ముగ్గురు రాష్ట్ర మంత్రులు.. మున్సిపల్ మంత్రి కేటీఆర్, వ్యవసాయ మంత్రి నిరంజన్రెడ్డి, పౌర సరఫరాల మంత్రి గంగుల కమలాకర్… టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావు, లోక్సభలో నాయకుడు నామా నాగేశ్వర్రావు, పది మంది రాష్ట్ర ఎంపీలు… ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, పౌరసరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, ఇద్దరు కేంద్ర మంత్రులు..
ఇదీ తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్లిన ఉన్నతస్థాయి బృందం
వీళ్లు కేంద్రానికి వేసిన ప్రశ్నలు మూడే!
ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పినదే మళ్లీ నిజమైంది.. రాష్ట్ర బీజేపీ నేతల తలా తోకా లేని వాదనలను బుట్ట దఖలా చేస్తూ కేంద్ర ప్రభుత్వం మరోసారి తన వైఖరినే పునరుద్ఘాటించింది. వరి సాగును ప్రోత్సహించ వద్దని రాష్ర్టానికి విస్పష్టంగా సూచించింది. యాసంగి బియ్యం కొనుగోలుపై మరోసారి దాటవేత మార్గాన్నే ఎంచుకుంది. అదే నాన్చుడు.. అదే సాచివేత.. బాయిల్డ్ రైస్ కొనేది లేనే లేదు.. కొనే ధాన్యం ఎంతో చెప్పరు. రాష్ట్రం నుంచి వెళ్లిన అత్యున్నస్థాయి బృందం మూడున్నర గంటలపాటు సుదీర్ఘంగా చర్చించి.. వివరించినా.. ఇద్దరు కేంద్ర మంత్రులు ఏమీ తేల్చకుండానే మళ్లీ వాయిదా వేశారు. ధాన్యం కొనుగోలుపై స్పష్టత ఇవ్వాల్సిందేనని మన రాష్ట్ర బృందం పట్టుబట్టాక కూడా రెండు రోజుల్లో చెప్తామని దాటవేయజూశారు. అప్పటిదాకా ఇక్కడే ఉంటామని చెప్పడంతో 26వ తేదీన సమావేశాన్ని ఫిక్స్ చేశారు. మీరు ఏదో ఒకటి చెప్పాలని, బియ్యం కొను గోలుపై తేల్చుకున్నాకే రాష్ర్టానికి తిరిగి వెళ్తామని మన మంత్రుల బృందం వారికి స్పష్టం చేసింది.
హైదరాబాద్, నవంబర్ 23 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోలుపై కేంద్రం మళ్లీ ముఖం చాటేసింది. ముగ్గురు మంత్రులు, లోక్సభ, రాజ్యసభ టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతలు, పది మంది ఎంపీలు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక, పౌరసరఫరాల కార్యదర్శులు.. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రభుత్వ కీలక యంత్రాంగం యావత్తూ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆహారశాఖ మంత్రి పీయూష్ గోయల్, వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ను కలిసి ధాన్యం కొనుగోలుపై కేంద్రాన్ని ఒప్పించడానికి చేసిన ప్రయత్నాలు ఫలించనేలేదు. యాసంగిలో వడ్లను కొనేది లేదని కేంద్రం కరాఖండిగా తేల్చి చెప్పింది. వానకాలం వరి ధాన్యాన్ని ఎంత కొంటామనే విషయంపైనా నాన్చివేత ధోరణినే కొనసాగించింది. యాసంగిలో పండే బాయిల్డ్ రైస్ కొనుగోలు చేయమని కరాఖండిగా తేల్చిచెప్పిన కేంద్రం. కేంద్రం నిర్ణయంతో బాయిల్డ్ రైస్ చరిత్రపుటల్లోకి వెళ్లనున్నది.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాలమేరకు రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఉన్నతాధికారుల బృందం మంగళవారం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్, కేంద్ర పౌరసరఫరాలశాఖ మంత్రి పీయూష్ గోయల్తో విడివిడిగా మూడున్నర గంటల పాటు సుదీర్ఘంగా రాష్ట్రమంత్రులు సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర అధికార బృందం.. రాష్ట్ర రైతాంగం, వడ్ల కొనుగోలు అంశంపై చర్చించింది. రాష్ట్రంలో ఇప్పటికే సాగు అయిన వానకాలం వరిధాన్యం కొనుగోలుచేయాలని, రానున్న యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంపై ముందుగానే స్పష్టతనివ్వాలని కోరుతూ రాష్ట్ర రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర వ్యవసాయ సంబంధిత అంశాలపై వివరించింది.
అయినా కేంద్రం ఎటూ తేల్చకుండా, తిరిగి ఈనెల 26న మరోసారి సమావేశమవుదామని చెప్పింది. మంత్రి కేటీఆర్ బృందంలో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్తోపాటు టీఆర్ఎస్ పార్లమెంటరీపార్టీ నేత ఎంపీ కే కేశవరావు, లోక్సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు, ఎంపీలు సురేశ్రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, గడ్డం రంజిత్రెడ్డి, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్రెడ్డి, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, కొత్తా ప్రభాకర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, పౌరసరఫరాల శాఖ కమిషనర్ అనిల్ కుమార్, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘనందన్రావుతో కూడిన ఉన్నతస్థాయి ప్రజా ప్రతినిధులు, అధికారుల బృందం ఈ సమావేశంలో పాల్గొన్నారు.
తెలంగాణ రైతు ఈ వానకాలంలో పండించిన వరిధాన్యం కొనుగోలు అంశంపై కేంద్ర ప్రభుత్వం ఎటువంటి స్పష్టతనివ్వలేదు. అయితే వచ్చే యాసంగిలో బాయిల్డ్ రైస్ను కొనబోమని చెప్పిన కేంద్రం.. మామూలు బియ్యాన్ని ఎంతమేరకు కొంటామనే విషయాన్ని తేల్చలేదు. దేశంలో ధాన్యం పొర్లిపోతున్నదని, అందువల్ల వరి సాగును తగ్గించాల్సిందేనని తేల్చిచెప్పింది. రైతులను ఇతర పంటలవైపు మళ్లించాలని కోరింది. ఈ విషయంపై ఈ నెల 26న స్పష్టం చేస్తామని కేంద్ర మంత్రులు.. రాష్ట్ర ప్రతినిధి బృందానికి తెలిపారు. తెలంగాణలో యాసంగిలో వేసే వరి ద్వారా వచ్చేదే బాయిల్డ్ రైస్ అని రాష్ట్ర బృందం కేంద్ర మంత్రులకు వివరించింది. తెలంగాణలో ఉష్ణోగ్రతలు పెరగటం వల్ల యాసంగిలో తక్కువ నూకతో ఎక్కువ బియ్యం రావడం కష్టమని, బాయిల్డ్ రైస్ తప్పదని తెలంగాణలోని వాతావరణ పరిస్థితులు, పంట దిగుబడి గురించి పూసగుచ్చినట్టు వివరించినా.. కేంద్ర మంత్రులకు వినిపించలేదు.
మన రైతుల గోస కనిపించలేదు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కేసీఆర్ డిమాండ్ మేరకు ధాన్యం కొనుగోలు పరిమితిని మరి కొంత పెంచుతామని మాత్రం హామీ ఇచ్చారు. తెలంగాణలో వరిసాగు విస్తీర్ణం మీద కేంద్రం ఓ స్పష్టతకు వచ్చింది. 62.13 లక్షల ఎకరాల్లో తెలంగాణ రైతులు వరిసాగు చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొనగా.. కేంద్రం మాత్రం తెలంగాణ వరి సాగు విస్తీర్ణాన్ని 58.66 లక్షల ఎకరాలుగా కేంద్రం ధృవీకరించింది. అయినప్పటికీ ఎంత వరి ధాన్యాన్ని కొనే అంశాన్ని కేంద్రం పెండింగ్లో పెట్టింది. మంత్రి కేటీఆర్ బృందం కేంద్రంతో చర్చల సందర్భంగా సందర్భంగా లేవనెత్తిన అంశాలపై ఈనెల 26న మరింత స్పష్టతతో తమ నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నది. 26 వరకు మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారుల బృందం ఢిల్లీలోనే ఉండి కేంద్రం నిర్ణయంపై తెలుసుకొన్నాకే రాష్ర్టానికి తిరిగిరావాలని నిర్ణయించారు.
ప్రతి ఏటా ఎంత ధాన్యం కొంటామనే విషయంలో వార్షిక ధాన్యం కొనుగోలు టార్గెట్ ను ముందస్తుగానే ప్రకటించాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ డిమాండ్కు కేంద్రం సానుకూలంగా స్పందించింది. ఇది దేశ రైతాంగానికందరికీ వర్తింపచేయాల్సిన విలువైన సూచనగా కేంద్రం అభిప్రాయపడింది. మంత్రి వర్గ బృందంతో చర్చల సందర్భంగా ఈ మేరకు సీఎం కేసీఆర్ సూచనను కేంద్రం అభినందించింది. ఇకనుంచి వార్షిక వరిధాన్యం కొనుగోలు వివరాలను ముందస్తుగానే ప్రకటిస్తామని, రానున్న సంవత్సరం నుంచే ఈ నూతన విధానాన్ని అమల్లోకి తెస్తామని స్పష్టం చేసింది. ఒక్క తెలంగాణకే కాకుండా ఈ నూతన విధానాన్ని రాష్ట్రాలకూ వర్తింపచేస్తామన్నది. అయితే ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చే వరకు రాష్ట్ర రైతాంగం తొందరపడకుండా యాసంగి వరి విషయంలో వేచి చూడాలని అభిప్రాయం వ్యక్తం అవుతున్నది.