స్ మళ్లీ భాగ్యనగరి శివార్ల మీద పడి భూములు దందా చేస్తమంటే, నీ బాంచెన్ అంటూ అదిరి బెదిరి పైసో ముడికాలో తీసుకొని పానం కాపాడుకోవాలె.
ఇదొక మార్పు!
ఎత్తిపోతలకు కరెంటు వేస్టని కరాఖండిగ తీర్మానిస్తే, ఉన్న భూమిని పడావు పెట్టుకొని ముంబాయికో, దుబాయికో,బొగ్గుబాయికో వలస పోవాలె.
ఇదొక మార్పు!
పడావుపడ్డ భూములపై పంచాయతీ పెట్టుకొని, తుపాకులు పట్టుకొని అడవుల్లోకి పోవాలె.
ఇదొక మార్పు!
సాంకేతికంగా ఇవ్వాల్సిన అవసరం లేకున్నా, నష్టపోతున్నట్టు తెలిసినా’ తెలంగాణ ఇచ్చిన సోనియాకు, మరే విలీనంతోనన్న లాభం జరుగుతుందనుకుంటే, ఇచ్చినోళ్లకు తీసుకునే హక్కు కూడా ఉందనే ‘పెద్ద మనుషుల ఒప్పందాలకు’ కట్టుబడి, నోర్మూసుకుని తెలంగాణను ఇంకెవరితోనన్నా విలీనం చెయ్యాలె! ఇది చిట్టచివరి మార్పు!
ఎన్ని మార్పులో! ఈ మార్పులన్నీ రావాలంటే ‘మార్పు కావాలి’ పాట వినాలె. తర్వాత కాంగ్రెస్ ఆడించినట్టల్లా ఆడాలి. ఎందుకంటే 60 ఏండ్ల పాటు ఈ మార్పులన్నీ మనం చూడనివా? మనకు తెల్వనివా?
అయినా మార్పంటే ఏమిటి? మార్పు ఎటు నుంచి ఎటు జరగాలి? చెడు నుంచి మంచికా? మంచి నుంచి చెడుకా? వెనుక నుంచి ముందుకా? ముందు నుంచి వెన్కకా? పాత నుంచి కొత్తకా? కొత్త నుంచి పాతకా? గతం నుంచి భవిష్యత్తుకా? వర్తమానం నుంచి గతానికా? అసలు మార్పెందుకు? మార్పు మంచి కోసం జరగాల్నా? మంచిని పోగొట్టుకునేందుకు జరగాల్నా? మార్పంటే ముందుకు తీసుకుపోయేది. కాంగ్రెస్ చెప్తున్న మార్పంటే మనం మరింత వెనక్కు పోవాలె. ఉన్నవి రద్దు చేసి వెన్కకు తీస్కపోయేటోళ్లు ఏం మార్పు తెస్తరు? పాటైనా, మార్పైనా జనంలోంచి రావాలె. స్టూడియోలోంచి కాదు. లచ్చుమమ్మ రాసిన రామక పాట జనం పాట. మార్పు పాట స్టూడియో పాట. స్టూడియోలో పుట్టిన గ్రాఫిక్లు పొరుగు రాష్ట్రం ప్రజలను ఎంత మోసం చేసినయో మనం చూడలేదా? అయినా ఎన్నికల కోసం ఒక పాటను పుట్టించుకోలేక రామక పాటను కాపీ కొట్టినవాళ్లు, భాగ్యనగరి అభివృద్ధికి సొంత ఐడియా లేక అమరావతి మాడల్ను కాపీ కొట్టేవాళ్లు, కేసీఆర్ పథకాలను నకలు కొట్టడం తప్ప ఒక్క సృజనాత్మక స్కీంను ఆవిష్కరించలేని వాళ్లు, రేపు తెలంగాణలో ఏం మార్పు తేగలరు? తెగటార్చటం తప్ప! ఇలాంటి వాళ్ల కోసమని మనం మార్పు కోరుకోవాలా? అంటే పైన జరిగినవన్నీ వాపస్ పోవాలనా? ఏం మార్పు? ఎందుకు మార్పు?
ఊడగొట్టిన మా తెలంగాణను మాకివ్వండని 62 ఏండ్లు (1952- 2014) ఉద్యమం చేస్తే, 33 పార్టీలను ఒప్పించి మెప్పిస్తే, తప్పనిసరై రాష్ట్రమిచ్చిన కాంగ్రెస్కు, కృతజ్ఞత చూపమంటారిప్పుడు! అందుకు మార్పు పాట పాడుతారు. మార్పును ప్రవచిస్తున్నవారు గతంలోనూ మనల్ని పరిపాలించారు. మరి వారు ఎట్లున్న మన ప్రాంతాన్ని ఎట్లా మార్చారు? ఎట్లున్న మనల్ని ఎట్లా మార్చారు? మన బతుకుల్లో ఎంత దుర్భరమైన మార్పు తెచ్చారు? ఇదీ మనం ఆలోచించాలె! వాళ్లు అప్పుడే మనందరి కోసం వ్యవస్థలో మంచి మార్పే తెచ్చి ఉంటే, అసలు రాష్ట్ర విభజన అన్న భారీ మార్పే అవసరమై ఉండేది కాదు కదా! అందుకోసం మనందరం కొట్లాడాల్సిన పనే లేకుండె కదా! వందల మంది తెలంగాణ యువకులు అమూల్యమైన తమ ప్రాణాలను బలిపెట్టాల్సిన అవసరమే వచ్చేది కాదు కదా! ఒక హత్యా నేరానికే 14 ఏండ్ల జీవిత ఖైదు, ఉరిశిక్ష విధిస్తారు. మరి తెలంగాణలో వందలాది మంది ఆత్మ-‘హత్యలకు’ కారకురాలైన కాంగ్రెస్కు ప్రజలు ఎన్నేండ్లు శిక్ష వేయాలి?
23 ఏండ్ల కిందట కేసీఆర్ తెలంగాణ ప్రజల జీవితాల్లో మార్పు కోరుకున్నడు. ఆ మార్పును సాధించడం కోసం పార్టీని వదులుకున్నడు. పదవులు వదులుకున్నడు. స్నేహాలు వదులుకున్నడు. వ్యక్తిగత జీవితాన్ని వదులుకున్నడు. మరి ప్రత్యర్థులు? తెలంగాణ కోసం పార్టీ మారనివాళ్లు ఇప్పుడు పదవుల కోసం మాత్రం పార్టీ మారారు. వాళ్లకు అధికారం కోసం మనల్ని అన్నీ వదులుకొమ్మంటున్నరు. అదీ తేడా! ‘తెలంగాణ కోసం తాను’ అన్నది కేసీఆర్ సిద్ధాంతమైతే, ‘తమ కోసం తెలంగాణ’ అన్నది కాంగ్రెస్ రాద్ధాంతం. కాంగ్రెస్ను ఓడించడానికి 60 ఏండ్ల కారణాలున్నాయి. గెలిపించడానికి ఒక్కటీ లేదు. టీఆర్ఎస్ను గెలిపించడానికి పదేండ్ల కారణాలున్నాయి. ఓటేయకపోవడానికి ఒక్కటీ లేదు. కేసీఆర్ పాలనలో తెలంగాణలో మనకొచ్చిన కష్టం ఏమిటి? నష్టం ఏమిటి? అంతో ఇంతో ఎంతో కొంత మంచే జరిగింది తప్ప చెడు జరగలేదు కదా! ఎవరి దుర్గతిలోనో మార్పు తెచ్చేందుకు, మనం సాధించుకున్న మంచిని మార్పు చేసుకుంటమా? అవసరమా?
మార్పు ఎప్పుడూ పాజిటివ్.జాతిని గెలిపించాలనుకునే వ్యక్తి ఒకవైపు, అతన్ని ఓడించాలనుకునే వ్యక్తులు ఇంకోవైపు. ఒకరి ఓటమిలో జాతి ఓటమిని చూస్తున్నరు వాళ్లు. ఒకరి గెలుపులో జాతి గెలుపును చూస్తున్నం మనం. అధికారంలో మార్పు కాదు. ప్రజల జీవితాల్లో మార్పు అంతిమం.
ఆ అంతిమ లక్ష్యం దిశగా సాగుతున్నన్ని రోజులు గుణాత్మకమైన మార్పు జరుగుతున్నట్టే లెక్క. కేసీఆర్ తన ఇంట్లోంచి తెచ్చిస్తున్నాడా? అన్నవాళ్లు ఇప్పుడు ఆరు గ్యారెంటీలు, 42 పేజీల హామీలు ప్రకటించారు. మరి వాళ్లు వాళ్ల ఇంట్లోంచి తెచ్చిస్తారా? మార్పును నెగెటివ్గా చూసేవాడికి రాజకీయం ఒక ఈగో. సంక్షేమం దుబారా అంటున్నవాడు కత్తిరించకమానడు. ఏదో విధంగా అధికారంలోకి రావాలనుకున్నప్పుడు ప్రజలు ప్రజలుగా కాదు; ఓటర్లుగా మాత్రమే కనిపిస్తారు. అప్పుడే ‘ఆయన ఇంట్లకెల్లి ఇస్తున్నడా’ అన్నమాట మరుపుకు వచ్చి, ఆరు గ్యారెంటీలు, 42 పేజీల హామీలు తెరమీదికి వస్తయి. ఇక్కడ అడగాల్సిన ప్రశ్న.. ‘మరి వీళ్లు వీళ్ల ఇంట్లకెల్లి ఇస్తరా?’ కాంగ్రెస్ ఇప్పుడు ఆ పరిస్థితిలోనే ఉంది. మార్పు కేవలం నినాదం కాదు. అది ఒక ప్రాసెస్. ఆ ప్రాసెస్ను అమలుచేసిన చరిత్ర కాంగ్రెస్కు గతంలోనూ లేదు. ఇప్పుడు వర్తమానంలోనూ, ఏ రాష్ట్రంలోనూ లేదు. మార్పంటే ఏమిటి? కేవలం అధికార హోదాల్లో మాత్రమే మార్పా?… లేక మనుషుల మార్పా? మనసుల మార్పా? జీవితాల మార్పా? సిద్ధాంతాల మార్పా? పార్టీల మార్పా? నాయకత్వాల మార్పా? ఇందులో దేన్ని తీసుకున్నా తెలంగాణకు కాంగ్రెస్ అక్కర్లేదు.
మనం మన పీవీని దక్షిణాది నుంచి ఏకైక ప్రధానిగా చేసుకున్నం. తెలంగాణగా చరిత్ర సృష్టించినం. ఇప్పుడు కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎంగా చేసుకుందాం. దక్షిణాదిలో ఏకైక హ్యాట్రిక్ సీఎం తెలంగాణ నుంచే అని రికార్డు సృష్టిద్దాం.
నన్ను కలవడానికి లచ్చుమమ్మ వచ్చినపుడు.. ‘నీకెందుకు పాటకట్టి పాడాలనిపించింది?’ అని నేనడిగిన! పాటే తప్ప మాట పెద్దగా రాదామెకు. సిగ్గరి. ఒక్క వాక్యంలో జవాబు చెప్పింది. ‘తెలంగాణకు ఎవలేం జేసిన్రు సర్? సారు లేకుంటె ఏమయ్యేది గతి? మన బతుకుల్ల గింత మార్పు రావడానికి కారణం గాయిన్నే గద. అందుకే పాట కట్టాలనిపించింది’. సూటిగా చెప్పింది లచ్చుమమ్మ!
నడి వయసున్న లచ్చుమమ్మ తన జీవితకాలంలో ఒక మంచి మార్పును చూసింది.
పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం కమాన్పూర్ మండలం పెంచికల్పేటకు చెందిన రమ్య. దాదాపు 40 ఏండ్ల వయసున్న ఆమె తన జీవితకాలంలోనే ఎన్నడూ చూడని మార్పును చూసింది. ‘67-70 ఏండ్లు పరిపాలించింది కాంగ్రెస్. కానీ, మనకు రైతుబీమా లేదు. రైతుబంధు లేదు. వాటర్ లేదు. నీళ్ల ప్రాబ్లం చేయవట్టి ఎకరాలకు ఎకరాలు బీడువడ్డ భూములున్నయి. అప్పుడెవ్వలు చూడలేదా? ఇప్పుడు నీళ్లొచ్చినయి. నేను, మా ఆయన, ఇద్దరు పిల్లలు గలిసి 30 ఎకరాలు చేస్తున్నం. నిరుడు 40 ఎకరాలు చేసినం. గుడిసెల ఉన్నా మాకో 8 ఎకరాలుంది. కేసీఆర్ పదవిలకు ఒచ్చినంక మేం ఇంకా ఎదిగిపోయినం. మంచిగున్నదిప్పుడు. మన అన్నే వెడ్తలేడు ఇయ్యాల పదివేల రూపాయలు. ఆడిపిల్ల పెండ్లికి కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తండు. మనకు ఒక చీర గావాల్నంటే దొరకదు. పది చీరలు తీసుకున్నం కేసీఆర్ చేయవట్టి..’ ఇట్లా గడగడా చెప్పుకొంటూ పోయింది రమ్య.
దాదాపు 40 ఏండ్ల వయస్సున్న రమ్య తన జీవితకాలంలో ఒక మార్పును చూసింది.
‘ఇంత ఆదాయం ఎక్కడపోయింది అప్పుడు మనకు? ఒక్కనాడు రూపాయి సాయం చేయలే కాంగ్రెస్ కొడుకు. ఒక్కనాడు మన బీదల దిక్కు సూసినోడే లేడు. వాని రాష్ర్టానికే వాడు మంచిగ చేసుకున్నడు. రైతుబంధు ఎవరిచ్చిరయ్యా ఎవరిచ్చిన్రు? మనం చిన్నగున్న నాటినుంచి ఎవరిచ్చిన్రు? ఇంత పింఛను ఎవరిచ్చిన్రు? రైతులు చనిపోతే 5 లక్షలు ఎవడిచ్చిండు?కాన్పులకు పైసలు ఎవరిచ్చిన్రు? పెండ్లిళ్లకు పైసలు ఎవరిచ్చిన్రు? ఆ మహారాజే ఇస్తున్నడు. అందరికీ చేస్తున్నడు, ఇస్తున్నడు, తింటున్నం’ ఇదీ సోషల్ మీడియాలో ఒక ముసలవ్వ మాట.
ఆ ముసలవ్వ తన జీవితకాలంలో ఒక మార్పును చూసింది!
పరశురాం తన జీవితకాలంలో ఒక మార్పును చూసారు!